POLAVARAM: ఆలస్యమనుకుంటే.. మీరే డిజైన్లు ఖరారు చేసుకోండి: డీడీఆర్‌పీ

author img

By

Published : Apr 29, 2022, 1:23 PM IST

POLAVARAM

POLAVARAM: పోలవరం ప్రాజెక్టు డిజైన్లకు సంబంధించి కేంద్ర జలసంఘం విశ్రాంత ప్రముఖుడు ఒకరితో ఏపీ జలవనరులశాఖ ఉన్నతాధికారి వాగ్వాదానికి దిగారన్న అంశం చర్చనీయాంశమైంది. ప్రాజెక్టు డిజైన్ల ఖరారులో డీడీఆర్‌పీ బాగా ఆలస్యం చేస్తోందని,.. దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాష్ట్ర జలవనరులశాఖ అధికారి తప్పు పట్టినట్లు సమాచారం.

POLAVARAM: పోలవరం ప్రాజెక్టు డిజైన్లకు సంబంధించి కేంద్ర జలసంఘం విశ్రాంత ప్రముఖుడు ఒకరితో ఏపీ జలవనరులశాఖ ఉన్నతాధికారి వాగ్వాదానికి దిగారన్న అంశం తాజాగా చర్చకు తావిస్తోంది. ప్రాజెక్టులో అనేక సవాళ్ల పరిష్కారానికి సంబంధించిన అంశాల్లో నిర్దిష్ట విధానాన్ని ఖరారు చేసేందుకు చర్చోపచర్చలు సాగుతున్నాయి. కేంద్ర జలసంఘం నిపుణులు, డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ (డీడీఆర్‌పీ), ఐఐటీల నిపుణులు, ఏపీ జలవనరులశాఖ, పోలవరం అధికారులు తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక సమావేశంలో ఈ వివాదం చోటుచేసుకుందని తెలిసింది.

ప్రాజెక్టు డిజైన్ల ఖరారులో డీడీఆర్‌పీ బాగా ఆలస్యం చేస్తోందని, దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాష్ట్ర జలవనరులశాఖ అధికారి తప్పు పట్టినట్లు తెలిసింది. సాక్షాత్తూ కేంద్ర జలసంఘంలో కీలక స్థానంలో పనిచేసి ప్రస్తుతం డీడీఆర్‌పీలో కీలక పాత్ర పోషిస్తున్న ఆయనతోనే నేరుగా సమావేశంలో ఈ అంశం ప్రస్తావించినట్లు చెబుతున్నారు. ప్రధాన రాతి, మట్టికట్టతో డ్యాం నిర్మించాల్సిన చోట గోదావరి నదీగర్భంలో ఇసుక కోత పడి పెద్ద గుంతలేర్పడిన సంగతి తెలిసిందే. మరోవైపు డయాఫ్రంవాల్‌ ధ్వంసమైన విషయంలోనూ పరిష్కారాలపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ప్రధానడ్యాం నిర్మించాల్సిన ప్రాంతంలో దాదాపు కి.మీ.మేర నదిలో నీరు లోతుగా ఉంది. ఈ ప్రాంతంలో గుంతలు పూడ్చాలంటే నీటిని తోడేయాల్సిందేనని కేంద్ర జలసంఘం సభ్యులు పేర్కొంటున్నారు.

నీటిని తోడేయడంకన్నా డ్రెడ్జింగ్‌ విధానంలోనే ముందుకెళ్లవచ్చని ఎప్పటినుంచో మరో ప్రతిపాదన ఉంది. కేంద్ర జలసంఘం నిపుణులు నీటి తోడివేత తర్వాతే అక్కడ గుంతలు పూడ్చాల్సి ఉంటుందని చెబుతూ వచ్చారు. నీటి తోడివేత, డ్రెడ్జింగ్‌.. రెండింటి అంచనాలు రూపొందించాక చివరకు డ్రెడ్జింగే ఖరారైంది. ఈ క్రమంలో ఏపీ జలవనరులశాఖ అధికారి కేంద్ర నిపుణులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముందే డ్రెడ్జింగుకు నిర్ణయం తీసుకుంటే సరిపోయేదనడంతోపాటు డిజైన్ల ఖరారులో ఆలస్యం చేస్తున్నారని ఆ అధికారి కేంద్ర నిపుణుల ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో డీడీఆర్‌పీలోని ఆ ముఖ్యుడు నొచ్చుకున్నట్లు తెలిసింది. ‘మా వల్ల డిజైన్లు ఆలస్యమవుతున్నాయని భావిస్తే తప్పుకుంటాం. డిజైన్లు మీరే ఖరారు చేసుకుని ప్రాజెక్టు నిర్మించుకోండి’ అని ఆయన ఆగ్రహించినట్లు తెలిసింది.

డ్రెడ్జింగ్‌కు గడువు తేల్చలేదు!: ప్రాజెక్టులో పెద్దపెద్ద గుంతలుపడ్డ ప్రాంతాన్ని డ్రెడ్జింగ్‌ విధానంలోనే సరిచేయాలనే అభిప్రాయానికి వచ్చిన విషయం తెలిసిందే. డ్రెడ్జింగ్‌ పూర్తికి నిర్దుష్ట గడువును నివేదించాలని డీడీఆర్‌పీ సూచించింది. ప్రొఫెసర్‌ వి.ఆర్‌.రాజు కమిటీ పోలవరంలో పర్యటించినా డ్రెడ్జింగు మెథడాలజీ విషయంలో తుదిరూపు తీసుకువచ్చారే తప్ప గడువు తేల్చలేదు. డ్రెడ్జింగ్‌కు భారీ యంత్ర పరికరాలు అవసరమవుతాయి. ఐదారు స్థలాలనుంచి ఇసుక సేకరించాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడినుంచి ఇసుక తీసుకురావాలనేదీ పరిశీలిస్తున్నారు. వైబ్రో కాంపాక్షన్‌ విధానంలో ఇసుక సాంద్రతనూ పెంచాలి. ఈలోపు దిగువ కాఫర్‌డ్యాం పనులు వేగవంతం చేసి పూర్తిచేయాలని కమిటీ సూచించింది.

ఇదీ చదవండి: Protest: సరైన వైద్యం అందించడం లేదని.. కేజీహెచ్​లో రోగి బంధువుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.