వడ్డీ లేని రుణాలతో.. చిరు వ్యాపారులను ప్రోత్సహిస్తున్నాం: సీఎం జగన్​

author img

By

Published : Aug 3, 2022, 12:51 PM IST

Updated : Aug 4, 2022, 6:47 AM IST

JAGAN

JAGAN: వడ్డీ లేని రుణాలతో చిరు వ్యాపారుల స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను.. సీఎం జగన్‌ విడుదల చేశారు.

వడ్డీ లేని రుణాలతో.. చిరు వ్యాపారులను ప్రోత్సహిస్తున్నాం

CM JAGAN: ‘గత ప్రభుత్వం చేసిన అప్పులతో పోలిస్తే కాంపౌండ్‌ యాన్యువల్‌ గ్రోత్‌రేట్‌ (సీఏజీఆర్‌) ఇప్పుడు తక్కువే. గతంలో 19% ఉంటే ఇప్పుడు 15% ఉంది. అయినా అప్పుడు పథకాలు అమలు చేయలేకపోయారు. ఇప్పుడు అమలుచేస్తున్నాం. అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా బటన్‌ నొక్కుతున్నాం. డబ్బులు బ్యాంకుఖాతాల్లోకి వెళుతున్నాయి’ అని ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు. గతానికి ఇప్పటికీ తేడా గమనించాలని, పథకాలు ఎలా అమలవుతున్నాయో ఆలోచించాలని అన్నారు. అప్పుడూ.. ఇప్పుడూ ఉన్నది ఒకే బడ్జెట్‌ అయినా.. మారింది ముఖ్యమంత్రేనని, ఇప్పుడు ఒక్కో కుటుంబానికి 3-4 పథకాలు అందుతున్నాయని గుర్తుచేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జగనన్నతోడు పథకం కింద 3.95 లక్షల మంది ఖాతాల్లో రూ.395 కోట్ల రుణాన్ని సీఎం జగన్‌ బుధవారం విడుదల చేశారు.

గత ఆరు నెలలకు సంబంధించి సకాలంలో రుణాలు చెల్లించినవారికి రూ.15.96 కోట్ల వడ్డీని రీయింబర్స్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ పథకం కింద నిరుపేదలైన చిరువ్యాపారులు, హస్తకళాకారులు, సంప్రదాయ చేతివృత్తుల వారికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున వడ్డీలేని రుణం అందిస్తున్నాం. ఇప్పటివరకు 15 లక్షల మందికి రూ.2,011 కోట్ల వడ్డీలేని రుణాన్ని బ్యాంకుల ద్వారా అందించాం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు 34లక్షల మందికి తోడ్పాటు అందిస్తుంటే ఏపీలోనే 15 లక్షల మందికి చేయూత ఇచ్చాం. దీనికి సహకరించిన బ్యాంకర్లు, అధికారులకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.

.
.

ప్రతి విడతకూ రూ.1000 చొప్పున అదనంగా రుణం
‘15 లక్షల మందిలో సకాలంలో రుణాలు చెల్లించి రెండోసారి రుణం పొందిన వారు 5లక్షల మంది ఉన్నారు. సకాలంలో రుణాలు చెల్లిస్తే వడ్డీ పూర్తిగా రాష్ట్రప్రభుత్వం తిరిగి ఇవ్వడమే కాకుండా బ్యాంకులు మళ్లీ రుణాన్ని మంజూరు చేస్తాయి. సక్రమంగా చెల్లించి మళ్లీ రుణం పొందేటప్పుడు ప్రతి విడతకూ రూ.1000 చొప్పున పెంచే దిశగా బ్యాంకులతో చర్చిస్తున్నాం. దీనివల్ల చిరువ్యాపారుల క్రెడిట్‌ రేటింగ్‌ 10% పెరుగుతుంది. ఈ పథకం కింద ఇప్పటివరకూ లబ్ధి పొందినవారిలో 80% మంది మహిళలు ఉండగా అందులోనూ 80% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల చెందినవారే ఉన్నారు. ఇది మహిళా సాధికారతకు నిదర్శనం. గత పాలకులది పెత్తందారీ మనస్తత్వం. చిరువ్యాపారులకు ఒక్క రూపాయి సాయం చేయలేదు. వారికి మనసు లేనందునే ఎలాంటి సాయాన్ని అందించలేదు. జగనన్నతోడు లబ్ధి అందుకుంటున్నవారికి ఇతర సంక్షేమ పథకాలూ అందుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పథకాల ద్వారా రూ.1.65 లక్షల కోట్లు నేరుగా జమచేశాం’ అని సీఎం జగన్‌ తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 4, 2022, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.