రాష్ట్రంలో వ్యవస్థల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది: చంద్రబాబు

author img

By

Published : May 12, 2022, 8:07 PM IST

Updated : May 13, 2022, 4:22 AM IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు

Chandrababu News: రాష్ట్రంలో వ్యవస్థల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు కార్లు పెట్టిన వారికి బిల్లులు చెల్లించకపోవడం రాష్ట్ర దుస్థితికి నిదర్శనమన్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు ఎంత..? పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఎన్ని..? అనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

అన్నదాతల మంచి కోసమే వ్యవసాయ విద్యుత్తు మోటర్లకు మీటర్లు పెడుతున్నామని పుంగనూరు పుడింగి చెబుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విద్యుత్తుశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీటర్లు మంచివే అయితే నీ పొలానికి పెట్టుకో.. మా పొలానికి పెట్టొద్దని స్పష్టం చేశారు. రైతుల మెడకు ఉరితాళ్లు వేయొద్దని సీఎం జగన్‌, మంత్రి పెద్దిరెడ్డిని హెచ్చరించారు. సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు గురువారం రెండోరోజు పర్యటించారు. వర్షంలోనూ కుప్పం, గుడుపల్లె మండలాల్లో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం, రోడ్‌షో నిర్వహించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘వ్యవసాయానికి మీటర్లు పెడితే ప్రమాదమని భావించి ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాటిని తొలగించారు. ఇప్పుడు మీటర్లు పెడితే రైతులకు లాభమని వైకాపా నాయకులు అంటున్నారు. నేను అన్నదాతలను రెచ్చగొడుతున్నానని మాట్లాడుతున్నారు. కేసులకు భయపడి, అప్పుల కోసమే రాష్ట్రంలో మీటర్లు పెడుతున్నారు’ అని ధ్వజమెత్తారు.

రోజుకో అత్యాచారం

‘రాష్ట్రంలో రోజుకో అత్యాచారం జరుగుతోంది. సీఎం జగన్‌ ఇలాకా కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై 6 నెలలుగా 10 మంది అత్యాచారం చేస్తే.. గర్భం దాల్చింది. పోలీసులకు చెబితే కేసు నమోదు చేయడానికి వెనుకాడారు. ఇదేంటని అడిగితే.. కొన్ని అలా జరుగుతుంటాయ్‌. మద్యం మత్తులో అలా చేస్తుంటారు.. తల్లుల పెంపకం సరిగా లేకపోవడమే కారణమని ఓ మహిళా మంత్రి అంటున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో గంజాయి, డ్రగ్స్‌, మద్యం వినియోగం పెరిగి కొందరు మృగాల్లా తయారై అత్యాచారాలు చేస్తున్నారు. మహిళలపై దారుణాలు ఆపలేని ప్రభుత్వాలు ప్రజలకు అవసరమా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

బాబు రావాలి.. బాధలు తీరాలన్న విద్యార్థిని

మార్గంమధ్యలో ద్రవిడ విశ్వవిద్యాలయం వద్ద మాట్లాడాలని విద్యార్థులు కోరడంతో షెడ్యూల్‌లో లేకపోయినా చంద్రబాబు ప్రసంగించారు. ఉపకార వేతనాలు రావడం లేదని, వర్సిటీలో ప్రాంగణ నియామకాలు లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ విద్యార్థిని ‘బాబు రావాలి.. బాధలు తీరాలి. మీరు సీఎంగా లేకపోవడంతో ఎన్నో తరాలు వెనుకబడ్డాయి’ అనడంతో అక్కడున్న వారు ‘సీఎం సీబీఎన్‌’ అని నినదించారు. ద్రవిడ విశ్వవిద్యాలయంలో కుల రాజకీయాలు చేస్తున్నారని, రిజిస్ట్రార్‌ వేణుగోపాలరెడ్డి వర్సిటీని సొంత ఆస్తిలా చూస్తున్నారని సీనియర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగిగా నేను మాట్లాడకూడదనే నిబంధనలున్నా.. ఆవేదనతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని చెప్పారు. రిజిస్ట్రార్‌ 20 మందికి రూ.50 లక్షలు ఇచ్చి వర్సిటీలో క్వారీలు నడుపుతున్నారని పూర్వ విద్యార్థి చెప్పారు. పర్యటనలో నాయకులు గౌనివారి శ్రీనివాసులు, పీఎస్‌ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.

సీబీఐనే బెదిరించారు..

‘వివేకా హత్య కేసు విచారణకు వచ్చిన సీబీఐ అధికారులపైనే కేసులు పెట్టి, బాంబులేస్తామని బెదిరించిన వారికి జనాల ప్రాణాలు ఓ లెక్కా? చిత్తూరు జిల్లాలో హంద్రీ-నీవా పనులు 12 శాతం పూర్తి చేస్తే.. కుప్పానికి నీళ్లు అందుతాయి. అదీ చేయని వీరు 3 రాజధానులు కడతారా?’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

"మూడేళ్లుగా బిల్లులు చెల్లించకపోతే అధికారులు ఎలా కార్లు ఏర్పాటు చేశారు? బిల్లులు రాక వాహనాల యజమానులు పడే బాధలకు ఎవరు బాధ్యత వహిస్తారు? వ్యవస్థల నిర్వీర్యంతో అధికారులు, ఉద్యోగులు కూడా తీవ్ర ఒత్తిడికి లోనై తప్పులు చేసే పరిస్థితి వచ్చింది. ఒంగోలులో వాహనదారుడి కారును సీఎం కాన్వాయ్ కోసం తీసుకెళ్లడం వ్యవస్థ తెచ్చిన అవస్థ తప్ప మరొక్కటి కాదు. బాధ్యత లేని ప్రభుత్వం, పాలన తెలియని సీఎం ఇలాంటి ఘటనలు జరగడానికి కారణం. పాలకుల వైఫల్యాలు అటు ప్రజలతో పాటు అధికారులు, ఉద్యోగులకు కూడా శాపంలా మారుతున్నాయి. అసలు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు ఎంత?పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఎంత? అనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలి" - చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీ చదవండి:

Last Updated :May 13, 2022, 4:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.