Chandraiah Murder: చంద్రయ్య హత్యను ఖండించిన తెదేపా.. మధ్యాహ్నం గుండ్లపాడుకు చంద్రబాబు

author img

By

Published : Jan 13, 2022, 10:25 AM IST

Updated : Jan 13, 2022, 7:20 PM IST

chandraiah murder in guntur district

chandraiah murder: గుంటూరు జిల్లాలో తెదేపా నాయకుడు చంద్రయ్య హత్యపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యకు పాల్పడినవారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో ప్రశ్నించేవారి గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇవాళ చంద్రబాబు గుండ్లపాడుకు వెళ్లి చంద్రయ్య మృతదేహానికి నివాళులర్పించనున్నారు.

chandraiah murder in guntur district: తెదేపా గ్రామ అధ్యక్షుడు చంద్రయ్య హత్యను ఆ పార్టీ అధినేత చంద్రబాబు, లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఇవాళ మధ్యాహ్నం చంద్రబాబు గుండ్లపాడుకు వెళ్లనున్నారు. చంద్రయ్య మృతదేహానికి నివాళులర్పించనున్నారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు.

వెంటనే అరెస్ట్ చేయాలి : నారా లోకేశ్

చంద్రయ్య హత్యపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. జగన్‌ సీఎం అయ్యాక ప్రజలు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రశ్నించేవారిపై దాడులు, పోరాడేవారిని అంతమొందించడం అలవాటైందని ఆరోపించారు. చంద్రయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. హత్యకు పాల్పడినవారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. చంద్రయ్య కుటుంబానికి తెదేపా అండగా ఉంటుందన్నారు.

రాష్ట్రంలో జగన్ రెడ్డి.. పల్నాడులో పిన్నెల్లి..

చంద్రయ్యని దారుణంగా హత్య చెయ్యడాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి, పల్నాడులో ‎ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యా రాజకీయాల్ని పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పల్నాడులో అరాచకాలు, హత్య రాజకీయాలు ఎక్కువయ్యాయన్నారు. రెండున్నరేళ్ల కాలంలో అనేక మంది తెదేపా కార్యకర్తలను బలి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వైకాపా అరాచకాల్ని సహించం, ఇప్పటినుంచి రాష్ట్రంలో ఎక్కడైనా మరో తెదేపా కార్యకర్తపై చెయ్యేస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని హెచ్చరించారు. చంద్రయ్య కుటుంబానికి 60 లక్షల తెదేపా కుటుంబ సభ్యులందరూ అండగా ఉంటారన్నారు. చంద్రయ్యను హత్య చేసిన వారిని, హత్య చేయించిన వారిని ‎పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హత్యా రాజకీయాల వారసుడు జగన్ రెడ్డి సీఎం అవ్వడంతో ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని ఆక్షేపించారు. ప్రశ్నించే వారిపై దాడులు, పోరాడే వారిని అంతమొందించడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. పాలనతో ప్రజల్ని మెప్పించలేక ప్రభుత్వాన్ని ఎండగడుతున్న వారిని చంపి.. ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

చంద్రయ్య హత్య.. ఏం జరిగిందంటే..?

tdp leader Murder: గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో తెదేపా నేత హత్య కలకలం సృష్టించింది. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ తెదేపా అధ్యక్షుడు తోట చంద్రయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఇవాళ తెల్లవారుజామున గ్రామ కూడలిలో కూర్చుని ఉన్న సమయంలో కర్రలు, రాళ్లతో కొట్టి చంపేశారు. అనంతరం అక్కడ్నుంచి దుండగులు పారిపోయారు.

పాత కక్షలే కారణామా..?

గ్రామంలో పాత కక్షలే హత్యకు దారి తాసినట్లు తెలుస్తోంది. మాచర్ల తెదేపా ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డికి చంద్రయ్య ముఖ్య అనుచరుడు. ఇటీవల బ్రహ్మారెడ్డి వెంట తిరుగుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ కారణంగానే చంద్రయ్యను హత్య చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

ముఖ్యమంత్రి జగన్​తో చిరంజీవి భేటీ

Last Updated :Jan 13, 2022, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.