'అభ్యంతరాలు, అవాంతరాలు సృష్టిస్తే.. విభజన సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు'

author img

By

Published : Sep 27, 2022, 1:58 PM IST

Updated : Sep 27, 2022, 8:30 PM IST

Center

13:54 September 27

తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ముగిసిన కేంద్రం ప్రత్యేక సమావేశం

Telugu States Division Issues: తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన సమావేశం ఎలాంటి పురోగతి లేకుండానే ముగిసింది. రాజధాని నిర్మాణానికి వెయ్యి కోట్లు ఇవ్వాలని...రాష్ట్ర ప్రభుత్వం కోరగా ఇప్పటికే ఇచ్చిన నిధులు ఖర్చు చెప్పాలని కేంద్రం కొర్రి వేసింది. రైల్వేజోన్‌ అంశంలోనూ నిరాశ తప్పలేదు. రాష్ట్రానికి రైల్వేజోన్ ఇవ్వడం సాధ్యం కాదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై.. దిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఇరురాష్ట్రాల ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. సుమారు రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగింది.

రాజధానికి వెయ్యి కోట్ల నిధులు ఇవ్వాలని... రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే ఇప్పటికే ఇచ్చిన రూ.15 వందల కోట్ల ఖర్చుల వివరాలు అందజేయాలని కేంద్ర హోంశాఖ అడిగింది. అలాగైతే శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విధంగా రాజధానికి రూ.29 వేల కోట్లు ఇవ్వాలని.. రాష్ట్ర అధికారులు కోరగా... దీనిపై కేంద్ర హోంశాఖ అధికారులు ఎలాంటి సమాధానం చెప్పలేదు. వెనుకబడిన ఏడు జిల్లాలకు నిధుల అంశాన్ని ఏపీ అధికారులు లేవనెత్తగా.. ఐదేళ్లపాటు ఇవ్వాలని మాత్రమే నిర్ణయం జరిగిందని కేంద్రం హోంశాఖ అధికారులు బదులిచ్చారు. ఇక రాష్ట్రానికి రైల్వేజోన్ ఇవ్వడం సాధ్యం కాదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. అయితే ఈ విషయంపై రైల్వేబోర్డు స్థాయిలో నిర్ణయం వద్దని, మంత్రి వర్గానికి వదిలేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి సూచించారు. షెడ్యూల్ 9లో ఉన్న 91 సంస్థల విభజన విషయంలో షీలా బిడే కమిటీ సిఫార్సులపై... తెలంగాణ అంగీకరించడం లేదని కేంద్రం చెప్పగా... వాళ్లతో సంబంధం లేకుండా హోంశాఖ నిర్ణయం తీసుకోవచ్చు కదా అని ఏపీ అధికారులు ప్రశ్నించారు. న్యాయ నిపుణులు సలహా తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.

ఏపీ లేవనెత్తిన ఏ ఒక్క అంశానికి కూడా ఈ భేటీలో తెలంగాణ సమ్మతి తెలపలేదు. ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ సహా పలుసంస్థల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని తెలంగాణ అధికారులు చెప్పగా, పౌరసరఫరాల శాఖ బకాయిల అంకెల్లో తేడాలున్న విషయాన్ని ఏపీ అధికారులు ప్రస్తావించారు. విభజన చట్టం ప్రకారం సింగరేణిని పంచాలని ఏపీ ప్రభుత్వం కోరగా.. తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది. 51 శాతం ఈక్విటీని పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని చట్టంలో నిర్దిష్టంగా పేర్కొన్నందున సింగరేణి విభజన అంశం ఉత్పన్నం కాదని పేర్కొంది. సింగరేణికి ఉన్న ఏకైక అనుబంధ సంస్థ ఏపీహెచ్​ఎంఈఎల్​లో మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు ఈక్విటీ వర్తిస్తుందని తెలుపగా.. ఈ విషయాన్ని పరిశీలించాలని అధికారుల్ని హోంశాఖ కార్యదర్శి ఆదేశించారు. విభజన చట్టంలో పేర్కొనని 12 సంస్థలనూ విభజించాలని ఆంధ్రప్రదేశ్ కోరగా.. తెలంగాణ పూర్తిగా వ్యతిరేకించింది. ప్రతి విషయంలో అభ్యంతరాలు, అవాంతరాలు సృష్టించుకుంటూ పోతే.. విభజన సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావని కేంద్రం పేర్కొంది.

కేంద్ర ప్రాయోజిత పథకాల కింద నిధుల విభజన, ఉమ్మడి సంస్థలపై వ్యయం, విదేశీ సహాయంతో కూడిన ప్రాజెక్టులకు సంబంధించిన ప్రభుత్వ రుణాలకు సంబంధించిన అంశాలపైనా సమావేశంలో చర్చ జరిగింది. వీటి పరిష్కారానికి రెండు రాష్ట్రాలు, కేంద్రం, కాగ్ సహకారం తీసుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి. విభజన చట్టంలో పన్నులకు సంబంధించి 50, 51, 56 సెక్షన్లలో లోపాలను సరిదిద్దేందుకు చట్టాన్ని సవరించాలని ఏపీ ప్రభుత్వం కోరగా ఎనిమిదేళ్ల తర్వాత మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ వాదించింది.

ఇవీ చదవండి:

Last Updated :Sep 27, 2022, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.