‘ఇందూ ప్రాజెక్ట్స్‌’కు బ్యాంకులు భారీ రుణాలు ఇవ్వడంలో తప్పు జరిగింది..!: కె. నరసింహమూర్తి

author img

By

Published : Sep 25, 2022, 7:10 AM IST

Updated : Sep 25, 2022, 10:05 AM IST

Financial expert K Narasimha murthy

K Narasimha Murthy: లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌కు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన భూములను తాకట్టు పెట్టుకొని... ఇందూ ప్రాజెక్ట్స్‌కు బ్యాంకులు భారీ రుణం ఇవ్వడంలో తప్పు జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోందని... జాతీయస్థాయిలో అనేక ఆర్థిక సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన నిపుణుడు కె.నరసింహమూర్తి అన్నారు. బ్యాంకుల్లో తనఖా పెట్టిన ఆస్తులను విభజించి విక్రయిస్తే అప్పుగా ఇచ్చిన సొమ్మంతా రాబట్టుకోవచ్చని ఆయన తెలిపారు. బ్యాంకులు ఇలా చేయటానికి ప్రయత్నించాలని సూచించారు. బ్యాంకులు డబ్బు కోల్పోతే ప్రజలకే నష్టం అని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఆర్‌బీఐ, బ్యాంకులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ విధమైన సలహాలు సూచనలను బ్యాంకింగ్‌, ఆర్థిక వ్యవహారాల జాతీయ స్థాయి నిపుణులు కె.నరసింహమూర్తి `ఈనాడు’, ‘ఈటీవీ భారత్‌’ ఇంటర్వ్యూలో తెలిపారు.

Narasimha Murthy Explained Financial Transactions of Banks: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా పరిధిలో ‘లేపాక్షి నాలెడ్జి హబ్‌’కు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను తాకట్టు పెట్టుకుని ‘ఇందూ ప్రాజెక్ట్స్‌’కు బ్యాంకులు భారీ రుణాలు ఇవ్వడంలో తప్పు జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోందని బ్యాంకింగ్‌, ఆర్థిక వ్యవహారాల్లో జాతీయ స్థాయి నిపుణులు కె. నరసింహమూర్తి పేర్కొన్నారు. ఆ భూములకు మంచి విలువ ఉన్నందున వాటిని గంపగుత్తగా కాకుండా విభజించి విక్రయించడం ద్వారా తమ అప్పు మొత్తం వసూలుకే బ్యాంకులు ప్రయత్నించాలని సూచించారు. అంతేకానీ నాలుగు వేల కోట్లకు పైగా అప్పు తీసుకుంటే రూ.500 కోట్లకే అన్ని వేల ఎకరాల భూములు, ఇతర విలువైన ఆస్తులను వదులుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఐటీ పార్కుల వంటివి ఏర్పాటు చేయడానికి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 8,844 ఎకరాలు సేకరించి ‘ఇందూ ప్రాజెక్ట్స్‌’కు సంబంధించిన లేపాక్షి నాలెడ్జి హబ్‌కు ఇచ్చింది. ప్రాజెక్టు పనులు చేయకుండా ఆ కంపెనీ అందులోని 4191 ఎకరాలను, హైదరాబాద్‌ వద్ద ఉన్న మరికొన్ని ఆస్తులతోపాటు తాకట్టు పెట్టి బ్యాంకుల వద్ద రూ.నాలుగు వేల కోట్లకు పైగా అప్పు తీసుకుంది. ఆ సొమ్మును ఇతరత్రా వాడుకుని దివాలా తీసింది. దివాలా ప్రక్రియ ద్వారా.. ఇందూ తాకట్టు పెట్టిన ఆస్తులన్నింటిని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి మేనమామ కుమారుడు నరేన్‌ రామానుజులరెడ్డి డైరెక్టర్‌గా ఉన్న ఎర్తిన్‌ కన్సార్షియం అతి తక్కువ ధర (రూ.500 కోట్ల)కే పొందేందుకు ప్రయత్నించడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.

యాక్సిస్‌ బ్యాంక్‌, ఐడీబీఐ, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ వంటి కంపెనీలకు డైరెక్టర్‌గా, జాతీయ స్థాయిలో అనేక ఆర్థిక సంస్థల్లో కీలకబాధ్యతలు నిర్వర్తించిన నరసింహమూర్తి.. లేపాక్షి భూముల వ్యవహారంలో బ్యాంకుల తీరు, అవి అనుసరించాల్సిన విధానాలపై తన అభిప్రాయాలను ‘ఈనాడు’, ‘ఈటీవీ భారత్‌’లతో పంచుకున్నారు.

బ్యాంకింగ్‌, ఆర్థిక వ్యవహారాల జాతీయ స్థాయి నిపుణులు కె.నరసింహమూర్తితో ఇంటర్వ్యూ

ఈనాడు- ఈటీవీ భారత్‌: లేపాక్షి భూములపై ఇందూకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు నిబంధనలు పాటించాయా?

నరసింహమూర్తి: రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకులు కంపెనీల నుంచి ప్రాజెక్టు రిపోర్టులు తీసుకుంటాయి. ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుంది? ఎంత ఆదాయం వస్తుంది? అనే వివరాలు అందులో ఉంటాయి. దాని ఆధారంగా ఆ ప్రాజెక్టుకు అసలు విజయవంతంగా ముందుకెళ్లే శక్తి ఉంటుందా లేదా అంచనా వేసి, రుణం మంజూరు చేస్తాయి. డెవలపర్‌ పెట్టే ఖర్చుకు అనుగుణంగా రుణాన్ని విడతల వారీగా విడుదల చేస్తాయి. లేపాక్షికి సంబంధించి ప్రాజెక్టు రిపోర్టును సమీక్షించడం బాగానే చేసి ఉండొచ్చు కానీ.. దాని భూమిని తాకట్టు పెట్టుకుని తొలిదశలో మంజూరు చేసిన దాదాపు 600 కోట్ల రుణాన్ని ఒక్కసారిగా విడుదల చేసినట్లున్నారు. నా ఉద్దేశంలో అక్కడ తప్పు జరిగినట్లుగా ఉంది.

ఈనాడు- ఈటీవీ భారత్‌: సామాన్యుడు ఓ ఇంటి కోసం రుణం తీసుకుంటే దాన్ని బ్యాంకులు ఒకేసారి ఇవ్వవు. పనుల పురోగతిని పరిశీలిస్తూ, దశలవారీగా విడుదల చేస్తాయి. లేపాక్షి భూముల్లో ఎలాంటి పనులు కొనసాగకపోయినా బ్యాంకులు ఒక్కొక్కటి రూ.వందల కోట్లను ఎలా విడుదల చేశాయి?

నరసింహమూర్తి: బ్యాంకులు తప్పు చేశాయని స్పష్టంగా తెలుస్తోంది. అయితే దీన్ని అవి ఎలా సమర్థించుకుంటాయో తెలియదు. ఎక్కడ లోపం జరిగిందో బ్యాంకులు వివరణ ఇస్తే మనకు అవగాహన కలుగుతుంది.

ఈనాడు- ఈటీవీ భారత్‌: లేపాక్షి భూములను ప్రభుత్వం ఒక ప్రత్యేక అవసరం కోసం ఇచ్చింది. సంబంధిత కంపెనీ ఆ భూములను తాకట్టు పెట్టి తీసుకున్న డబ్బును దుర్వినియోగం చేస్తోందని అర్థమైనప్పుడు అప్పుడే స్పందించాల్సిన బాధ్యత బ్యాంకులకు లేదా?
నరసింహమూర్తి: ఇక్కడ రుణం విడుదలలో లోపం జరిగింది. రుణం ఎందుకు ఇచ్చారు.. ఎలా ఖర్చు పెడుతున్నారు అనే అంశాలపై బ్యాంకుల తనిఖీ, అంతర్గత ఆడిట్‌ విభాగాలతోపాటు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) తనిఖీ విభాగం విచారణలు జరపాలి. ‘ఇందూ’ విషయంలో అలాంటి విచారణలు జరిగే ఉంటాయనుకుంటున్నా.

ఈనాడు- ఈటీవీ భారత్‌: స్టేట్‌ బ్యాంకు, సిండికేట్‌ బ్యాంకు వంటి ప్రభుత్వ బ్యాంకులు.. మరికొన్ని ఆర్థిక సంస్థలకు కలిపి ఇందూ ప్రాజెక్ట్స్‌ 2019 మార్చి నాటికే తీర్చాల్సిన అప్పు రూ.4,189 కోట్లు. కేవలం రూ.477 కోట్లు తీసుకుని ఆ మొత్తాన్ని మాఫీ చేసేందుకు ఆ సంస్థలు సిద్ధమయ్యాయి. ఇందూ తాకట్టు పెట్టిన 4,191 ఎకరాల లేపాక్షి భూముల విలువ ఈ రోజు అపారం. సగటున ఎకరా రూ.60 లక్షలు ఉంటుంది. తాకట్టులో ఉన్న హైదరాబాద్‌లోని ఆస్తులు కూడా విలువైనవే. ఈ నేపథ్యంలో అంత తక్కువ మొత్తానికి బ్యాంకులు ఒప్పుకోవడంలో హేతుబద్ధత ఉందా?

నరసింహమూర్తి: దివాలా చట్టం వచ్చాక ఇదో సమస్యగా మారింది. దివాలా ప్రక్రియలో సంబంధిత కంపెనీ తాకట్టు పెట్టిన ఆస్తుల విక్రయానికి కొటేషన్లు పిలుస్తారు. ఎవరు ఎక్కువ మొత్తాన్ని ప్రతిపాదిస్తే దానికి ఆమోదం తెలిపి, ఆ డబ్బు తీసుకుని ఆ కంపెనీ రుణఖాతాను బ్యాంకులు మూసేసుకుంటాయి. ఈ ప్రక్రియ వల్ల బ్యాంకులు తీవ్రంగా నష్టపోతున్నాయన్న అభిప్రాయం ఉంది. ఎంత త్వరగా ప్రక్రియ ముగించేసి, మొండిబాకీ ఖాతాను వదిలించుకుందామన్నట్లుగానే బ్యాంకుల ధోరణి ఉంటోంది. మరోవైపు ఈ ప్రక్రియ ద్వారా మొండి బకాయిల వసూళ్లు మెరుగయ్యాయని కొందరంటారు. ‘ఇందూ’ విషయంలో అది బ్యాంకులకు బాకీ ఉన్న సొమ్ముతో పోలిస్తే దివాలా ప్రక్రియ ద్వారా జమ చేసేందుకు ప్రతిపాదించిన సొమ్ము చాలా తక్కువ. అంతిమంగా ఇలాంటి నష్టాల భారం ప్రజలపైనే పడుతుంది. అందుకే బ్యాంకులు ఆస్తుల విక్రయంలో వీలైనంత ఎక్కువ రాబట్టాలి.

ఈనాడు- ఈటీవీ భారత్‌: లేపాక్షి వ్యవహారాన్ని కాగ్‌ కూడా తప్పుపట్టింది. ఈ వ్యవహారంలో ఒక మోసపూరిత ప్రక్రియ ద్వారా బ్యాంకుల నిధులను కొల్లగొట్టారు.. ఇలాంటి సందర్భాల్లో రిజర్వు బ్యాంకు స్పందించదా ?
నరసింహమూర్తి: ప్రతి మొండి బకాయి వ్యవహారంపై సంబంధిత బ్యాంకు ఆడిట్‌ విభాగం విశ్లేషణ చేసి నివేదికలను రిజర్వు బ్యాంకుకు పంపుతుంది. ఆర్‌బీఐ వాటిని పరిశీలించి, స్పందిస్తుంటుంది. ఇందూ విషయంలో రిజర్వు బ్యాంకుకు సంబంధిత బ్యాంకుల ఆడిట్‌ విభాగాలు 2014-15 ప్రాంతంలో నివేదికలు పంపి ఉంటాయి. వాటిపై ఆర్‌బీఐ ఎలా స్పందించిందో తెలియదు.

ఈనాడు- ఈటీవీ భారత్‌: ఇందూ దివాలా ప్రక్రియను మళ్లీ ప్రారంభించమని ఎన్‌సీఎల్‌టీ తాజాగా తీర్పు ఇచ్చింది. ఈసారి బ్యాంకులు ఎలా వ్యవహరించాలి? ప్రజాధనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాటికి లేదా?
నరసింహమూర్తి: బ్యాంకులు తమ తాకట్టులో ఉన్న ఆస్తులను గంపగుత్తగా విక్రయానికి పెడితే పోటీకి తక్కువ మందే వస్తారు. పెద్దగా విలువ రాదు. ఆస్తులను చిన్న, చిన్న భాగాలుగా విడదీసి విక్రయానికి పెడితే ఎక్కువ మొత్తం వచ్చే అవకాశం ఉంటుంది. లేపాక్షి భూములు ఎంత విలువైనవో మీ మీడియా వెలుగులోకి తెచ్చింది. ఇకనైనా బ్యాంకులు తమ అసలు, వడ్డీలను పూర్తిగా రాబట్టుకునేందుకు ప్రయత్నించాలి. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. బ్యాంకుల అప్పులు తీర్చడానికి పోను మిగిలిన భూములను తన అధీనంలోకి తెచ్చుకునేందుకు వాటితో చర్చించాలి. సంబంధిత కంపెనీ ప్రాజెక్టును అమలు చేయలేదు కాబట్టి ప్రభుత్వానికి ఆ అధికారం ఉంటుంది.

ఈనాడు- ఈటీవీ భారత్‌: బ్యాంకుల నుంచి సంబంధిత కంపెనీ తాను తీసుకున్న రుణాలను ఎక్కడికైనా మళ్లించి ఉంటే.. వాటి మూలాలను కనుక్కుని తగు చర్యలు చేపట్టేందుకు బ్యాంకులకు అధికారం లేదా?
నరసింహమూర్తి: ఉంటుంది. అయితే బ్యాంకులు ఎంతసేపూ తమ దగ్గర తాకట్టులో కంపెనీ ఆస్తులు ఉన్నాయి కదా.. వాటిని అమ్ముకుని డబ్బు రాబట్టుకుంటే చాలనే ఆలోచనకే పరిమితమవుతున్నాయి.

ఈనాడు- ఈటీవీ భారత్‌: ప్రభుత్వాలు పరిశ్రమలకు ఇచ్చిన భూముల ఆధారంగా రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకులు ఇకనైనా తీసుకోవలసిన జాగ్రత్తలేంటి?
నరసింహమూర్తి: కంపెనీలు ప్రభుత్వం వద్ద ఎందుకోసం భూములు తీసుకున్నాయో.. ఆ అవసరానికే బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. ఆ అవసరం కోసమే రుణమిచ్చిన డబ్బును ఖర్చు పెట్టేలా చూడాలి. ఇలాంటివి గమనించకుండా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం బ్యాంకులు రుణాలు ఇవ్వడాన్ని ఇటీవల కేంద్రం, రిజర్వు బ్యాంకు తప్పుపడుతున్నాయి. ప్రభుత్వ గ్యారంటీలు ఉన్నా సరే.. రుణం తీసుకుంటున్న సొమ్మును ఇతర అవసరాలకు మళ్లించే సంస్థలకు అప్పులు ఇవ్వవద్దని ఆర్‌బీఐ సర్క్యులర్‌ కూడా జారీ చేసింది. సత్యం కుంభకోణం బయటపడ్డాక.. దాని మూలాలపై అధ్యయనం జరిపి అలాంటివి ఇకపై జరగకూడదని కేంద్రం కంపెనీల చట్టంలో అనేక మార్పులు తెచ్చింది. కంపెనీల పరిపాలన, ఆడిటింగ్‌ వంటి అంశాల్లో సవరణలు చేసింది. అలాగే లేపాక్షి విషయంలో జరిగిన తప్పునకు మూలాలు ఎక్కడున్నాయో అధ్యయనం చేసి, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా రిజర్వు బ్యాంకు, ఇతర బ్యాంకులు చర్యలు చేపట్టాలి.

ఈనాడు- ఈటీవీ భారత్‌: ఏపీఐఐసీ విజ్ఞప్తి మేరకు మీరు 2013 ప్రాంతంలోనే లేపాక్షి నాలెడ్జి హబ్‌పై ‘పెర్‌ఫార్మెన్స్‌ ఆడిట్‌’ నిర్వహించారు. అప్పుడు మీరు గమనించిన అంశాలేంటి?
నరసింహమూర్తి: రుణాలను ప్రాజెక్టు కోసం కాక వేరే అవసరాలకు మళ్లించారని నివేదించాను. క్షేత్రస్థాయిలోనూ ప్రాజెక్టు పురోగతిని పరిశీలించాను. అక్కడ ఒక భవనం తప్ప మరేమీ నిర్మించలేదని.. నలుగురైదుగురు ఉద్యోగులే ఉన్నారనీ వివరించాను.

ఇవీ చదవండి:

Last Updated :Sep 25, 2022, 10:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.