'పాలు, పెరుగు, మజ్జిగ కాదు.. పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్‌టీలోకి తెండి'

author img

By

Published : Aug 2, 2022, 8:48 AM IST

AP MPs comments

MPs in Parliament: పేదలు, మధ్యతరగతి ప్రజలకు గోరుచుట్టుపై రోకటిపోటులా మారిన నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను తక్షణం అరికట్టాలని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆకాశాన్ని తాకుతున్న ధరలతో సామాన్య ప్రజలు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

MPs in Parliament: పాలు, పెరుగు, మజ్జిగలాంటి సాధారణ వస్తువులపై 5% జీఎస్‌టీ విధించడం ద్వారా ఎంత పన్ను వస్తుంది? దీని ద్వారా పేదలకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారో ప్రభుత్వం చెప్పాలని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్​సభలో డిమాండ్‌ చేశారు. ‘‘దేశవ్యాప్తంగా ప్రజలు కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఇప్పడు ఆకాశాన్ని తాకుతున్న ధరలతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం సభలో జరుగుతున్న ఈ మథనం వారికి అమృతాన్నివ్వాలని కోరుకుంటున్నాను. ధరల పెరుగుదలకు డీజిల్‌, పెట్రోల్‌ ధరలే ప్రధాన కారణం. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కూడా కొంతవరకు దోహదం చేసింది. దీనివల్ల కేవలం సామాన్యుడే కాకుండా చిరువ్యాపారులు, చిన్నచిన్న హోటళ్లు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ‘గ్యాస్‌, కూరగాయలు, వంటనూనెలు, పండ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను జీఎస్‌టీ పరిధిలోకి తేవడం ఒక్కటే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 7%కి మించిపోయింది. ఆర్‌బీఐ విధించిన గరిష్ట పరిమితి 6% కంటే ఇది ఎక్కువ. వినియోగదారుల ధరల సూచీ 8.5 %, టోకు ధరల సూచి 16 %కి చేరింది. ద్రవ్యోల్బణం పెరగడమంటే చట్టం లేకుండా పన్నులు వేయడమే. ధరలు అసాధారణ పరిస్థితుల్లో పెరిగినప్పుడు చిల్లర ధరలను నిర్ణయించే అధికారం లీగల్‌ మెట్రాలజీ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి ఉంది. అందువల్ల ఆర్థికమంత్రి, వినియోగ వ్యవహారాల మంత్రి ఈ దిశలో క్రియాశీలక చర్యలు తీసుకోవాలి. ధరల నియంత్రణ కోసం మార్కెట్‌లో జోక్యం చేసుకోవాలి. ద్రవ్యోల్బణ పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం వద్ద ధరల స్థిరీకరణ నిధి కూడా ఉంది. దానిని ఎంతవరకు ఖర్చుపెట్టిందీ ప్రభుత్వం చెప్పాలి. క్షేత్రస్థాయి వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఆహార పదార్థాలపై జీఎస్టీ రద్దుచేయాలి’’ అని గల్లా జయదేవ్‌ డిమాండ్‌ చేశారు.

MP Galla Jayadev
ఎంపీ గల్లా జయదేవ్‌

కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించని తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాలు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి అప్పగించాల్సి ఉన్నా ఇంతవరకూ ఆ పని చేయలేదని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై సోమవారం రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు ‘2021 జులై 15న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కేఆర్‌ఎంబీ జ్యూరిస్‌డిక్షన్‌ నోటిఫికేషన్‌ ప్రకారం అందులో పేర్కొన్న షెడ్యూల్‌-2లోని సాగునీటి ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలు తప్పనిసరిగా బోర్డుకు అప్పగించాలి. కానీ రెండు రాష్ట్రాలు ఇప్పటి వరకూ ఆ ప్రాజెక్టుల పరిపాలన, నియంత్రణ, నిర్వహణ, యాజమాన్య బాధ్యతలేమీ అప్పగించలేదు’ అని తెలిపారు. కేఆర్‌ఎంబీ అనుమతి లేకుండా జల విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ కృష్ణా నీటిని ఉపయోగించుకుంటోందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ‘జల విద్యుదుత్పత్తికి తెలంగాణ కృష్ణా నీటిని వాడుకొంది. తమ ఉత్తర్వులను అనుసరించాలంటూ కేఆర్‌ఎంబీ తెలంగాణకు 2021 జూన్‌ 17, జులై 15, 16 తేదీల్లో లేఖలు రాసింది’ అని షెకావత్‌ చెప్పారు.

దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ కార్యాలయ నిర్మాణానికి భూమి గుర్తించాం: మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

ఈనాడు, దిల్లీ: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ కార్యాలయ సముదాయ నిర్మాణానికి భూమిని గుర్తించినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఆయన రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘కొత్త రైల్వేజోన్‌, రాయగడ డివిజన్‌ ఏర్పాటు పనులకు రూ.170 కోట్లు ఖర్చవుతుందని అంచనావేసి 2020-21 రైల్వే బడ్జెట్‌లో చేర్చాం. 2021-22, 2022-23 బడ్జెట్‌లలో ఒక్కో పనికోసం రూ.40 లక్షల చొప్పున కేటాయించాం. కొత్త జోన్‌ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌ను ఓఎస్‌డీ రైల్వేశాఖకు సమర్పించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి సర్వే, ఆఫీసు, నివాస సముదాయాలు, ఇతర భవన నిర్మాణాలకు అవసరమైన పూర్తిస్థాయి లేఅవుట్‌లాంటి ముందస్తు పనులను పూర్తి చేయమని చెప్పాం’ అని వెల్లడించారు.

చింతలపూడి బొగ్గు గనికి ఒక్క బిడ్డూ రాలేదు: ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపూడి సెక్టార్‌-ఏ1 బొగ్గు గనిని వేలానికి ఉంచితే ఒక్క బిడ్డూ రాలేదని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. రాజ్యసభలో వైకాపా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉన్న చింతలపూడి సెక్టార్‌-ఏ1లో 867 మిలియన్‌ టన్నులు, సోమవరం ఈస్ట్‌లో 103 మి.టన్నులు, సోమవరం వెస్ట్‌లో 97 మి.టన్నుల బొగ్గు ఉన్నట్లు అంచనా వేశామన్నారు. చింతలపూడి గనిని వేలానికి ఉంచగా ఒక్క బిడ్డూ రాలేదని వెల్లడించారు.

కులగణన తప్పనిసరిగా చేపట్టాలి: ఎంపీ రామ్మోహన్‌నాయుడు

కేంద్రం చేపట్టబోయే జనగణన సమయంలో తప్పనిసరిగా కులగణన చేపట్టాలని తెదేపా ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు డిమాండ్‌ చేశారు. ఆయన సోమవారం రూల్‌ 377కింద ఈ అంశాన్ని సభ ముందుంచారు. ‘ప్రస్తుతం భారత జనాభా 138 కోట్లకు చేరింది. అయితే ప్రభుత్వం మాత్రం జనాభా 27 కోట్లుగా ఉన్న 1931 లెక్కలనే ఇప్పటికీ బీసీల కోసం ఉపయోగిస్తోంది. లోపభూయిష్టమైన ఆ గణాంకాల ఆధారంగా రూపొందిస్తున్న విధానాలవల్ల వెనకబడిన తరగతులకు సరైన అవకాశాలు లభించడం లేదు. దీంతోపాటు కేంద్రం బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలి. దీంతో ఓబీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వపరంగా ప్రత్యేక దృష్టి సారించడానికి వీలవుతుంది’ అని రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు.

ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి: ఎంపీ మార్గాని భరత్‌

నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని వైకాపా ఎంపీ మార్గాని భరత్‌ కోరారు. లోక్‌సభలో ధరల పెరుగుదల అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘వంటగ్యాస్‌తో సహా అన్ని రకాల ధరలు పెరిగాయి. కరోనాతోపాటు రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ప్రపంచంపై ప్రభావం చూపినట్లు అర్థమవుతోంది. అయితే ద్రవ్యోల్బణం తగ్గించడం ప్రభుత్వ ప్రాధాన్యం కావాలి. కొవిడ్‌ కారణంగా దెబ్బతిన్న జీడీపీ మళ్లీ పుంజుకోవడానికి 2035 సంవత్సరం వరకు పడుతుందని అంచనా. మరోవైపు రూపాయి విలువ 13శాతానికిపైగా పడిపోయింది. పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సామాన్యుడు తనకున్న పరిమిత బడ్జెట్‌లో బతికేందుకు అవకాశమివ్వాలి’ అని కోరారు.

34,358 హెక్టార్ల అటవీభూమి అన్యాక్రాంతం: ఆంధ్రప్రదేశ్‌లో 34,358 హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ తెలిపారు. ఆయన సోమవారం లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. అస్సాం (3,77,532 హెక్టార్లు), అరుణాచల్‌ప్రదేశ్‌ (53,450 హెక్టార్లు), మధ్యప్రదేశ్‌ (54,173 హెక్టార్లు) తర్వాత అత్యధిక భాగం ఏపీలోనే అన్యాక్రాంతమయ్యాయి.

ఉక్రెయిన్‌ విద్యార్థుల రుణాలు రూ.133 కోట్లు: ఉక్రెయిన్‌లో విద్యాభ్యాసం కోసం 2022జూన్‌ నాటికి 1,387 మంది విద్యార్థులు రూ.133.38 కోట్ల రుణం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భాగవత్‌కరాడ్‌ తెలిపారు. ఇప్పటివరకు ఉన్న రుణ బకాయిలపై అక్కడి యుద్ధవాతావరణం చూపిన ప్రభావంపై మధింపు చేయమని ప్రభుత్వం బ్యాంకుల సంఘాన్ని కోరినట్లు చెప్పారు.

మిగులు జలాల పంపకానికి కసరత్తు: కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని మిగులు జలాలను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంచేందుకు విధానాన్ని ఖరారు చేసే బాధ్యతను కృష్ణా బోర్డు ఆధ్వర్యంలోని రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీకి అప్పగించినట్లు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడూ తెలిపారు. సముద్రంలోకి వృథాగా వెళ్లే వరద నీటిని రాష్ట్ర కోటాలో చేర్చొద్దంటూ కేంద్ర జలసంఘం సాంకేతిక కమిటీ సిఫార్సు చేసిందా? అని రాజ్యసభలో సోమవారం వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ‘కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని ఉన్న ప్రధాన ప్రాజెక్టుల నుంచి వర్షాకాలంలో ప్రవహించే మిగులు జలాల క్రమబద్ధీకరణ కోసం కేంద్ర జల్‌శక్తి శాఖ కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాలూ అవసరమైన సమాచారం అందించకపోవడంతో ఆ కమిటీ తన బాధ్యతలను పూర్తి చేయలేకపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీ, తెలంగాణలుగా విడిపోయినందున ఇప్పుడు కృష్ణా నీటిని ప్రాజెక్టుల వారీగా కేటాయించే బాధ్యతను కృష్ణా ట్రైబ్యునల్‌-2కు అప్పగించాం. కృష్ణా పరీవాహక ప్రాంతంలో 75% ఆధారిత ప్రవాహాన్ని (డిపెండబుల్‌ ఫ్లోస్‌) మించి వచ్చే మిగులు జలాలను రెండు రాష్ట్రాలకు ఎలా పంపిణీ చేయాలో చెప్పే బాధ్యతను కేఆర్‌ఎంబీ ఆధ్వర్యంలోని రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీకి అప్పగించాం’ అని బిశ్వేశ్వర్‌ టుడూ తెలిపారు.

విశాఖపట్నంలో కేఆర్‌ఎంబీ కార్యాలయం: కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని, ఇందుకోసం ఉచిత వసతి కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెప్పినట్లు బిశ్వేశ్వర్‌ టుడూ తెలిపారు. రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని 2020 అక్టోబర్‌ 6న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయించారన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.