'ప్రకృతి విపత్తుతోనే అన్నమయ్య డ్యాం తెగింది'.. హైకోర్టులో కలెక్టర్‌ అఫిడవిట్‌

author img

By

Published : May 8, 2022, 5:00 AM IST

హైకోర్టు

అన్నమయ్య ప్రాజెక్టు వరదలకు తెగిపోయిన ఘటనలో బాధితులకు తగిన పరిహారం అందజేయడానికి, డ్యాం కొట్టుకుపోవడానికి బాధ్యులు ఎవరో తేల్చేందుకు విశ్రాంత ఇంజినీర్లతో కమిటీని వేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఆర్‌.గోపాలకృష్ణ హైకోర్టును కోరారు. మరోవైపు.. ప్రకృతి విపత్తు కారణంగానే డ్యాం తెగినట్లు జిల్లా కలెక్టర్‌ వి.విజయరామరాజు అఫిడవిట్‌ దాఖలు చేశారు.

వైఎస్​ఆర్​ జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు వరదలకు తెగిపోయిన ఘటనలో బాధితులకు తగిన పరిహారం అందజేయడానికి, డ్యాం కొట్టుకుపోవడానికి బాధ్యులు ఎవరో తేల్చేందుకు విశ్రాంత ఇంజినీర్లతో కమిటీని వేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఆర్‌.గోపాలకృష్ణ హైకోర్టును కోరారు. మరోవైపు ఈ వ్యవహారంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో అఫిడవిట్‌ వేసినట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సుమన్‌ కోర్టుకు తెలిపారు. సంబంధిత దస్త్రం కోర్టు రికార్డుల్లో చేరకపోవడంతో విచారణను జులై 4కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. అన్నమయ్య ప్రాజెక్టు 2021 నవంబరులో కొట్టుకుపోవడంలో అధికారుల వైఫల్యం ఉందని, బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ భాజపా నాయకులు ఎన్‌.రమేశ్‌నాయుడు హైకోర్టులో పిల్‌ వేసిన విషయం తెలిసిందే.

25 మంది మృతి... 8 మంది ఆచూకీ గల్లంతు: ప్రకృతి విపత్తు కారణంగానే డ్యాం తెగినట్లు జిల్లా కలెక్టర్‌ వి.విజయరామరాజు అఫిడవిట్‌ దాఖలు చేశారు. ‘పిటిషనర్‌ ఆరోపణల్లో వాస్తవం లేదు. ప్రాజెక్టు గత చరిత్రను పరిశీలిస్తే 3 నుంచి 4 ఏళ్లకు ఓసారి మాత్రమే నిండుతుంది. 2020, 2021 సంవత్సరాల్లో ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద నీరు చేరింది. తాజా ఘటనలో గంటకు ఒక టీఎంసీ నీరు చేరడంతో రిజర్వాయరు పూర్తిగా నిండింది. నీటి భారీ ప్రవాహంతో ఎర్త్‌బండ్‌ తెగిపోయింది. అది ప్రకృతి విపత్తుతో సంభవించిందేగానీ... డ్యాం నిర్వహణలో విఫలంతో కాదు. 2020 నవంబరులో వచ్చిన నివర్‌ తుపాను కారణంగా ప్రాజెక్టు 3, 4, 5 గేట్ల బీమ్‌లు దెబ్బతిన్నాయి. 3, 4 గేట్ల బీమ్‌లను తక్షణం పునరుద్ధరించాం. 5వ గేటుకు భారీగా మరమ్మతులు చేయాల్సి వచ్చింది.

నిపుణుల ఆధ్వర్యంలో దాన్ని నెమ్మదిగా మూసేశాం. నీటి లోడ్‌ లేనప్పుడే దానికి మరమ్మతులు చేయాలని నిపుణులు తెలిపారు. వరదలు, సమీప ప్రాంత నదుల నుంచి నీరు భారీగా రావడంతో డ్యాం తెగింది. ప్రజలను అప్రమత్తం చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నాం. అన్నమయ్య ప్రాజెక్టు దెబ్బతినడంతో అక్కడి గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. 8మంది ఆచూకీ తెలియలేదు (మిస్సింగ్‌), 25 మంది మరణించారు. ఇళ్లు, వ్యవసాయ సంబంధ ఆస్తులు, రైల్వే ట్రాక్‌, విద్యుత్‌, రవాణా వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

33 మంది మిస్సింగ్‌/మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.1.65 కోట్ల పరిహారం చెల్లించాం. ఆశ్రయం కోల్పోయిన కుటుంబాలకు రూ.38.52 లక్షలు పంపిణీ చేశాం. మూగజీవాలు పోగొట్టుకున్నవారికి, పంట నష్టానికి రూ.4.45 కోట్లు పరిహారమిచ్చాం. బాధితులకు వివిధ మార్గాల్లో మొత్తం రూ.21.94 కోట్ల ప్రయోజనం కల్పించాం. రాజంపేట మండలం పులపాతూర్‌, తొగుర్‌పేట, మండపల్లి గ్రామాల్లోని 409 మంది బాధితులకు ఇంటి స్థలాలు ఇచ్చాం. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ప్రజాహిత వ్యాజ్యాన్ని కొట్టేయండి’ అని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.