సికింద్రాబాద్‌ విధ్వంసంలో అతడిదే కీలక పాత్ర... మరో 10మంది అరెస్టు

author img

By

Published : Jun 22, 2022, 5:40 PM IST

Secunderabad riots

Secunderabad riots update: తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు మరో 10 మందిని అరెస్ట్​ చేశారు. ఈ అల్లర్లలో మొత్తం 56 మందిని నిందితులుగా చేర్చగా.. ఇప్పటికే 46 మందిని అరెస్ట్​ చేశారు. ఇప్పుడు.. మరో 10 మందిని అరెస్ట్​ చేశారు.

సికింద్రాబాద్‌ విధ్వంసంలో అతడిదే కీలక పాత్ర... మరో 10మంది అరెస్టు

Secunderabad riots update: తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్ల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. కేసులో మరో రిమాండ్ రిపోర్టును పోలీసులు విడుదల చేశారు. ఈ అల్లర్ల ఘటనలో మొత్తం 56 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు ఇప్పటికే 46 మందిని అరెస్ట్​ చేశారు. ఇప్పుడు.. ఈ​ అల్లర్లతో ప్రమేయం ఉన్న మరో 10 మంది నిందితులను రైల్వే పోలీసులు అరెస్ట్​ చేశారు. ఏ-2 పృథ్వీరాజ్​తో పాటు.. మరో 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. వాళ్లందరిని అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. వారిని నిందితులుగా చేర్చారు. ఆ తర్వాత వాళ్లను సికింద్రాబాద్ రైల్వే కోర్టులో హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన తర్వాత పోలీసులు చంచల్​గూడ జైలుకి తరలించారు.

17వ తేదీన జరిగిన విధ్వంసంలో ఆవుల సుబ్బారావు మద్దతు ఇస్తున్నాడని కొంతమంది విద్యార్థులు చర్చించుకున్నారని వివరించారు. సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన ఆవుల సుబ్బారావు, శివ ఆందోళనకారులకు సహకరించినట్టు రిమాండ్​ రిపోర్టులో పేర్కొన్నారు. ఆందోళనకారులకు సుబ్బారావు, శివ పలు విధ్వంసక వస్తువులు అందించినట్టు పోలీసులు తెలిపారు.

వాట్సాప్ గ్రూపుల ద్వారానే ఆందోళన కార్యక్రమానికి ప్రణాళిక జరిగిందని గుర్తించిన పోలీసులు.. మొదటగా అడ్మిన్లుగా ఉన్న ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అడ్మిన్లుగా ఉండి అందులోని సభ్యులను రెచ్చగొట్టేలా వారు పోస్టింగులు చేసినట్లు గుర్తించారు. ఏ సమయంలో ఎక్కడికి చేరుకోవాలి.. రైల్వే స్టేషన్​లోకి ఎలా వెళ్లాలనే ప్రణాళికను సిద్ధం చేసుకొని.. వాట్సాప్ ద్వారా యువకులకు సమాచారం చేరవేశారని పోలీసులు తేల్చారు. పెట్రోల్ బాటిళ్లతో స్టేషన్​లోకి ప్రవేశించిన వారు ముందే విధ్వంసానికి పథకరచన చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్​లతో పాటు, గ్రూప్​లో విధ్వంసానికి సంబంధించిన సంభాషణలు చేసిన వివిధ ప్రాంతాల వారిని.. నిన్న రాత్రి రైల్వే పోలీసులు స్టేషన్​కు తీసుకొచ్చి విచారణ చేసి.. మొత్తంగా 10మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు.

ఉత్తరాదిలో జరిగిన విధ్వంసాన్ని చూసి స్ఫూర్తి పొందినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కొంత మంది కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, యువకులను రెచ్చగొట్టినట్లు అనుమానిస్తున్నారు. ఏయే కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల హస్తం ఉందనే వివరాలను సేకరిస్తున్నారు. సదరు నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు. ఈఘటనలో ఆర్మీ కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల పాత్ర ఉందని తేలితే వాళ్లపైనా చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.