అదే సంకల్పం.. అదే నినాదం.. ఉత్సాహంగా అమరావతి రైతుల మహాపాదయాత్ర

author img

By

Published : Oct 2, 2022, 7:38 PM IST

MAHA PADAYATRA

PADAYATRA : వెయ్యి రోజులు దాటినా సడలని సంకల్పం. గుండెల నిండా ఒకటే నినాదం. అదే అమరావతి అభివృద్ధి వాదం. గాంధీ చూపిన బాటలో అడుగులేస్తూ.. దేవస్థానాలను, న్యాయస్థానాలను నమ్ముకున్న రైతులకు.. వాడవాడలా జనం బ్రహ్మరథం పడుతున్నారు. ద్వారకా తిరుమలలో చిన వెంకన్న దీవెనలు తీసుకొని.. తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టిన రైతులకు ఘన స్వాగతం లభించింది. మంత్రుల మాటలకు అదరం బెదరం అంటూ అమరావతి రైతులు ముందుకు సాగుతున్నారు.

అదే సంకల్పం.. అదే నినాదం.. ఉత్సాహంగా అమరావతి రైతుల మహాపాదయాత్ర

MAHA PADAYATRA : రాజధాని రైతుల పాదయాత్ర 21వ రోజు ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల నుంచి మొదలై.. తూర్పుగోదావరి జిల్లా దూబచర్ల వరకూ సాగింది. యాత్ర ప్రారంభానికి ముందు గాంధీ జయంతిని పురస్కరించుకొని మహాత్ముడి చిత్రపటానికి ఐకాస నాయకులు నివాళులర్పించారు. అనంతరం ముందుకు కదిలిన రైతులను ద్వారకాతిరుమల గ్రామంలోకి అనుమతిలేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఉగాది మండపం వద్ద పోలీసులు, ఐకాస నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. కేసు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగినా.. రైతులు వెరవలేదు. భయపడేది లేదంటూ ముందుకెళ్లారు. దారిపొడవునా రైతులకు అపూర్వ స్వాగతం లభించింది.

నల్లజర్ల మండలం అయ్యవరంలోకి ప్రవేశించిన రైతుల పాదయాత్రకు ఘన స్వాగతం లభించింది. గ్రామానికి వచ్చిన అమరావతి రైతులపై అయ్యవరం అన్నదాతలు పూలు చల్లి ఆహ్వానించారు. స్వామి రథం, రైతులకు బిందెలతో నీరుపోసి హారతులతో స్వాగతం పలికారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని స్థానిక ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు డిమాండ్‌ చేశారు.

దేవీనవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మను దర్శించుకొని వచ్చిన కొంతమంది అమరావతి రైతులు, మహిళలు.. పసుపు, కుంకుమ, గాజులను తీసుకొచ్చి గోదావరి జిల్లాల ఆడపడుచులకు పంపిణీ చేశారు. గోదావరి జిల్లాల అభివృద్ధికి అమరావతి రైతులు వ్యతిరేకం కాదని వివరిస్తూ,.. ప్లకార్డులు ప్రదర్శించారు. మంత్రుల వ్యాఖ్యలపై మండిపడిన ఐకాస నేతలు.. ప్రభుత్వ తీరు మారేవరకూ పోరాటం ఆగదన్నారు. అయ్యవరంలో భోజన విరామం తీసుకున్న రైతులు.. దూబచర్ల వరకు యాత్ర కొనసాగించారు. 21వ రోజున దాదాపు 14 కిలోమీటర్ల మేర నడిచారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.