చెదరని సంకల్పం.. అమరావతే లక్ష్యం.. రైతుల మహాపాదయాత్ర

author img

By

Published : Sep 23, 2022, 8:36 PM IST

Amaravati Farmers Maha Padayatra

Amaravati Farmers Maha Padayatra: ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం పోరుబాట పట్టిన అమరావతి రైతులకు పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అపూర్వ ఆదరణ లభిస్తోంది. పెడన ప్రజలు... 'జై అమరావతి' అంటూ నినదించగా.. గుడివాడ నియోజకవర్గ వాసులు 'మీ వెంటే మేముంటూ' ఘనస్వాగతం పలికారు. రెచ్చగొట్టే బ్యానర్లు, కవ్వింపు చర్యలకు ఏ మాత్రం వెరవక ముందుకు సాగుతున్న అన్నదాతలకు స్థానికులు ముక్తకంఠంతో సంఘీభావం తెలిపారు.

చెదరని సంకల్పం.. అమరావతే లక్ష్యం..

Amaravati Farmers Maha Padayatra: అడుగడుగునా అవమానాలు, అవహేళనలు ఎదురైనా.. అడుగు ముందుకు వేసేందుకు ఆరోగ్యం సహకరించకున్నా రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా అన్నదాతలు చెదరని సంకల్పంతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రాజధాని రైతుల మహాపాదయాత్ర 12వరోజు ఉదయం మచిలీపట్నం నియోజకవర్గం అరిశేపల్లి నుంచి ప్రారంభమైంది. హుస్సేన్‌పాలెం మీదుగా పెడనలోకి ప్రవేశించింది. రైతులకు స్థానికులు, మహిళలు పూలు, హారతులతో స్వాగతం పలికారు. 'మా ఊరు పెడన-మా రాజధాని అమరావతి' అంటూ నినాదాలు చేశారు. పరిసర గ్రామాల ప్రజలు ఆకుపచ్చ జెండాలు చేతపట్టి రైతులకు మద్దతుగా భారీ ర్యాలీ చేపట్టారు.

గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం రెడ్డిపాలెం వద్ద " తాము ఎవరి జోలికీ వెళ్లం.. తమ జోలికి ఎవరైనా వస్తే ఎగరేసి నరుకుతాం" అంటూ వైకాపా నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లు కలకలం రేపాయి. రైతులకు మద్దతుగా తెదేపా నేతలు రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు కార్యకర్తలతో అక్కడికి తరలిరావడంతో... పోలీసులే ఆ బ్యానర్లను తొలగించారు.

గుడివాడ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చిన ప్రజలు, తెదేపా, భాజపా, జనసేన, వామపక్షాలు అన్నదాతలకు ఘన స్వాగతం పలికారు. ఎడ్లబండ్ల ర్యాలీతో స్థానిక రైతులు మద్దతు తెలిపారు. జై అమరావతి నినాదాలతో గుడివాడ నియోజకవర్గ పల్లెలు మార్మోగాయి. వైకాపా నాయకులు, శ్రేణులు కావాలనే పాదయాత్రపై విషప్రచారం చేస్తున్నారని అమరావతి ఐకాస నేతలు మండిపడ్డారు. ఎంతగా రెచ్చగొట్టినా...మా పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

"వైకాపా నాయకులు, శ్రేణులు కావాలనే పాదయాత్రపై విషప్రచారం చేస్తున్నారు. ఎంతగా రెచ్చగొట్టినా...మా పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేస్తాం"-అమరావతి ఐకాస నేతలు

వడ్లమన్నాడు వద్ద భోజన విరామం తీసుకున్న రైతులు.. అక్కడనుంచి వేమవరం గ్రామం చేరుకున్నారు. స్థానిక కొండలమ్మ గుడి వద్ద పూజలు నిర్వహించారు. కవతవరంలో 12 రోజు పాదయాత్ర ముగిసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.