హర్రర్ సినిమాను తలపించే హత్యలు.. పిల్లల్ని చంపిన భర్తను హతమార్చిన భార్య

author img

By

Published : Sep 19, 2022, 2:22 PM IST

murder

wife killed husband: హర్రర్ సినిమాను తలపించేలా వరుస హత్యలు.. అతడికి అది మూడో పెళ్లి. ఆమెకు అది రెండో వివాహం. వారిద్దరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. కొంత కాలనికి భార్యపై అనుమానంతో ముత్యాల్లాంటి బిడ్డలను కిరాతకంగా హతమార్చాడు. భయంతో తనూ చనిపోవాలనుకున్నాడు. అది కుదరలేదు.. ఎప్పటికైన తనను చంపేస్తాడని భావించిన భార్య, భర్తను దారుణంగా చంపేసింది.

wife killed husband: నాగర్​కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన వరుస హత్యల ఘటన.. స్థానికంగా సంచలనం సృష్టించింది. భార్యపై అనుమానంతో ఓ కర్కశ తండ్రి కన్నబిడ్డలను కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించాడు. కానీ ఎట్టకేలకు చావుబతుకుల నుంచి బయటపడ్డాడు. తన కుమార్తెలను చంపిన భర్త తనని కూడా చంపుతాడేమోనన్న భయంతో భార్య అతడిని హత్య చేసింది. కొల్లాపూర్​ మండలంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కొల్లాపూర్‌ మండలం కుడికిల్లకు చెందిన ఓంకార్‌(39)కు మహేశ్వరి మూడో భార్య. ఆమెకు ఇది రెండో వివాహం. వీరిద్దరికి కుమార్తె చందన (3), కుమారుడు విశ్వనాథ్‌ (1) ఉన్నారు. అనుమానంతో భార్యను వేధిస్తుండటంతో ఇద్దరూ తరుచూ గొడవ పడేవారు. ఆగస్టు 17న ఓంకార్‌ తన ఇద్దరు పిల్లలను కోడేరు మండలం ఎత్తం గుట్ట వద్ద గొంతుకోసి చంపి తానూ గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆ ఘటనలో మహేశ్వరి తప్పించుకొని పారిపోయింది.

హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌లో చికిత్స పొందిన ఓంకార్‌ ఈనెల 16న కుడికిల్లకు వచ్చాడు. బిడ్డలను చంపినవాడు తననూ చంపుతాడని భయపడిన భార్య మహేశ్వరి ఆదివారం ఉదయం ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేసి ఓంకార్‌ను చంపేసింది. అనంతరం కొల్లాపూర్‌ ఠాణాకు వెళ్లి లొంగిపోయింది. మృతుడి తల్లి బాలకిష్టమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.