ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నారా?.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

author img

By

Published : May 27, 2023, 9:42 AM IST

Updated : May 27, 2023, 11:33 AM IST

it return filing last date

IT Return Filing : ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు చివరి తేదీ జులై 31. గడువు తేదీ సమీపిస్తున్నందున వీలైనంత తొందరగా ఈ ప్రక్రియ పూర్తి చేయడం మేలు. ఐటీఆర్‌ను పూర్తి చేసేటప్పుడు కొందరు కొన్ని తప్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఐటీ రిటర్నులు దాఖలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే?

IT Return Filing : గత ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయం వచ్చేసింది. ఆదాయపు పన్ను విభాగం రిటర్నుల పత్రాలను అందుబాటులోకి తెచ్చినట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి (2023-24 మదింపు సంవత్సరం) రిటర్నులు దాఖలు చేసేటప్పుడు తప్పులు లేకుండా చూసుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓ సారి తెలుసుకుందాం.
ఆదాయపు పన్ను విభాగం ఇప్పటి వరకూ వెల్లడించిన సమాచారం ప్రకారం ఆడిట్‌ అవసరం లేని వ్యక్తులు జులై 31 వరకూ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే కొన్ని కార్యాలయాల్లో ఫారం-16 అందించారు. వీటి ఆధారంగా సులభంగానే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అవకాశం ఉంది.

సరైన పత్రంలో..
పన్ను చెల్లింపుదారులు చేసే అత్యంత సాధారణ పొరపాట్లలో ఒకటి ఐటీఆర్‌ ఫారాన్ని ఎంచుకోవడం. సరైన ఫారంలోనే వివరాలను దాఖలు చేయాలి. ఆదాయపు పన్ను రిటర్నుల ఫారాలు మొత్తం 7 రకాలుగా ఉంటాయి. వ్యక్తులకు రూ.50లక్షల వరకూ వేతనం, ఒక ఇంటిపై ఆదాయం, వడ్డీ తదితర మార్గాల్లో ఆదాయం వస్తున్నప్పుడు ఐటీఆర్‌-1 దాఖలు చేయవచ్చు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థలకు రూ.50లక్షలకు పైగా ఆదాయం ఉన్నప్పుడు ఐటీఆర్‌-4ను ఎంచుకోవాలి. ఐటీఆర్‌-2ను రూ.50లక్షలకు పైగా ఆదాయం ఉండి.. ఒకే ఇంటి ద్వారా ఆదాయం ఉన్నప్పుడు దాఖలు చేయాల్సి ఉంటుంది. వృత్తి నిపుణులు, ఐటీఆర్‌-1, ఐటీఆర్‌-2ల విషయంలో అనుమానం ఉన్నవారు ఐటీఆర్‌-3ని ఎంచుకోవచ్చు. షేర్లలో క్రయవిక్రయాలు చేసినప్పుడు మీరు నిర్వహించిన లావాదేవీల ఆధారంగా ఐటీఆర్‌-2 లేదా ఐటీఆర్‌ 3ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మిగతా పత్రాలు కంపెనీలు, వ్యాపార సంస్థలకు వర్తిస్తాయి. వ్యక్తులకు వీటితో సంబంధం ఉండదు అని గుర్తుంచుకోవాలి.

ఆదాయాలన్నీ..
ఐటీ రిటర్నులు దాఖలు చేసేటప్పుడు అన్ని ఆదాయాలనూ తప్పనిసరిగా నివేదించాలి. కొంతమంది కొన్ని ఆదాయాలను అందులో పేర్కొనరు. ఇది చట్టాన్ని ఉల్లంఘించినట్లే. ఆదాయపు పన్ను శాఖ దీన్ని గుర్తిస్తే నోటీసులు పంపే అవకాశం ఉంది. చాలామంది వ్యక్తులు తమ జీతాన్ని మాత్రమే నమోదు చేస్తారు. బ్యాంకు సేవింగ్స్ ఖాతా, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బీమా పాలసీల నుంచి వచ్చిన ఆదాయం, పీపీఎఫ్‌ వడ్డీలను పట్టించుకోరు. మినహాయింపు పరిధిలోకి వచ్చే ఆదాయ వివరాలనూ రిటర్నులలో చూపించాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయి. మైనర్‌ పిల్లల పేరుతో పెట్టుబడులు ఉండి, వాటి ద్వారా ఆదాయం వస్తుంటే.. ఆ మొత్తాన్నీ అసెసీ ఆదాయంలో భాగంగానే ఆదాయపు పన్ను విభాగం పరిగణిస్తుంది.

మినహాయింపులు చూసుకోండి..
ఆదాయపు పన్ను మినహాయింపుల్లో సెక్షన్‌ 80సీ ప్రధానమైనది. నిబంధనల ప్రకారం ఈ సెక్షన్‌ కింద వివిధ పెట్టుబడి పథకాల్లో మదుపు చేసి.. రూ.1,50,000 వరకూ మినహాయింపు పొందవచ్చు. ఈపీఎఫ్‌, పీపీఎఫ్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌, గృహరుణం అసలు, పిల్లల ట్యూషన్‌ ఫీజులు, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు చెల్లించే ప్రీమియం తదితరాలన్నీ ఈ సెక్షన్‌ పరిధిలోకే వస్తాయి. సెక్షన్‌ 80డీలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం వివరాలు నమోదు చేయాలి. పన్ను ఆదా కోసం మీరు పెట్టిన అన్ని రకాల పెట్టుబడులనూ రిటర్నులలో సరిగ్గా పేర్కొనాలి.

టీడీఎస్‌ జమ చేశారా?
కొన్నిసార్లు ఆదాయపు పన్ను దగ్గర ఉన్న వివరాలకూ, మీ ఫారం-16కూ సరిపోకపోవచ్చు. మీ వద్ద వసూలు చేసిన పన్నును ఆదాయపు పన్ను విభాగానికి జమ చేయకపోవడం వల్ల ఈ వ్యత్యాసం కనిపిస్తుంది. రిటర్నులు దాఖలు చేసేముందు మీ ఫారం-16, ఫారం 16ఏ, 26ఏఎస్‌, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌)లను పూర్తిగా పరిశీలించండి. ఏదైనా తేడా ఉంటే మీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకోండి. పొరపాట్లతో రిటర్నులు సమర్పిస్తే అధికారుల నుంచి నోటీసులు వచ్చే ప్రమాదం ఉందని మర్చిపోవద్దు.

Last Updated :May 27, 2023, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.