హెచ్‌పీలో 6వేల ఉద్యోగాల కోత.. క్రెడిట్‌ సూయిజ్‌లో 9వేల మంది..

author img

By

Published : Nov 23, 2022, 9:29 PM IST

employees layoff in hp

Hp Layoffs 2022 : ప్రపంచవ్యాప్తంగా పలు బడా కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. హెచ్‌పీ ఇప్పుడు ఆ జాబితాలో చేరింది. 6 వేలమందిని తొలగించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా క్రెడిట్‌ సూయిజ్‌ సైతం ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా సిబ్బంది తగ్గించుకునేందుకు యోచిస్తోంది.

Hp Layoffs 2022 : అమెరికాలోని బడా కంపెనీల్లో ఉద్యోగాల కోతల పర్వం కొనసాగుతోంది. గూగుల్‌, అమెజాన్‌, మెటా, సిస్కో వంటి కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాయి. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు తయారు చేసే హెచ్‌పీ సైతం ఇప్పుడు ఆ జాబితాలో చేరింది. 2025 చివరి నాటికి 6 వేల మందిని ఇంటికి పంపించనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. పర్సనల్‌ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లకు గిరాకీ తగ్గిన నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయానికి వచ్చింది.

కరోనా మహమ్మారి సమయంలో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. కుటుంబాలతో పాటు వ్యాపార సంస్థలు సైతం వాటిపై ఖర్చును తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని హెచ్‌పీ భావిస్తోంది.

2022లో ఎదురైన సవాళ్లే 2023 ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగనున్నాయని కంపెనీ చెబుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంచనాలకంటే తక్కువ లాభాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం కంపెనీలో సుమారు 50వేల మంది పనిచేస్తున్నారు. మొత్తం ఉద్యోగుల్లో 12 శాతం మేర, లేదంటే 4 నుంచి 6 వేల మధ్య ఉద్యోగులను తగ్గించుకోవాలని భావిస్తోంది.

మరోవైపు మిగిలిన కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ తయారీ సంస్థలు సైతం ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇటీవల మూడో త్రైమాసికానికి ప్రకటించిన ఫలితాల్లో డెల్‌ ఆదాయంలో 6 శాతం క్షీణతను నమోదు చేసింది. ఇంటెల్‌ సైతం ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ కంపెనీలో 1.13 లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. వేల సంఖ్యలో తొలగించాలనుకుంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

9000 మందికి క్రెడిట్‌ సూయిజ్‌ ఉద్వాసన
ఆర్థిక మాంద్యం భయాలు, ఉద్యోగాల కోతలు ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రభావం చూపే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా జ్యూరిచ్‌ కేంద్రంగా పనిచేస్తున్న క్రెడిట్‌ సూయిజ్ అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో 1.6 బిలియన్ డాలర్ల నష్టాన్ని అంచనా వేసింది. వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, స్విస్‌ బ్యాంక్‌ డివిజన్‌లో వినియోగదారుల కార్యకలాపాలు నెమ్మదించాయని.. ఈ నేపథ్యంలో నష్టాల్ని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.

ఫలితంగా క్రెడిట్‌ సూయిజ్‌ సైతం వ్యయ నియంత్రణ చర్యలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఇతర బడా టెక్‌ కంపెనీల తరహాలోనే భారీ ఎత్తున ఉద్యోగాల కోతలకు సిద్ధమవుతోంది. ప్రస్తుత త్రైమాసికంలో దాదాపు 2,700 మందిని తొలగించనున్నట్లు తెలిపింది. 2025 నాటికి మొత్తం ఉద్యోగుల్లో 12 శాతం అంటే 9,000 మందిని తొలగించే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొంది. ఇలా కీలక నిర్ణయాలతో కంపెనీని పూర్తిగా పునర్‌వ్యవస్థీకరించనున్నట్లు తాజా మార్కెట్‌ ఫైలింగ్‌లో పేర్కొంది.

బ్రిటిష్‌ వెల్త్‌ టెక్‌ ప్లాట్‌ఫామ్‌ ఆల్‌ఫండ్స్‌ గ్రూప్‌లో వాటాల విక్రయం వల్ల క్రెడిట్‌ సూయిజ్‌కు నాలుగో త్రైమాసికంలో 75 మిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్‌ల నష్టం వాటిల్లనున్నట్లు కంపెనీ తెలిపింది. డిపాజిట్ల మొత్తం, నిర్వహణలోని ఆస్తులు, నికర వడ్డీ ఆదాయం, కమీషన్లు, రుసుములు తగ్గడమే దీనికి కారణమని పేర్కొంది. ఫలితంగా కంపెనీ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం పూర్తిగా నష్టాల్లోకి జారుకుంటుందని తెలిపింది. బుధవారం కంపెనీ బోర్డు అసాధారణ సమావేశం నిర్వహించనుంది. సంస్థ పునర్‌వ్యవస్థీకరణ, మూలధన నిధుల సమీకరణపై నిర్ణయం తీసుకోనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.