వడ్డీ రేట్లు పెంచిన ఆర్​బీఐ.. మీ EMI ఎంత పెరుగుతుందంటే...

author img

By

Published : Aug 5, 2022, 2:17 PM IST

rbi interest rate hike

EMI RBI NEWS: ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం ఆర్​బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ క్రమంలో రెపో రేటు ఆధారిత రుణాల రేట్లన్నీ సహజంగానే పెరుగుతాయి. గృహరుణం తీసుకుని, సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే వారు దీన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పటికే రుణం తీసుకున్న వారికీ వడ్డీ రేటు పెరిగినా, నెలవారీ చెల్లించాల్సిన వాయిదాలో మార్పు ఉండదు. రుణం చెల్లించాల్సిన వ్యవధి పెరుగుతుంది.

EMI RBI NEWS: ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా ఆర్‌బీఐ రెపో రేటును మరో 50 బేసిస్‌ పాయింట్లు (0.50%) పెంచింది. దీంతో రెపో రేటు ఆధారిత రుణాల రేట్లన్నీ సహజంగానే పెరుగుతాయి. గృహరుణం తీసుకుని, సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే వారు దీన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఇల్లు ఇప్పుడే కొనాలా? మళ్లీ వడ్డీ రేట్లు తగ్గుతాయా.. అనే సందిగ్ధం ఉండే ఉంటుంది. రెండు నెలల క్రితం అత్యల్ప స్థాయిలో ఉన్న రుణ రేట్లు, మళ్లీ కొవిడ్‌-19 పూర్వ స్థితికి చేరుకుంటున్నాయి. దాదాపు అన్ని బ్యాంకులూ వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. మే ప్రారంభంలో 6-6.5 శాతంగా ఉన్న రుణరేట్లు ఇప్పుడు 7.40-7.95 శాతానికి పెరిగాయి.

పాత లోన్‌ల వ్యవధి పెరుగుతుంది..
ఇప్పటికే రుణం తీసుకున్న వారికీ వడ్డీ రేటు పెరిగినా, నెలవారీ చెల్లించాల్సిన వాయిదాలో మార్పు ఉండదు. రుణం చెల్లించాల్సిన వ్యవధి పెరుగుతుంది. గృహరుణం దీర్ఘకాలం అమలవుతుంది కనుక పలు దశల్లో వడ్డీ రేట్లు పెరగడం, తగ్గడం లాంటివి వ్యవధిపై ప్రభావం చూపుతుంటాయి. కొత్తగా ఇంటి రుణం తీసుకోవాలనుకునే వారికి, వడ్డీ రేట్లు పెరగడంతో రుణ అర్హత మొత్తం తగ్గిపోతోంది. కొత్త ఇల్లు కొనుగోలుకు రూ.30లక్షల రుణాన్ని 25 ఏళ్ల వ్యవధికి 6.5 శాతం వడ్డీతో తీసుకున్నప్పుడు ఈఎమ్‌ఐ రూ.20,256 అవుతుంది. రుణరేటు ఇప్పటి వరకు 1.40 శాతం పెరిగితే, ఈఎమ్‌ఐ రూ.22,956 అవుతుంది. అంటే ప్రతి రూ.లక్ష లోన్‌కు అదనంగా నెలకు రూ.90 చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు వ్యక్తుల ఆదాయం, వయసు ఆధారంగా రుణ మొత్తాన్ని నిర్ణయిస్తాయి. వడ్డీ రేటు పెరిగినప్పుడు ఆ మేరకు రుణ అర్హత తగ్గుతుంది. పై ఉదాహరణలో చూసుకుంటే.. రూ.20,256 వాయిదా చెల్లించే వారికి రుణం రూ.30 లక్షలకు బదులు, రూ.26,50,000 మాత్రమే మంజూరవుతుంది.

ఇప్పుడు రుణం తీసుకోవచ్చా?
ఒకవేళ ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే.. వడ్డీరేట్ల పెంపు విషయంలో భవిష్యత్తులో ఆర్‌బీఐ మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లు ఇప్పుడున్న స్థాయి నుంచి మరో 35-50 బేసిస్‌ పాయింట్లు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే రెపో రేటు ప్రస్తుత 5.40% నుంచి 5.75-5.90 శాతానికి చేరొచ్చు. ఇందువల్ల బ్యాంకుల రుణరేట్లు ఇంకా అధికమవుతాయి. ఇదే జరిగితే రుణ అర్హత మరింత తగ్గుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఇల్లు కొనాలనుకునే వారు నిర్ణయం తీసుకోవడం మేలని బ్యాంకింగ్‌ నిపుణలు సూచిస్తున్నారు. క్రెడిట్‌ స్కోరు 750 పాయింట్లకు మించి ఉన్న వారు.. అధిక రుణ రేటు ఉన్న బ్యాంకు నుంచి తక్కువ రుణరేటు ఉన్న బ్యాంకులకు తమ రుణాల్ని బదిలీ చేసుకునే వీలునూ పరిశీలించవచ్చు.

బ్యాంకులు అప్రమత్తంగా..
రుణ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు పలు రకాల ప్రోత్సాహకాలతో రుణాలు ఇచ్చేందుకు పోటీ పడ్డ బ్యాంకులు, ఇప్పుడు ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. గృహ, వ్యక్తిగత రుణ దరఖాస్తులను మరింత నిశితంగా పరిశీలిస్తున్నాయి. గతంలో తీసుకున్న రుణాలను చెల్లించిన తీరును తెలియజేసే క్రెడిట్‌ స్కోరును ప్రాతిపదికగా చూస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులకు గృహ రుణాల మంజూరులోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

ఇతర రుణాలు ఇలా..

  • అదే సమయంలో రేట్ల పెంపునకు ముందు రూ.10 లక్షల వాహన రుణం, 7 ఏళ్ల కాలపరిమితి, 10 శాతం వడ్డీరేటుతో తీసుకున్నారనుకుంటే.. ఈఎమ్‌ఐ రూ.16,601గా ఉంటుంది. వడ్డీరేటు ఇటీవల 1.4 శాతం పెరిగిన నేపథ్యంలో ఈఎమ్‌ఐ రూ.17,333కు పెరగనుంది. అంటే అదనంగా నెలకు రూ.732 చెల్లించాల్సి ఉంటుంది.
  • అదే పర్సనల్‌ లోన్ విషయానికి వస్తే.. రూ.6 లక్షల రుణానికి ఐదేళ్ల కాలపరిమితి, 14 శాతం వడ్డీరేటుతో లెక్కిస్తే ఈఎమ్‌ఐ రూ.439 పెరిగి రూ.13,961 నుంచి రూ.14,400కు చేరనుంది.

ఇవీ చదవండి: హెల్త్ ఇన్సూరెన్స్ ఎన్ని లక్షలకు తీసుకుంటే బెటర్?

వేతన జీవులపై మరో పిడుగు.. వడ్డీ రేట్లు పెంపు.. ఈఎంఐలు మరింత భారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.