సిమెంట్​ కింగ్​గా అదానీ.. ఇక బస్తాల కొద్దీ డబ్బులు!

author img

By

Published : Sep 19, 2022, 12:53 PM IST

Adani Group stocks news

Adani Group stocks news: సిమెంట్ ఉత్పత్తి రంగంలో రెట్టింపు వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. దేశంలోనే లాభదాయకమైన సిమెంట్ తయారీదారుగా అదానీ గ్రూప్​ను నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు అదానీ గ్రూప్ వ్యాపారాల తీరుపైనా ఆయన కీలక విషయాలు వెల్లడించారు.

Gautam Adani latest news: అపర కుబేరుడు ఛైర్మన్ గౌతమ్ అదానీ పట్టిందల్లా బంగారమే అవుతోంది. ప్రపంచంలోని బిలియనీర్ల జాబితాలో దూసుకెళ్తున్న అదానీ.. అన్ని రంగాలకు తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. ఇటీవలే సిమెంట్ ఉత్పత్తి రంగంలోకి అడుగుపెట్టారు. ఏసీసీ, అంబుజా సిమెంట్స్​ను 6.5 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ఇప్పుడు సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు అదానీ ప్రణాళికలు రచిస్తున్నారు. దేశంలో అత్యంత లాభదాయక సిమెంట్ తయారీదారుగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు అదానీ వెల్లడించారు. సిమెంట్ కంపెనీల కొనుగోలు ప్రక్రియ సెప్టెంబర్ 17న పూర్తైన నేపథ్యంలో అదానీ ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఒక్క ప్రయత్నంలోనే అదానీ గ్రూప్ దేశంలోని అతిపెద్ద సిమెంట్ తయారీదారుగా మారిందని చెప్పారు.

"ఆధునిక ప్రపంచంలో గొప్పగా ఆర్థిక పురోగతి సాధిస్తున్న సమయంలో మేం ఈ రంగంలోకి అడుగుపెట్టాం. ప్రపంచంలో రెండో అతిపెద్ద సిమెంట్ తయారీదారు భారత్. కానీ తలసరి వినియోగంలో మనం వెనకబడ్డాం. చైనాలో సిమెంట్ తలసరి వినియోగం 1600 కేజీలు ఉంటే.. భారత్​లో మాత్రం 250 కేజీలే ఉంది. ఈ రంగంలో ఏడు రెట్ల వృద్ధికి అవకాశం ఉంది. చాలా ప్రభుత్వ కార్యక్రమాలు వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో దీర్ఘకాలంలో సిమెంట్ డిమాండ్ జీడీపీలో 1.2 రెట్ల నుంచి 1.5 రెట్ల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. మేం ఈ సంఖ్య కంటే రెట్టింపు వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

మౌలిక సదుపాయాల రంగంలో రూ.లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు రచిస్తున్న ప్రస్తుత సమయంలో సిమెంట్ అనేది ఆకర్షణీయమైన వ్యాపారం. అదానీ గ్రూప్​నకు చెందిన పోర్టులు, లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ, ఈ-కామర్స్ వ్యాపారాలు అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఈ వ్యాపారం ఆశాజనకంగా ఉంటుంది. వచ్చే ఐదేళ్లలో సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 70 మిలియన్ టన్నుల నుంచి 140 మిలియన్ టన్నులకు పెంచాలని భావిస్తున్నాం. అదానీ గ్రూప్ కార్యాచరణ సామర్థ్యం ఫలితంగా.. దేశంలోనే లాభదాయక సిమెంట్ తయారీదారుగా అవతరిస్తాం."
-గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ ఛైర్మన్

మా ఫిలాసఫీ అదే..
భారతదేశ వృద్ధిపై విశ్వాసం ఉంచడమే తమ సంస్థ ఫిలాసఫీ అని అదానీ వివరించారు. 2050 నాటికి భారత్ 25-30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని.. అందువల్ల అభివృద్ధికి అనేక అవకాశాలు ఉంటాయని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ సంస్థ అయిన అదానీ.. శుద్ధ ఇంధన రంగంలో 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉందన్నారు.

విద్యుత్ రంగంలోనూ అదానీ గ్రూప్ దూసుకెళ్తోందని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, ఎల్​ఎన్​జీ, ఎల్​పీజీ, సిటీ గ్యాస్, పైప్​డ్ గ్యాస్ పంపిణీ వ్యాపారాలు రెండంకెల వృద్ధి రేటు నమోదు చేస్తున్నాయని వివరించారు. పలు భారీ రోడ్డు కాంట్రాక్టులు సైతం అదానీ గ్రూప్ చేపట్టిందని తెలిపారు. త్వరలోనే ఈ రంగంలో అతిపెద్ద ప్లేయర్​గా అవతరించనున్నట్లు చెప్పారు. ఐపీఓకు వచ్చిన తర్వాత అదానీ విల్మర్ విభాగం.. దేశంలోనే విలువైన ఎఫ్ఎంసీజీగా నిలిచిందని వివరించారు. సంస్థ ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉందన్న అదానీ.. అంతర్జాతీయ మార్కెట్లు, వ్యూహాత్మక భాగస్వాముల నుంచి బిలియన్ల డాలర్లను సమీకరిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్.. 260 బిలియన్ డాలర్లుగా ఉందని చెప్పారు. దేశంలో ఏ కంపెనీ, ఎన్నడూ చూడని వేగంతో వృద్ధి సాధిస్తున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.