రూ.10 వేలకే 5జీ స్మార్ట్​ఫోన్​.. మొబైల్​ సంస్థల ఆఫర్లు!

author img

By

Published : May 14, 2022, 8:14 PM IST

స్మార్ట్​ఫోన్​.

5g Mobile: స్మార్ట్​ఫోన్స్​ వినియోగదారులకు గుడ్​న్యూస్​. త్వరలోనే రూ.10వేల ధరకు 5జీ స్మార్ట్​ఫోన్స్​ను అందుబాటులోకి తెచ్చేలా సంబంధింత సంస్థలు ప్రణాళికలు రచిస్తున్నాయి. వచ్చే మార్చి నాటికి దేశంలో కీలక ప్రాంతాల్లో 5జీ సేవల్ని అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తక్కువ ధరకే ఈ ఫోన్లను తేవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

5g Mobile: 5జీ మొబైల్‌ కొనుక్కునే యోచనలో ఉన్నవారికి ఇది తీపి కబురనే చెప్పాలి! వచ్చే ఏడాది మార్చి నాటికి రూ.10 వేలకే 5జీ మొబైల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీనిపై ఇప్పటికే మొబైల్‌ సంస్థలు, అంతర్జాతీయ ఎలక్ట్రానిక్‌ చిప్స్‌ తయారీ కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. వచ్చే మార్చి నాటికి దేశంలో కీలక ప్రాంతాల్లో 5జీ సేవల్ని ప్రారంభించే యోచనలో టెలికాం కంపెనీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందుబాటు ధరలో 5జీ ఫోన్లను తీసుకురావడం కీలకంగా మారనుంది. ఇప్పటికే విస్తృతంగా వినియోగంలో ఉన్న 4జీ, 3జీ మొబైళ్ల స్థానంలో 5జీ ఫోన్లను తీసుకురావాలంటే ధరలు తగ్గాల్సిందే.

భారత్‌ వంటి దేశాల్లో కొత్త చిప్‌సెట్‌ను ప్రవేశపెడతామని అంతర్జాతీయ కంపెనీ క్వాల్‌కామ్‌ తెలిపింది. ప్రస్తుతం 5జీ ప్రాసెసర్‌తో వస్తోన్న స్నాప్‌డ్రాగన్‌ 480 చిప్‌సెట్‌తో పోలిస్తే దాని ధర తక్కువగా ఉంటుందని పేర్కొంది. తైవాన్‌కు చెందిన మీడియాటెక్‌, చైనా కంపెనీ యూనిసాక్‌ సైతం అందుబాటు ధరలో చిప్‌సెట్‌లను అందించేందుకు ముందుకు వచ్చాయని మొబైల్‌ తయారీ సంస్థలు వెల్లడించాయి.

ఒక స్మార్ట్‌ఫోన్‌ ధరలో చిప్‌సెట్‌దే 25-30 శాతం వాటా. దీని ధరను తగ్గించడం వల్ల ఫోన్‌ ధర సైతం తగ్గుతుంది. కొన్ని నెలల క్రితం ఎంట్రీ-లెవెల్‌ 5జీ ఫోన్ల ధర రూ.15,000గా ఉండేది. అది క్రమంగా రూ.12,999 పడిపోయింది. ఈ ఏడాది చివరికి అది మరింత తగ్గి రూ.12,000 దిగొచ్చే అవకాశం ఉందని ఓ ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ఉన్నతాధికారి తెలిపారు.

జనవరి-మార్చి త్రైమాసికంలో మొబైల్‌ విక్రయాల్లో 5జీ మొబైళ్ల వాటా 28 శాతమని కౌంటర్‌పార్ట్‌ రీసెర్చ్‌ నివేదిక తెలిపింది. ఈ ఏడాది చివరికి అది 40 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. అయితే, ఒక్క చిప్‌సెట్‌ల ధరలు మాత్రమే కాకుండా ఇతర పరికరాల ధరలు కూడా తగ్గాల్సిన అవసరం ఉందని మరో మొబైల్‌ తయారీ సంస్థ అధికారి తెలిపారు. 6-అంగుళాల హెడ్‌డీ తెర, మూడు కెమెరా లెన్సుల వంటి ఫీచర్ల విషయంలో వినియోగదారులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదన్నారు. వీటన్నింటి ధరలూ తగ్గాల్సిన అవసరం ఉందన్నారు.

ఇదీ చూడండి : ఎలాన్​ మస్క్ ట్వీట్.. భారత్​లో 'టెస్లా' కార్ల ప్రయత్నాలకు బ్రేక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.