కెయిర్న్ వివాదంలో భారత్​కు ఊరట- ఆస్తుల స్వాధీనంపై స్టే!

author img

By

Published : Sep 26, 2021, 12:39 PM IST

Air India, Cairn

సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న కెయిర్న్​ ఎనర్జీ, భారత ప్రభుత్వం పన్ను వివాదంలో మరో కీలక మలుపు తిరిగింది. భారత్​ నుంచి ఆర్బిట్రేషన్ అవార్డు దక్కించుకునేందుకు.. అమెరికాలోని ఎయిర్​ఇండియా ఆస్తులను జప్తు చేసుకోవాలన్న కెయిర్న్​ ఎనర్జీ ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్​ పడింది.

కెయిర్న్​ ఎనర్జీతో వివాదంలో భారత ప్రభుత్వానికి న్యూయార్క్ కోర్టులో కాస్త ఊరట లభించింది. అమెరికాలోని ఎయిర్​ఇండియా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న కెయిర్న్​ ప్రయత్నాలను న్యూయార్క్​ జిల్లా కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది న్యాయస్థానం. వార్తా సంస్థ పీటీఐ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

ఎయిర్​ఇండియా స్వాధీనం ఎందుకు?

భారత్​తో పన్ను వివాదం విషయంలో.. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు (ఆర్బిట్రేషన్​ కోర్టు) ఇచ్చిన తీర్పు మేరకు.. 1.2 బిలియన్​ డాలర్లు రాబట్టుకునేందుకు.. ఆమెరికాలోని ఎయిర్​ ఇండియా ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కెయిర్న్​ ప్రయత్నాలు చేస్తోంది.

అయితే రెట్రోస్పెక్టివ్‌ పన్నును రద్దు చేసేందుకు కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నందున.. అప్పటి వరకు స్టే విధించాలని భారత ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలోనే తాత్కాలికంగా ఎయిర్​ఇండియా ఆస్తుల జప్తు ప్రక్రియను నిలిపివేసింది న్యూయార్క్ జిల్లా కోర్టు.

కెయిర్న్​- భారత్​ వివాదం ఏమిటి?

2006లో కంపెనీ అంతర్గత పునర్‌వ్యవస్థీకరణ సమాచారాన్ని కోరుతూ కేంద్ర ప్రభుత్వ పన్నుల విభాగం కెయిర్న్‌‌ ఎనర్జీకి నోటీసులు జారీ చేసింది. వాటిని పరిశీలించిన అనంతరం 2015లో రూ.10,247 కోట్ల పన్నులు చెల్లించాలని కోరింది. పునర్‌వ్యవస్థీకరణ వల్ల వచ్చిన మూలధన రాబడిపై ఈ మేరకు పన్ను చెల్లించాలని తెలిపింది.

2010-11లో కెయిర్న్‌‌ ఎనర్జీ భారత్‌లోని తన అనుబంధ సంస్థ 'కెయిర్న్‌‌ ఇండియా'ను వేదాంతకు విక్రయించింది. ఈ క్రమంలో వేదాంతలో ప్రిఫరెన్షియల్‌ షేర్లతో పాటు ఐదు శాతం వాటాలను ఇచ్చారు.

దీంతో వేదాంతలోని ఐదు శాతం కెయిర్న్‌‌ ఎనర్జీ షేర్లను భారత ప్రభుత్వం అటాచ్‌ చేసింది. అలాగే రూ.1,140 కోట్ల డివిడెండ్లు, రూ.1,590 కోట్ల ట్యాక్స్‌ రీఫండ్‌ను నిలిపివేసింది. తదనంతరం తమకు రావాల్సిన పన్ను వసూలు కోసం అటాచ్‌ చేసిన వేదాంత షేర్లను విక్రయించింది. దీంతో బ్రిటన్‌‌-భారత్‌ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం(బీఐటీ) కింద ఈ నోటీసులను సవాలు చేస్తూ కెయిర్న్‌ ఎనర్జీ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. భారత్​.. కెయిర్న్​కు 1.2 బిలియన్‌ డాలర్లు చెల్లించాలని మధ్యవర్తిత్వ కోర్టులో తీర్పు వెలువడింది.

ఇదీ చదవండి: భారత్​తో కెయిర్న్​ రాజీ- బిలియన్ డాలర్లు ఇస్తే కేసులు వాపస్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.