వైద్య వ్యర్థాల నిర్వహణ పెను సవాలే..

author img

By

Published : Sep 26, 2021, 11:25 AM IST

Medical Wastage

వ్యర్థాలు.. ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్యల్లో ఇవి కూడా ఒకటి. అందులో ముఖ్యంగా వైద్య వ్యర్థాలు ఇటీవల తీవ్ర సమస్యగా పరిణమిస్తున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. ఇది పెను ముప్పుగా మారకముందే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెడికల్ వ్యర్థాల నిర్వహణ ఎలా ఉండాలి?

'కరోనా' మహమ్మారితో వైద్య వ్యర్థాల నిర్వహణ సమస్యగా మారిపోనుందా...?దీనికి సంబంధించిన తాజా నివేదికలను విశ్లేషిస్తే.. అవుననే సమాధానం లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైద్య వ్యర్థాలు (మెడికల్‌ వేస్ట్‌) రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వ్యాధుల తీవ్రత పెరగటం, దానికి తగ్గట్లుగా సరికొత్త చికిత్సా విధానాలు అందుబాటులోకి రావటంతో ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు, క్లినికల్‌ పరీక్షల కేంద్రాలు పెద్ద సంఖ్యలో వ్యర్థాలను సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. గతంతో పోలిస్తే ఆరోగ్య సంరక్షణ విషయంలో ఖర్చుకు వెరవడం లేదు. దీనికి తోడు 'కరోనా' మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విరుచుకుపడటం వల్ల వైద్య వ్యర్థాలు ఎంతగానో పెరిగిపోయే పరిస్థితి ఉత్పన్నం అయినట్లు నిపుణులు భావిస్తున్నారు. సమీప భవిష్యత్తులో ఇదొక పెద్ద సవాలు కాబోతోందని పేర్కొంటున్నారు. అదే సమయంలో వ్యర్థాల నిర్వహణ (వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌) సేవల్లో నిమగ్నమై ఉన్న సంస్థలకు ఇదొక వ్యాపార అవకాశంగా మారుతోంది. 'వాల్యుయేట్స్‌ రిపోర్ట్స్‌' అనే సంస్థ ఇటీవల ఒక తాజా నివేదికలో దీనికి సంబంధించిన సవాళ్లు, అవకాశాలను ప్రస్తావించింది.

ఏటా 6 శాతం వరకూ..

ప్రపంచ వ్యాప్తంగా వైద్య వ్యర్థాల నిర్వహణ మార్కెట్‌ గత ఏడాదిలో 7.2 బిలియన్‌ డాలర్లు ఉండగా వచ్చే పదేళ్లలో ఇది 12 నుంచి 13 బిలియన్‌ డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. అంటే ఏటా 6 శాతం మేరకు పెరుగుతున్నట్లు అవుతోంది. వైద్య వ్యర్థాల సేకరణ, రవాణా, నిల్వ, వ్యర్థాలను ప్రాసెస్‌ చేయటం, రీసైకిల్‌ చేయటం, వ్యర్థాల నుంచి కొత్త వస్తువులు ఉత్పత్తి చేయటం.. ఈ కార్యకలాపాలన్నీ వ్యర్థాల యాజమాన్యంలో భాగంగా ఉన్నాయి. ప్రజలకు కానీ, పర్యావరణానికి కానీ ఎటువంటి ఇబ్బందులు, హాని లేకుండా ఈ పనులు నిర్వహించాలి. గత ఏడాది ప్రారంభంలో చైనాలో మొదలై ప్రపంచ వ్యాప్తంగా 'కరోనా' మహమ్మారి విస్తరించింది. దీనికి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా, అంతకంటే అధిక సంఖ్యలో ఆస్పత్రుల పాలయ్యారు. ఇంతమందికి చికిత్సలు అందించే క్రమంలో భారీ పరిమాణంలో వైద్య వ్యర్థాలు తయారయ్యాయి. ఇక వ్యాధి నిర్ధారణకు నిర్వహించిన డయాగ్నస్టిక్‌ పరీక్షల వల్ల కూడా వ్యర్థాలు పెరిగాయి. 'కరోనా' పరీక్షలు, చికిత్సల వల్ల మనదేశంలోనే గత ఏడాది కాలంలో 45,000 టన్నులకు పైగా బయో-మెడికల్‌ వ్యర్థాలు తయారైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 'కరోనా' టీకాల నుంచి కూడా వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి అవుతున్నాయి. సిరంజిలు, సూదులు, టీకా మందు ఖాళీ సీసాలు, దూది.. తదితర రూపాల్లో వైద్య వ్యర్థాలు భారీగా పెరిగిపోతున్నాయి.

శాస్త్రీయంగా 'ప్రాసెస్‌'

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) లెక్కల ప్రకారం గుండె జబ్బులతో 1.79 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కేన్సర్‌, శ్వాసకోశ సమస్యలు, మధుమేహ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోవటం, దీర్ఘకాలం పాటు బాధపడుతుండటం జరుగుతోంది. దీనివల్ల ఆస్పత్రుల్లో, డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో వైద్య వ్యర్థాలు రోజురోజుకూ పెరిగిపోవటమే కానీ తగ్గుముఖం పడుతున్న దాఖలాలు లేవు. వైద్య వ్యర్థాల్లో సింహభాగం ఉత్తర అమెరికా దేశాలదే. అదే విధంగా ఆసియా- పసిఫిక్‌ దేశాల్లోనూ.. అధిక జనాభా కారణంగా వ్యర్థాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యర్థాల నివారణపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాల్సి వస్తోంది. అందుకు వీలుగా కఠినమైన నిబంధనలను రూపొందిస్తున్నాయి. వాటిని సక్రమంగా అమలు చేయాల్సిందిగా ఆస్పత్రులు, వైద్య సేవల సంస్థలపై ఒత్తిడి తీసుకువచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందువల్ల వ్యర్థాల నివారణలో నిమగ్నమై ఉన్న సంస్థలు, కొత్తగా ఈ విభాగంలోకి అడుగుపెట్టే వ్యాపారవేత్తలకు సమీప భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయని సంబంధిత వర్గాల అంచనా. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, ఈ అవకాశాలు మనదేశంలో అధికంగా ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. అధిక జనాభా ఉండటం, క్లినికల్‌- వైద్య సేవలు అధికంగా నిర్వహిస్తూ ఉన్నందున, భారీగా ఉత్పత్తి అయ్యే వైద్య వ్యర్థాలను శాస్త్రీయంగా 'ప్రాసెస్‌' చేయాల్సి ఉన్నట్లు, దీనిపై ప్రభుత్వం- పరిశ్రమ వర్గాలు దృష్టి సారించాల్సి ఉన్నట్లు వివరిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.