భారతీయ షార్ట్​ ఫిల్మ్​కు ఆస్కార్ అవార్డు.. సత్తా చాటిన ది ఎలిఫెంట్ విస్పరర్స్​

author img

By

Published : Mar 13, 2023, 7:23 AM IST

Updated : Mar 13, 2023, 9:22 AM IST

Best Documentary Short Film

07:21 March 13

Best Documentary Short Film

Best Documentary Short Film
భారతీయ షార్ట్​ ఫిల్మ్​కు ఆస్కార్ అవార్డ్

లాస్​​ ఏంజల్స్​లోని డాల్బీ థియేటర్​లో 95వ ఆస్కార్​ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా ప్రారంభమైంది. జిమ్మీ కిమ్మెల్ ఈ అవార్డుల ప్రధానోత్సవంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా ఒక్కో విభాగంలో విజేతలను బాలీవుడ్ తారాగణం ప్రకటిస్తోంది. ఈ వేడుకకు ప్రముఖులు, తారలతో పాటు, ఈ ఏడాది ఆస్కార్​కు నామినేట్​ అయిన సినిమాల నటీనటులు, సాంకేతిక సిబ్బంది కూడా హాజరయ్యారు. ఆర్​ఆర్​ఆర్​ మూవీ టీమ్​ కూడా ఈ వేడుకకు హాజరైంది. ఆర్​ఆర్​ఆర్​ చిత్ర బృదంలో దర్శకుడు రాజమౌళి, రామ్​చరణ్​, ఎన్టీఆర్​, కీరవాణి వారి సతీమణులతో ఈ వేడుకకు హాజరై సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈ వేదికపై తెలుగు పాట 'నాటు నాటు'ను ప్రదర్శించారు. హాలీవుడ్ డ్యాన్సర్లు ఈ నాటునాటు పాటకు చిందులేశారు. ఈ పాట ప్రదర్శించినప్పుడు డాల్బీ థియేటర్ మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది.

అయితే ఈ 2023 ఆస్కార్​ అవార్డుల జాబితాలో ఆర్​ఆర్​ఆర్​ నాటు నాటు సాంగ్​తో పాటు మరో భారతీయ చిత్రానికి పురస్కారం దక్కింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో భారతీయ చిత్రం 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'​ను ఆస్కార్ వరించింది. 95వ ఆస్కార్​ అకాడమీ అవార్డ్స్​లో ఈ తమిళ డాక్యుమెంటరీకి ఈ పురష్కారం దక్కడం విశేషం. 'హౌలౌట్', 'హౌ డు యు మెసర్ ఎ ఇయర్', 'ది మార్టా మిచెల్ ఎఫెక్ట్', 'స్ట్రేంజర్ ఎట్ ది గేట్' వంటి డాక్యుమెంటరీలు ఈ అవార్డు కోసం పోటీ పడ్డాయి. చివరకు ది ఎలిఫెంట్ విస్పరర్స్​ను ఆస్కార్ వరించింది. కార్తికి గొన్సాల్వేస్‌ ​ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ అవార్డ్​ను చిత్ర దర్శకురాలు కార్తికి గోన్‌సాల్వెస్‌, నిర్మాత గునీత్‌ మోగ్నలు కలిసి అందుకున్నారు. దీంతో స్టేజ్​పై మాట్లాడిన వీరిద్దరూ.. తమ శ్రమను గుర్తించి, ప్రతిష్టాత్మక అవార్డును అందించిన అకాడమీ బృందానికి పత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. "మేము ఇండియన్ సినిమా చరిత్రలో తొలిసారిగా ఆస్కార్‌ను గెలుచుకున్నాము. ఇద్దరు మహిళలు దీన్ని సాధించారు. నేను ఇంకా వణుకుతున్నాను" అని ది ఎలిఫెంట్ విస్పరర్స్ నిర్మాత గునీత్ మోంగా ట్వీట్ చేశారు.

ఇదే ఈ షార్ట్ ఫిల్మ్​ కథ.. తప్పిపోయిన ఏనుగును పెంచి పోషించిన దంపతుల కథతో భారతీయ దర్శకురాలు కార్తికి గోన్​సాల్వెన్​ తెరకెక్కించారు. దీనిని సిఖ్యా ఎంటర్​టైన్​మెంట్​ బ్యానర్​లో.. గునీత్‌ మోంగా, ఆచిన్‌ జైన్‌లు కలిసి నిర్మించారు. బొమ్మన్​-బెల్లి జంటకు.. తప్పిపోయి వచ్చిన 'రఘు' అనే ఓ ఏనుగుకు మధ్య బలమైన విడదీయలేని బంధం ఏర్పడుతుంది. వారి మధ్య ఉన్న సహజ అనుబంధాన్ని ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రకృతికి అనుగుణంగా ఉన్న గిరిజన ప్రజల జీవితాన్ని గురించి కూడా ఇందులో చూపించారు. తమినాడులోని ముదుమలై నేషనల్ పార్క్​లో ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించి.. ప్రకృతి సౌందర్యాన్ని చూపించారు. 2022 డిసెంబర్ 8న నెట్​ఫ్లిక్స్​ వేదికగా ప్రపంచ వ్యాప్తంగా ఈ డాక్యుమెంటరీ విడులదైంది. ప్రస్తుతం ఇది నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్​ అవుతోంది. ఇకపోతే గతంలోనూ ఇదే విభాగంలో ఇండియన్​ బ్యాక్​డ్రాప్​తో రూపొందిన రెండు డాక్యుమెంటరీలు ఈ ఆస్కార్​ అవార్డ్​ను సొంతం చేసుకున్నాయి. 'స్మైల్​ పింకీ', 'పీరియడ్​ ఎండ్​ ఆఫ్ సెంటెన్స్​' డాక్యుమెంటరీలు ఆస్కార్​ను సొంతం చేసుకున్నాయి.

Last Updated :Mar 13, 2023, 9:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.