ఇంగ్లిష్​ మీడియం వద్దంటూ గ్రామస్థుల పోరాటం.. హైకోర్టుకు వెళ్లి మరీ..

author img

By

Published : Jan 23, 2023, 9:40 PM IST

villagers-of-rajasthan-reach-high-court-against-english-medium-school

పాఠశాలలో ఇంగ్లిష్​ మీడియం ప్రవేశ పెట్టాలన్న రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ ఊరంతా ఏకమై పోరాడింది. హైకోర్టు దాకా వెళ్లి అనుకున్నది సాధించింది. రాజస్థాన్​లో ఈ సంఘటన జరిగింది.

రాజస్థాన్​లోని పాఠశాల్లో హిందీకి బదులుగా ఇంగ్లిష్​ మీడియం ప్రవేశ పెట్టాలని రాష్ట్ర విద్యాశాఖ భావించింది. ఇది ఓ గ్రామంలోని ప్రజలకు నచ్చలేదు. దీంతో ఆంగ్ల​ విద్యకు వ్యతిరేకంగా ఆ ఊరంతా ఏకమైంది. తమ ఊరి పాఠశాలలో ఇంగ్లిష్​ మీడియం వద్దంటూ ప్రభుత్వానికి వినతులు అందించారు. హిందీలోనే తమ పిల్లలకు బోధన చేయాలని పట్టుబట్టారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో గ్రామస్థులంతా హైకోర్టు తలుపు తట్టారు. చివరకు అనుకున్నది సాధించారు.

వివరాల్లోకి వెళితే..
జోధ్​పుర్​ జిల్లా లోహవత్ అసెంబ్లీ పరిధిలోని పిల్వా గ్రామంలో ఉన్న.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలో ఇంగ్లిష్​ మీడియం ప్రవేశ పెట్టాలని రాష్ట్ర విద్యాశాఖ అనుకుంది. అందుకు అనుగుణంగా చర్యలు సైతం ప్రారంభించింది. ఎనిమిదవ తరగతి వరకు ఇంగ్లిష్​​లో బోధించాలని నిర్ణయించింది. దీనిపై గ్రామస్థులంతా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధానంతో తమ పిల్లలు నష్టపోతారని తెలిపారు. ఇంగ్లిష్​ మీడియం ప్రవేశపెట్టొద్దని విద్యాశాఖకు పలు విజ్ఞప్తులు చేశారు.

ప్రయోజనం లేకపోవడం వల్ల గత నెలలో రాజస్థాన్​ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం నుంచి స్టే ఆర్డర్​ను తీసుకుని వచ్చారు. తరువాత విద్యాశాఖ కూడా కోర్టుకు అప్పీల్​కు వెళ్లింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. గ్రామస్థులకు మద్దతుగా తీర్పునిచ్చింది. పాఠశాలలో ఇంగ్లిష్​ మీడియం ప్రవేశపెట్టొద్దని, హిందీలోనే బోధన చేపట్టాలని విద్యాశాఖను ఆదేశించింది.

"2021 వరకు మా ఊరి స్కూల్​లో 800 మంది విద్యార్థులు చదివేవారు. అప్పటివరకు హిందీలోనే బోధన జరిగేది. 2022 సంవత్సరం నుంచి ఇంగ్లిష్​ మీడియం ప్రారంభించారు. దీని వల్ల మా పిల్లలు నష్టపోతారు. ఎనిమిదవ తరగతి హిందీలో చదవి, తొమ్మిదో తరగతి ఇంగ్లిష్​ చదవడానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతారు. మరో స్కూల్​కు వెళ్లాలంటే పది కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. ఇది పిల్లల ఫలితాల పైన ప్రభావం చూపుతుంది" అని గ్రామస్థులు తెలిపారు.

ఈ ఊర్లో 1945లో స్కూల్ ప్రారంభమైంది. భవనం శిథిలావస్థకు చేరుకోవడం వల్ల.. కొత్తది నిర్మించారు. ఠాకూర్ గోపాల్ సింగ్​ అనే వ్యక్తి విరాళాలు సేకరించి కొత్త పాఠశాల భవనం నిర్మించారు. సైన్యంలో లెఫ్టినెంట్​గా పనిచేసి ప్రాణాలు అర్పించిన తన కొడుకు హరిసింగ్ పేరు మీద ఈ స్కూల్​ నిర్మాణం చేశాడు. గత 78 సంవత్సరాలలో ఈ ఊరి నుంచి 500 మందికి పైగా భారత సైన్యంలో చేరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.