ఐదు నెలలుగా గ్యాంగ్ ​రేప్.. బాలిక ఆత్మహత్యాయత్నంతో తెలిసిన నిజం

author img

By

Published : Jan 20, 2023, 5:24 PM IST

UP Gangrape Case

ఇంటర్​ చుదువుతున్న ఓ విద్యార్థినిని తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు ఆమె ప్రియుడు. ఈ దారుణాన్ని వీడియో తీసి బ్లాక్​మెయిల్ చేస్తూ ఐదు నెలలుగా బాలికపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు నిందితులు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని నొయిడా నగరంలో జరిగింది. మరోపక్క కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనాథ అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు.

ఉత్తర్​ప్రదేశ్​లోని నొయిడాలో ఇంటర్​ విద్యార్థినిపై ఐదు నెలలుగా సాముహిక అత్యాచారం చేశారు ఆమె ప్రియుడు, స్నేహితులు. ఈ బాధను భరించలేని ఆ బాలిక ఆత్మహత్యకు యత్నించింది. విషయం తెలుసుకున్న బాధితురాలి సోదరి ఆమె ప్రాణాలను కాపాడింది.
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నొయిడా ప్రాంతానికి చెందిన బాలిక 12వ తరగతి చదువుతోంది. ఆమెతో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఈ దారుణాన్ని వీడియో తీసి తరచూ తమ కోరికలు తీర్చాలని అడిగారు. లేదంటే వీడియోలు, ఫొటోలు తమ స్నేహితులకు పంపిస్తామని బెదిరించి గత ఐదు నెలలుగా బాలికను సాముహికంగా అత్యాచారం చేశారు నిందితులు.

ఇదంతా భరించలేకపోయిన బాధితురాలు ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకుంది. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి సోదరి అప్రమత్తతతో ఆత్మహత్యయత్నాన్ని ఆపగలిగింది. ఇదంతా బాధితురాలి తల్లి దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె నిందితులపై పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ముగ్గురు నిందితులపై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని గ్రేటర్ నొయిడా జోన్ అదనపు డీసీపీ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఇంతకుముందు నిందితులు విద్యార్థిని ఇంటికి వెళ్లి ఆమె కుటుంబాన్ని కూడా చంపేస్తామని బెదిరించారని పోలీసులు చెప్పారు.

ముగ్గురు అక్కాచెల్లెళ్లు..
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనాథ అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే మరణించారు. దీంతో వారందరూ అమ్మమ్మ దగ్గర ఉండేవారు. అక్కాచెల్లెళ్లలో ఇద్దరు స్థానికంగా ఉండే వస్త్రాల దుకాణంలో పనిచేసేవారు.

అయితే కొద్దిరోజుల క్రితమే ఆ యువతుల అమ్మమ్మ కూడా మరణించింది. కుటుంబ సభ్యుల మరణంతో మానసిక వేదనకు గురైన వీరు 9 రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలు కుళ్లిపోయి దుర్వాసన వస్తుందని స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.