'నారీనారీ నడుమ మురారి'.. ఇద్దరు భార్యల ముద్దుల మొగుడికి కోర్ట్ గుడ్​ న్యూస్

author img

By

Published : Mar 14, 2023, 12:30 PM IST

2 wives 1 husband case in family court

సాధారణంగా కుటుంబసభ్యులు, అన్నదమ్ముల మధ్య ఆస్తి విషయంలో వివాదం తలెత్తితే కోర్టులను ఆశ్రయిస్తారు. న్యాయస్థానాలు వారికి ఉన్న ఆస్తులను సమానంగా పంచి సమస్యను పరిష్కరిచండం మనం చూసే ఉంటాం. అయితే మధ్యప్రదేశ్​లో.. ఇద్దరు మహిళలను పెళ్లాడిన ఓ వ్యక్తికి విషయంలో తలెత్తిన వివాదాన్ని ఫ్యామిలీ కోర్టు వింత తీర్పుతో పరిష్కరించింది. అసలు కోర్టు వారికి ఏం చెప్పిందంటే..?

మధ్యప్రదేశ్​లోని ఓ ఫ్యామిలీ కోర్టు వింత తీర్పునిచ్చింది. ఇద్దరు భార్యలు ఒకే భర్త విషయంలో గొడవ పడగా.. ఏ భార్యకు ఇబ్బంది కలగకుండా భర్తను సమానంగా విభజించింది కోర్టు. 3 రోజులు ఒక భార్య దగ్గర, మరో 3 మూడు రోజులు మరో భార్య దగ్గర గడపాలని ఆ వ్యక్తిని కోర్టు ఆదేశించింది. మిగిలిన ఆదివారం భర్త కోరిక మేరకు ఇద్దరు భార్యల్లో ఎవరితోనైనా ఉండవచ్చని ఒప్పందాన్ని కుదిర్చింది. ఈ తీర్పుతో ఇద్దరు భార్యలు ఎగిరిగంతేశారు. అసలు వీరి మధ్య ఏం జరిగిందంటే..!

అసలు ఈ నారీనారీ నడుమ మురారీ కథేంటంటే..!
గ్వాలియర్​కు చెందిన ఓ వ్యక్తి ప్రస్తుతం హరియాణాలోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఇంజినీర్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి 2018లో గ్వాలియర్​ ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైయ్యాక వీరిద్దరూ ఎంతో ఆనందంగా జీవించేవారు. అయితే, 2020లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా భారత్​లో లాక్​డౌన్​ విధించారు. దీంతో ఆ వ్యక్తి తన భార్యను పుట్టింటికి పంపించి.. తర్వాత గ్వాలియర్​లో ఉన్న తన తల్లి వద్దకు వచ్చాడు. కొన్ని నెలలకు కరోనా తగ్గుముఖం పట్టి.. లాక్​డౌన్​ ఎత్తివేసినా సరే ఆ వ్యక్తి తన భార్యను తనతో పాటుగా తీసుకుపోకుండా.. ఒక్కడే హరియాణకు వెళ్లాడు. ఇంతలో అదే కంపెనీలో పనిచేస్తున్న ఓ మహిళతో అతడికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. దీంతో అతడు ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు.

మరోవైపు భర్త వచ్చి తనని తీసుకెళ్తాడని ఎదురుచూస్తున్న మొదటి భార్యకు ఓపిక నశించి.. తానే స్వయంగా హరియాణాలో భర్త పనిచేస్తున్న ఆఫీస్​కు చేరుకుంది. అప్పుడే ఆమెకు తన భర్త గురించి ఓ షాకింగ్​ న్యూస్​ తెలిసింది. కొన్ని రోజుల క్రితం అదే ఆఫీస్​లో పనిచేస్తున్న మరో మహిళను వివాహం చేసుకున్నాడన్న నిజం తెలిసింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె తన భర్తతో వాగ్వాదానికి దిగింది. ఆ తర్వాత తనకు న్యాయం చేయాలంటూ.. గ్వాలియర్​లోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న ఫ్యామిలీ కోర్టు దాదాపు 6 నెలల పాటు వారికి కౌన్సిలింగ్​ ఇచ్చినా లాభం లేదు. దీంతో కోర్టు ముగ్గురితో వేర్వేరుగా చర్చలు జరిపింది. ఆ తర్వాత కోర్టు ముగ్గురూ ఒకే సారి కౌన్సిలింగ్​కు రావాలని ఆదేశించింది. ముగ్గురితో చర్చలు జరిపిన కౌన్సిలర్​ హారీష్​ దివాన్​ వారి సమస్యకు చక్కని పరిష్కారం అందించారు. అదేంటంటే.. భర్త ఒక భార్యతో 3 రోజులు, మరో భార్యతో 3 రోజులు ఉండాలని.. ఆదివారం తనకు నచ్చిన భార్యతో ఉండొచ్చని సూచించారు. ఈ నిర్ణయాన్ని అతడి ఇద్దరు భార్యలు ఎంతో ఆనందంగా అంగీకరించారు. ఈ తీర్పు తర్వాత ఆ భర్త తన భార్యలిద్దరికీ చెరో ఫ్లాట్​ కొనిచ్చాడు. ప్రస్తుతం ఈ ముగ్గురు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా వీరికి కౌన్సిలింగ్ ఇచ్చిన హరీష్​ దివాన్​లో వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.