గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసిన ప్రవీణ్‌.. ఆ పేపర్‌ కూడా లీక్‌ అయిందా..?

author img

By

Published : Mar 14, 2023, 1:19 PM IST

Updated : Mar 14, 2023, 2:27 PM IST

TSPSC

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్‌ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసినట్లుగా తేలింది. 150 మార్కులకు గానూ ప్రవీణ్‌కు 103 మార్కులు రాగా.. ఈ పేపర్‌ కూడా లీక్‌ అయిందా అనే అంశాన్ని సైబర్‌ నిపుణులు పరిశీలిస్తున్నారు.

రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ పరీక్షా పత్రాల లీక్‌ వ్యవహారంలో విస్మయకర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్‌ ఇటీవల జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాశాడు. ఇందులో ప్రవీణ్‌కు 103 మార్కులు రావటాన్ని గమనిస్తే.. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను కూడా లీక్‌ చేశాడా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ అధికారులు.. ప్రవీణ్ ఓఎంఆర్‌ షీట్‌ను పరిశీలిస్తున్నారు. ప్రవీణ్‌కు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో 103 మార్కులు వచ్చినా అర్హత సాధించలేదు. అయితే 150కు 103 మార్కులు వచ్చే ప్రతిభ ప్రవీణ్‌కు ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ప్రిలిమ్స్ పేపర్‌ వచ్చిన సర్వర్‌ను పరిశీలిస్తున్న సైబర్ నిపుణులు.. ఈ పేపర్ కూడా లీక్ అయిందా.. లేదా అని విశ్లేషిస్తున్నారు.

ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్‌ను స్త్రీలోలుడిగా పోలీసులు గుర్తించారు. 2017లో టీఎస్‌పీఎస్సీలో ప్రవీణ్ జూనియర్ అసిస్టెంట్‌గా చేరగా.. నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్ సెక్షన్‌లో పని చేశాడు. ఈ క్రమంలో వెరిఫికేషన్‌ సెక్షన్‌కు వచ్చే మహిళల నుంచి ఈ ప్రబుద్ధుడు ఫోన్ నంబర్లు తీసుకునేవాడు. దరఖాస్తులోని సాంకేతిక సమస్యలను పరిష్కరించి సాన్నిహిత్యం పెంచుకున్నాడని తెలిసింది. ఈ సమయంలోనే పలువురు మహిళలతో శారీరక సంబంధం ఏర్పరచుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ ఫోన్‌లో ఎక్కువ సంఖ్యలో మహిళల నంబర్లతో పాటు వాట్సప్ చాటింగ్, మహిళల నగ్న ఫొటోలు ఉన్నట్లు సమాచారం.

ఏడాది క్రితం పదోన్నతి లభించి టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడిగా వెళ్లిన ప్రవీణ్.. ఉన్నతాధికారుల వద్ద ఎంతో క్రమశిక్షణతో మెలిగేవాడు. దీనినే ఆసరాగా తీసుకుని పేపర్ లీకేజీకి తెర లేపాడని తెలుస్తోంది. ఏఈ పరీక్షా పత్రం కూడా ఉపాధ్యాయిని రేణుక కారణంగానే లీక్ అయిందని తేల్చారు. టౌన్ ప్లానింగ్‌ పరీక్షతో పాటు వెటర్నరీ పేపర్‌లను కూడా ప్రవీణ్‌ సంపాదించాడు. పేపర్లు చేతికి వచ్చినా.. ఒప్పందం కుదరకపోవటంతో వీటిని ఎవరికీ అమ్మలేదు.

ఇదిలా ఉండగా.. ఇటీవల టీఎస్‌పీఎస్సీ వరుసగా నోటీఫికేషన్లు జారీ చేసి పరీక్షలు జరుపుతుండగా.. వీటి పారదర్శకతపై అభ్యర్థుల్లో సందేహాలు నెలకొన్నాయి. ఇదివరకు నిర్వహించిన పరీక్షల క్వశ్చన్‌ పేపర్లూ లీక్‌ అయ్యాయా అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఒకేసారి నోటిఫికేషన్లు జారీ చేయగా.. కొన్ని నెలలుగా లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. చేస్తున్న ఉద్యోగాలకు సెలవులు పెట్టి కొందరు.. ఉద్యోగాలను వదులుకుని మరికొందరు పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రస్తుత పరిస్థితులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఇవీ చూడండి..

TSPSC పేపర్‌ లీకేజీ కేసు.. ప్రవీణ్‌ ఫోన్‌లో మహిళల న్యూడ్ వీడియోలు

TSPSC లీకేజీ వ్యవహారం.. AE పేపర్ ఒక్కటే కాదు.. అవి కూడా లీక్?

Last Updated :Mar 14, 2023, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.