Avinash Vs CBI : అధికార పార్టీ నేతల మాటే శాసనం.. మసకబారుతున్న ఏపీ పోలీసుల ప్రతిష్ట..!

author img

By

Published : May 25, 2023, 10:52 AM IST

మసకబారుతున్న ఏపీ పోలీసు ప్రతిష్ట

Avinash Vs CBI : ప్రతిపక్షాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజాసంఘాలు, ఎవరైనా సరే.. చిన్న శాంతియుత నిరసన చేపడితే పోలీసులు వారిని నిర్బంధించి నిమిషాల్లో ఖాళీ చేయిస్తారు. కానీ కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వద్ద అవినాష్ అనుచరులు గత నాలుగైదు రోజులుగా వీరంగం సృష్టిస్తూ, మీడియా, సామాన్యులపై దాడులకు పాల్పడుతుంటే ఖాళీ చేయించకుండా సహకరిస్తున్నారు. వారికి బందోబస్తు కల్పిస్తూ అండగా ఉంటున్నారు.

Avinash Vs CBI : ఆయన మాజీమంత్రి హత్య కేసులో నిందితుడు. సీబీఐ విచారణకు పిలిస్తే వెళ్లరు. అరెస్టు చేయడానికి వస్తే అనుచరులతో అడ్డుకుంటారు. దారిదాపుల్లోకి కూడా సీబీఐ రాకుండా అరాచకం సృష్టిస్తున్నారు. అడ్డుకోవాల్సిన రాష్ట్ర పోలీసులు నిందితుడికి వత్తాసు పలుకుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అమరావతిలో హక్కులు కోసం నిరసన తెలుపుతున్న రైతులపై దాష్టీకం ప్రదర్శిస్తున్న పోలీసులు కర్నూలులో హత్య కేసు నిందితుడికి మద్దతుగా మోహరించిన అల్లరిమూకలకు కొమ్ముకాస్తూ పరువు పోగొట్టుకుంటున్నారు.

సంత్ రామ్​పాల్ తరహాలో... హరియాణా హిస్సార్‌లోని సంత్‌లోక్ ఆశ్రమ నిర్వాహకుడు సంత్‌ రామ్‌పాల్‌ హత్యలు సహా పలు కేసుల్లో నిందితుడు. న్యాయస్థానాలు విచారణకు పిలిచినప్పుడు హాజరుకాకుండా ధిక్కరిస్తున్న ఆ ఆశ్రమ నిర్వాహకుడు సంత్ రామ్‌పాల్‌ను కోర్టు ఆదేశాల మేరకు అరెస్టు చేసేందుకు 2014లో ఆ రాష్ట్ర పోలీసులు రంగంలోకి దిగారు. వారి రాక కంటే ముందే సంత్ రామ్‌పాల్‌ ఆశ్రమం బయట, లోపల వేలాది మంది తన అనుచరులను మోహరించారు. పోలీసులను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. రోజుల తరబడి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. ఈ క్రమంలో చెలరేగిన ఘర్షణల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. కొందరు గాయపడ్డారు. ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుని పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. 2014లో జరిగిన ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.

ఇక్కడా అవే పరిస్థితులు... సంత్ రామ్‌పాల్‌ విషయంలో అప్పట్లో హిస్సార్‌లో చూసిన పరిస్థితులు ఇప్పుడు అవినాష్ రెడ్డి వ్యవహారంలో కర్నూలులో కళ్లకు కడుతున్నాయి. సంత్ రామ్‌పాల్‌ హరియాణా పోలీసులకు చుక్కలు చూపిస్తే అవినాష్ రెడ్డి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ సీబీఐనే ముప్పుతిప్పలు పెడుతున్నారు. అప్పట్లో హరియాణా పోలీసులు అత్యంత ఉద్రిక్తత పరిస్థితులను ఎదుర్కొని మరీ సంత్ రామ్‌పాల్‌ను అరెస్టు చేయగలిగారు. ఇప్పుడు సీబీఐ మాత్రం అవినాష్ అనుచరులను దాటుకెళ్లి అతన్ని అరెస్టు చేయలేకపోతోంది. హరియాణాలో అక్కడి ప్రభుత్వమే రంగంలోకి దిగి సంత రామ్‌పాల్‌ను పోలీసులతో ఆరెస్టు చేయించింది. ఏపీలో మాత్రం నిందితుడ్ని అరెస్టు చేయటానికి వచ్చిన సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోగా నిందితుడైన అవినాష్ రెడ్డికి అనుకూలంగా మోహరించిన ఆయన అనుచరులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలకు రాచమర్యాదలు చేస్తోంది.

సీబీఐ అనుకుంటే ఎంతసేపు పని... వాస్తవంగా సీబీఐ లాంటి సంస్థ తలుచుకుంటే హిస్సార్‌లో హరియాణా పోలీసులు చేసినట్లే ఎంతమంది అడ్డగించినా సరే వారందర్నీ అక్కడి నుంచి ఖాళీ చేయించి అవినాష్‌ రెడ్డిని అరెస్టు చేయొచ్చు. సీబీఐ మాత్రం ఏ కారణాల చేతనో వెనకడుగు వేస్తోంది. అవతలి వ్యక్తి ఎంతటి హోదాలో ఉన్నా సరే పోలీసులు అనుకుంటే అరెస్టు చేస్తారు. గతంలో కరుణానిధి, జయలలిత, కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి లాంటి మహామహుల్నే అడ్డంకుల్ని అధిగమించి అరెస్టు చేసిన సందర్భాలున్నాయి. అలాంటిది అవినాష్ అరెస్టుకు సీబీఐ ఆపసోపాలు పడుతోంది.

రాజధాని రైతుల విషయంలో... అమరావతి నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులు... ఆ భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆర్ 5 జోన్‌ను నిరసిస్తూ వారి సొంత స్థలాల్లోని దీక్షా శిబిరాల్లో శాంతియుతంగా కార్యక్రమాలు చేసుకుంటుంటే పోలీసులు వారిపై జులూం ప్రదర్శించారు. ఆంక్షలు ఉన్నాయంటూ శిబిరంలో ఉన్న వారిని ఈడ్చి పడేశారు. బలవంతగా లాక్కెళ్లి అరెస్టు చేశారు. ఇదే పోలీసులు.. కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వద్ద 5 రోజులుగా వీరంగం సృష్టిస్తున్న అవినాష్ అనుచరులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మాత్రం బందోబస్తు కల్పిస్తున్నారు. అవినాష్ అరెస్టుకు సహకరించాలని సీబీఐ కోరితే.. తమ వల్ల కాదంటూ చేతులెత్తేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో ఒకప్పుడు దేశంలో పేరొందిన ఏపీ పోలీసుల ప్రతిష్ఠ నాలుగైదు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో పూర్తిగా మససబారింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.