అప్పటి వరకు అవినాష్​పై కఠిన చర్యలు వద్దు.. సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశం

author img

By

Published : Mar 14, 2023, 6:59 AM IST

‍TS HC ON MP AVINASH PETITION

‍TS HC ON MP AVINASH PETITION: తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా కడప ఎంపీ అవినాష్‌ రెడ్డిపై కఠిన చర్యలొద్దని.. తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు.. తీర్పును రిజర్వ్‌ చేసింది. గత ఆదేశాల మేరకు వివేకా హత్య కేసులో ఎంపీ పాత్రపై ఆధారాలను సీబీఐ సమర్పించింది. దర్యాప్తు కీలకదశలో ఉన్నందున స్టే ఇవ్వొద్దని వాదించింది. ఇవాళ సీబీఐ విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న ఎంపీ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

TS HC ON MP AVINASH PETITION: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డ్‌ చేయాలని, తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉండటంతో పాటు విచారణకు పిలవకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై.. తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ జరిపారు. గత విచారణలో కోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డి పాత్రకు సంబంధించిన అన్ని ఆధారాలను సీబీఐ సోమవారం సమర్పించింది.

తెలంగాణ హైకోర్టుకు వివేకా హత్య కేసు విచారణ వివరాలు: హత్యకేసుకు సంబంధించిన దర్యాప్తు స్థాయి నివేదిక, హార్డ్‌ డిస్క్‌, 10 డాక్యుమెంట్లు, 35 మంది సాక్షుల వాంగ్మూలాలతో పాటు.. వివేకా డెత్‌ నోట్‌, ఫోరెన్సిక్‌ నివేదిక, ఘటనా స్థలంలో ఆధారాలు చెరపకముందు తీసిన ఫొటోలు, కేసు డైరీ వివరాలను సీల్డ్‌ కవర్‌లో అందజేసింది. హత్యా స్థలిలో సాక్ష్యాల ధ్వంసంలో అవినాష్‌ రెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ తరఫు న్యాయవాదులు అనిల్‌కుమార్‌, నాగేంద్రన్‌ హైకోర్టుకు నివేదించారు. కోర్టు అడిగిన అన్ని పత్రాలను, రికార్డులను సమర్పించామని, దీనిపై త్వరగా తేల్చి.. దర్యాప్తునకు అనుమతించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దర్యాప్తు కీలక దశలో ఉందని.. ఈ సమయంలో నిలిపివేయవద్దని సీబీఐ అధికారులు విన్నవించారు.

ఆధారాలు ధ్వంసం చేయడంలో అవినాష్​ది కీలక పాత్ర: వివేకా హత్య సమయంలో రాసిన లేఖను F.S.Lకు పంపి నివేదిక తెప్పించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీబీఐ తెలిపింది. వివేకా రాత నమూనాను పరీక్షించి.. దానికి సంబంధించిన ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించిన అభిప్రాయాన్ని సమర్పించామని పేర్కొంది. ఏ అంశాన్నీ వదిలి పెట్టడం లేదని నివేదించింది. హత్య జరిగిన రోజు 5 గంటల నుంచి 7 గంటల మధ్య ఘటనా స్థలంలో ఆధారాలు ధ్వంసం చేయడానికి అవినాష్‌ రెడ్డి ప్రయత్నించారన్నారు. ఈ కేసు గురించి పూర్తి సమాచారం అవినాష్​ వద్ద ఉందన్నారు.

అనుమతిస్తే సంప్రదాయంగా మారుతుంది: దర్యాప్తులో సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయని, ఈ దశలో స్టే మంజూరు చేస్తే దర్యాప్తు పట్టాలు తప్పుతుందన్నారు. పిటిషనర్‌ అభ్యర్థించినట్లుగా ఆడియో, వీడియో రికార్డింగ్‌ జరిపామని.. అందువల్ల ఎలాంటి ఉత్తర్వులూ అవసరం లేదన్నారు. విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించామని, ఐతే విచారణ గదిలోకి అనుమతించలేమని చెప్పారు. వీడియో, ఆడియో రికార్డింగ్‌ జరిపినపుడు న్యాయవాదిని సమీపంలోకి అనుమతిస్తే ఇబ్బంది ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇప్పుడు అనుమతిస్తే ఇది సంప్రదాయంగా మారుతుందని సీబీఐ న్యాయవాది జవాబిచ్చారు. తెలంగాణ హైకోర్టులో కేసు విచారణ జరుగుతున్నపుడు భాస్కరరెడ్డిని కడపలో విచారణకు ఎందుకు పిలవాల్సి వచ్చిందని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ఆయన్ను తాము పిలవలేదని సీబీఐ స్పష్టం చేసింది.

సీబీఐ, సునీత సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారు: అంతకుముందు పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. తాము అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేసిన కొంతసేపటికే సునీతకు సమాచారం వెళ్లడం, ఆమె ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేయడం చూస్తుంటే.. సీబీఐ, సునీత సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నట్లు ఉందన్నారు. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని, దర్యాప్తు అధికారిని మార్చాలంటూ ఈ నెల 7న సీబీఐ డైరెక్టర్‌కు వినతి పత్రం పంపినట్లు తెలిపారు.

ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి: సునీత తరఫు పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సునీత ప్రతివాదిగా చేరకుండా ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేశారన్నారు. హత్యకు సంబంధించి తెలిసిన విషయాలు పోలీసులకు వెల్లడించాల్సి ఉందని.. అలా చేయకపోవడం నేరమేనని అన్నారు. జనవరి 28న, ఫిబ్రవరి 24న విచారణ చేపట్టినపుడు దర్యాప్తు అధికారిపై ఎలాంటి ఆరోపణలూ చేయలేదని.. ఇప్పుడు దీనిపై ఆరోపణలు చేస్తున్నారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇప్పుడు దర్యాప్తు అధికారిపై డైరెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నారని.. ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.

దర్యాప్తు కొనసాగుతుంటే సమావేశాలు ఎలా నిర్వహిస్తారు..?: వివేకా హత్య కేసులో తనపై కఠిన చర్యలు తీసుకోరాదని, తదుపరి విచారణ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషన్‌లపై ఉత్తర్వులు వెలువరించేదాకా.. ఎంపీ అవినాష్‌ రెడ్డిపై అరెస్టు సహా కఠిన చర్యలు తీసుకోరాదంటూ సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పార్లమెంట్‌ సమావేశాల కారణంగా మంగళవారం సీబీఐ ముందు హాజరు నుంచి మినహాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్న అవినాష్‌రెడ్డి అభ్యర్థనను తిరస్కరించింది. గత విచారణ సందర్భంగా సీబీఐ కార్యాలయం ముందే అవినాష్‌ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు కొనసాగుతుండగా ఇలాంటి సమావేశాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. ఈ దశలో అవినాష్‌ తరఫు న్యాయవాది క్షమాపణ కోరడంతో.. ఇలాంటివి పునరావృతం కారాదని స్పష్టం చేసింది.

నేడు మరోసారి సీబీఐ విచారణకు ఎంపీ: వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఇవాళ మరోసారి సీబీఐ ముందుకు రానున్నారు. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కానున్నారు. మంగళవారం విచారణకు హాజరుకాలేనంటూ సీబీఐకి సోమవారం మధ్యాహ్నం అవినాష్‌రెడ్డి లేఖ రాశారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. సీబీఐ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇవాళ విచారణకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే పులివెందుల నుంచి అవినాష్‌ రెడ్డి హైదరాబాద్‌కు వెళ్లారు.

అప్పటి వరకు అవినాష్​పై కఠిన చర్యలు వద్దు.. సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.