రాజకీయ సన్యాసంపై క్లారిటీ ఇచ్చిన రజినీ.. ఆ కారణంతోనే వెనక్కి తగ్గారట!

author img

By

Published : Mar 12, 2023, 8:02 AM IST

Updated : Mar 12, 2023, 11:41 AM IST

superstar rajinikanth clarity on political life

సూపర్​స్టార్​ రజినీకాంత్​ తాన రాజకీయ జీవితానికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. కొత్త పార్టీ ప్రకటిస్తానని చెప్పిన ఆయన.. రాజకీయాలకే పూర్తిగా దూరంగా ఉంటున్నట్లు గతంలో వెల్లడించారు. తన వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితుల కారణంగానే తానీ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో తలైవా స్వయంగా వెల్లడించినా సరే అభిమానులు, మద్దతుదారుల్లో అది ఓ పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న తలైవా రాజకీయాలకు దూరం అవ్వడానికి గల ప్రధాన కారణాన్ని వెల్లడించారు. అదేంటంటే..?

సూపర్​స్టార్ రజనీకాంత్‌ రాజకీయ ప్రస్థానానికి అడ్డుకట్ట వేసిందేమిటి..? అనేది ఆయన అభిమానులకు, మద్దతుదారులకు ఇప్పటికీ పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది. తన ఆరోగ్య పరిస్థితుల కారణంగానే రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు తలైవా గతంలో స్వయంగా ప్రకటించారు. అయితే శనివారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తలైవా.. ఈ విషయంపై మరింత క్లారిటీ ఇచ్చారు. కిడ్నీ సంబంధిత సమస్యల దృష్ట్యా వైద్యుల సలహా మేరకు తాను రాజకీయాలకు దూరమైనట్లు వెల్లడించారు.

"నా రాజకీయ జీవితంలో నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. నేను కిడ్నీ మార్పిడి చేయించుకున్నాను. నా ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. ప్రపంచవ్యాప్తంగా రెండో దశ కొవిడ్​ మహమ్మారి విజృంభించిన సమయంలో నేను నా డాక్టర్​ రవిచందర్​ను సంప్రదించాను. ఆయన అందరికీ 10 అడుగుల దూరం పాటించి.. మాస్క్​ ధరించాలని సలహా ఇచ్చారు. నేను రాజకీయాల్లోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 'ప్రచార సమయంలో వీటికి కట్టుబడి ఉండడం సాధ్యమేనా? ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించేటప్పుడు ఇది సాధ్యమా?' అని ప్రశ్నించారు."
--సూపర్​స్టార్​ రజినీకాంత్​

"2010లో డాక్టర్​ రవిచందర్​ను కలిసిన రోజు నా జీవితంలో మరిచిపోలేనిది. గతంలో నేను ఓ ఆస్పత్రిలో తీసుకున్న చికిత్స అంత సంతృప్తికరంగా అనిపించలేదు. అప్పటికే నా కిడ్నీ 60 శాతం పాడైందని తేలింది. అప్పుడు, రవిచందర్ అమెరికాలో ఉన్న రొచెస్టర్‌లోని మాయో క్లినిక్‌కు కిడ్నీ మార్పిడి కోసం వెళ్లమని సూచించారు. ఎందుకంటే, ఇక్కడ చాలా ఫార్మాలిటీలు ఉన్నాయి.. దీంతోపాటు సెలబ్రిటీగా కూడా సమస్యలు ఉంటాయి. అందుకే అతను విదేశాలకు వెళ్లాలని ఒత్తిడి చేశారు" అని చెన్నైలోని సేపియన్స్ హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తలైవా ఈ విషయాన్ని గుర్తుచేసుకున్నారు. డాక్టర్​ రవిచందర్​ తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించిన తర్వాతనే రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు రజినీ స్పష్టం చేశారు.

2020 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు సూపర్​స్టార్​ రజినీకాంత్​. దీంతో అభిమానులు, మరికొందరు వ్యక్తులు ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. అప్పట్లో ఆయన వేరువేరు పార్టీలతో కలిసి పని చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయనే స్వయంగా ఓ పార్టీని పెడుతున్నట్లు వెల్లడించారు. ఆ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజులకే.. తన ఆరోగ్య పరిస్థితుల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు స్వయంగా ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు, మద్దతుదారులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. తమ పార్టీకి మద్దతుగా నిలిస్తాడని భావించిన బీజేపీ సైతం.. తలైవా తీసుకున్న నిర్ణయంతో నిరాశకు గురైంది. ఆ తర్వాత చాలాసార్లు తలైవా రాజకీయాల్లో రీఎంట్రీ ఇస్తారనే వార్తలు వచ్చినా సరే ఆయన తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేది లేదని తేల్చిచెప్పారు.

Last Updated :Mar 12, 2023, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.