Mirage Tyre Stolen: వాయు సేనకు చెందిన యుద్ధ విమానం టైరును అపహరించిన ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. మిరాజ్ యుద్ధ విమానానికి ఉపయోగించే ఐదు టైర్లను 40 అడుగుల పొడవైన భారీ ట్రక్పై ఉంచి లఖ్నవూలోని బక్షికా తాలాబ్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి జోధ్పుర్ తరలించేందుకు సిద్ధం చేశారు.
అయితే అందులోని ఓ టైరు ఇటీవలే అదృశ్యమైంది. దీనిని గుర్తించిన ఆ ట్రక్ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. టైరును అపహరించిన వ్యక్తులుగా భావిస్తున్న ఇద్దరు దానిని డిసెంబర్ 4వ తేదీన బీకేటీ వాయుసేన స్థావరంలోని అధికారులకు తిరిగి ఇచ్చేశారు. వీరిని దీప్రాజ్, హిమాన్షు బన్సల్గా గుర్తించారు.
లఖ్నవూలోని షహీద్పాత్ సినీపోలీస్ వద్ద నవంబర్ 26వ తేదీన ప్రధాన రహదారి, సర్వీసురోడ్డు మధ్యలో వీరు ఒక టైర్ను గుర్తించారు. దానిని లారీ టైరుగా భావించి ఇంటికి తీసుకెళ్లినట్లు అధికారులకు చెప్పారు.
డిసెంబర్ 3వ తేదీన యుద్ధవిమానం టైరు అదృశ్యమైన విషయం వార్తల్లోచూసి దానిని తిరిగి ఇచ్చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎయిర్ఫోర్స్ అధికారులు కూడా ధ్రువీకరించారు.
ఇదీ చూడండి: Misfire on Civilians: బలగాల తప్పిదం.. 11 మంది పౌరులు మృతి!