లగ్జరీ లైఫ్​ కోసం తల్లిదండ్రులు, నాన్నమ్మ హత్య!.. కనిపించట్లేదని పోలీసులకు కట్టుకథలు.. చివరకు..

author img

By

Published : May 18, 2023, 10:27 PM IST

Triple murder revealed in Putka village

తల్లిదండ్రులు, నాన్నమ్మను దారుణంగా చంపేశాడు ఓ యువకుడు. అనంతరం తమ కుటుంబసభ్యులు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో కట్టుకథలు చెప్పాడు. చివరకు అతడి తమ్ముడి సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. అసలు విషయాన్ని బయటపెట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఛత్తీస్​గఢ్​లో ఓ యువకుడు.. తన తల్లిదండ్రులు, నాన్నమ్మను చంపేసి పోలీసులకు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. వారు ముగ్గురు ఆస్పత్రికి వెళ్లి తిరిగి రాలేదని చెప్పాడు. చివరకు అసలు నిజం బయటపడి కటాకటాలపాలయ్యాడు.
పోలీసులు ఏం చెప్పారంటే?
మహాసముంద్​ జిల్లాలోని పుట్కా గ్రామానికి చెందిన ప్రభాత్ భోయ్, అతడి భార్య జర్నా భోయ్, ప్రభాత్ తల్లి సులోచన కనిపించడం లేదని ప్రభాత్​ కుమారుడు ఉదిత్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తన కుటుంబసభ్యులు ఆస్పత్రికి వెళ్లి తిరిగి రాలేదని ఉదిత్​ పోలీసులకు చెప్పాడు. దీంతో పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఉదిత్​ తమ్ముడు అమిత్​ ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు, నాన్నమ్మ కనిపించడం లేదని తెలుసుకున్నాడు. ఇంటి ప్రాంగణంలో రక్తపు మరకలు గమనించాడు. ఇంటి వెనుక కర్రలు కాలిపోయి బూడిదగా ఉన్నట్లు చూశాడు. ఏం జరిగిందో తెలియక పోలీసులకు సమాచారం అందించాడు. ఇంటికి వచ్చి అన్నీ పరిశీలించిన పోలీసులు.. ఉదిత్​ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. అప్పుడు అసలు విషయాలను బయటపెట్టారు.

తాను విలాసవంతమైన జీవితం గడపాలనుకుంటున్నానని.. కానీ ఇంట్లో ఎవరూ డబ్బులు ఇవ్వలేదని అందుకే చంపేశానని ఉదిత్ పోలీసులకు తెలిపాడు. తండ్రి ప్రభాత్ భోయ్ తాగే అలవాటుతో తరచూ కోపంగా ఉండేవాడని.. ఇంటి వాతావరణం చెడిపోయిందని చెప్పాడు. మే 8వ తేదీ రాత్రి 2 గంటల సమయంలో దాడి చేసి చంపేశానని ఒప్పుకున్నాడు. ఇంట్లో ఉన్న రక్తపు మరకల్ని శానిటైజర్‌తో శుభ్రం చేశానని తెలిపాడు. ఇంటి వెనుక ఉంచిన కలపను ఉపయోగించి ముగ్గురి మృతదేహాలను దహనం చేశానని చెప్పాడు.

ఇద్దరు బాలికలు కిడ్నాప్​.. ఏడుగురు యువకులు గ్యాంగ్​రేప్​..
ఝార్ఖండ్​లోని గుమ్లా జిల్లాలో ఇద్దరు చిన్నారులపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన 15 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఏడుగురిలో ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేశారు

ఇదీ జరిగింది
జిల్లాలోని సదర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ గ్రామంలో మే1వ తేదీన జరిగిన వివాహ వేడుకలకు ఇద్దరు బాలికలు వెళ్లారు. ఆ సమయంలో వారిద్దరినీ ఏడుగురు యువకులు కిడ్నాప్​ చేశారు. అనంతరం ఓ భవనంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జరిగిన ఈ విషయాన్ని ఓ బాధితురాలు ఇంట్లో తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో విషయం బయటకొచ్చింది.

మైనర్ల ఆరోగ్యం క్షీణించడం వల్ల బాధితురాళ్ల బంధువులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు గురువారం ఉదయం గ్రామానికి వెళ్లి పరిశీలించారు. ఇద్దరు నిందితులను పట్టుకున్న పోలీసులు వారిని విచారణ నిమిత్తం పోలీస్​స్టేషన్‌కు తరలించారు. మిగతా వారికోసం గాలిస్తున్నారు. బాలికలను వైద్య పరీక్షల చేయించి మెరుగైన చికిత్స అందించారు.

13 ఏళ్ల బాలికపై గ్యాంగ్​రేప్​
అసోంలోని కోక్రాజార్​ జిల్లాలో కారులో 13 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నలుగురు నిందితులను అరెస్ట్​ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జిల్లాలోని డోట్మా పట్టణంలో ఈ ఘటన జరిగింది. మంగళవారం సాయంత్రం జాతీయ రహదారి 31సీపై బాధితురాలిని బలవంతంగా నలుగురు నిందితులు కారులోకి ఎక్కించారు. ఆ తర్వాత రోడ్డుపై కారు వెళ్తుండగా సామూహిక అఘాయితానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. బుధవారం సాయంత్రం నలుగురిని అరెస్ట్​ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కోక్రాఝర్​లో కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలనుసారం మూడు రోజుల పోలీస్​ రిమాండ్​కు తరలించారు.

యూనివర్సిటీలో కాల్పులు.
ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ యూనివర్సిటీలో కాల్పులు కలకలం రేపాయి. శివ్ నాడార్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి.. క్యాంపస్​లోనే తోటి విద్యార్థిని కాల్చి చంపాడు. అనంతరం తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల సమచారం ప్రకారం..
దాద్రీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో శివనాడార్ యూనివర్సిటీలో గురువారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు అనూజ్​ సింగ్​.. ఓ యువతితో గతకొద్ది రోజులుగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఆమె వేరే యువకుడితో మాట్లాడుతోందని అనుమానించాడు.

బీఏ సోషియాలజీ మూడో సంవత్సరం చదువుతున్న ఇద్దరూ ముందుకు క్యాంపస్​ ఆవరణలో.. గురువారం మధ్యాహ్నం కౌగిలించుకున్నారు. ఆ తర్వాత అనూజ్​.. ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో క్యాంపస్​లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు.. విద్యార్థినిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

అనంతరం అనూజ్​.. హాస్టల్‌లోని 328వ నంబర్‌ గదికి వెళ్లి కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. యూనివర్సిటీ యాజమాన్యం ఇరువురి కుటుంబాలకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.