Software Employee Wife Murder Updates: స్నేహితుడే ఈ ఘోరానికి పాల్పడ్డాడా?.. జిల్లెళ్లపాడు హత్య కేసులో విస్తుపోయే విషయాలు

author img

By

Published : May 19, 2023, 10:26 AM IST

Software Employee Wife Murder Case

Software Employee Wife Murder Case: ప్రకాశం జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సాఫ్ట్​వేర్​ ఉద్యోగి భార్య కేసులో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. ఇంటి నుంచి బయటికి వెళ్లి.. గ్రామ సమీపంలో విగతజీవిగా మారేంతవరకు జరిగిన సంఘటనలు చూస్తే విస్తుపోవాల్సిందే..

Software Employee Wife Murder Case: 'తీసుకున్న డబ్బులో కొంత తిరిగిచ్చేస్తా నేను చెప్పిన చోటికి వెళ్తే మా వాళ్లు డబ్బులిస్తారు'... ఇదీ అతను పంపిన సందేశం. అది నిజమేనని ఆమె నమ్మారు. బిడ్డను వెంటబెట్టుకుని కనిగిరి వెళ్లారు. కొడుకును బాబాయ్​ ఇంటిలో వదిలి.. పామూరు బస్టాండ్ వద్దకు చేరారు. కాసేపటి తర్వాత ఇంట్లో వాళ్లు ఫోన్ చేస్తే.. ఇదిగో వచ్చేస్తున్నా.. అని చెప్పారు. ఆ తర్వాత కాసేపటికే ఫోన్ రింగవుతున్నా.. అటు వైపు నుంచి ఎలాంటి సమాధానం లేకపోయింది. దీంతో చిన్నాన్న నాగిరెడ్డి కంగారు పడ్డారు. వెంటనే ఈ విషయాన్ని అన్న సుధాకర్ రెడ్డికి చెప్పారు. ఆమె స్నేహితుల్ని విచారించినా ఆచూకీ లభ్యం కాలేదు. చివరికి అత్యంత దయనీయ స్థితిలో రోడ్డు పక్కన ఆమె మృతదేహం కనిపించింది. స్వగ్రామం అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు నుంచి కనిగిరికి కుమారుడితో కలిసి వెళ్లిన రాధ.. అనంతరం తమ ఊరికి సమీపంలోనే విగతజీవిగా మారారు.

అన్ని వేళ్లూ అతడి వైపే..: హత్యోదంతంలో అందరి దృష్టి అదే మండలంలోని సమీప గ్రామానికి చెందిన కేతిరెడ్డి కాశిరెడ్డి అలియాస్ చినకాశయ్య వైపే చూపిస్తున్నాయి. కాశిరెడ్డి, రాధ చిన్నతనం నుంచి ఒకే స్కూల్లో, ఒకే కాలేజీలో చదివారు. మంచి స్నేహితులు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన మోహన్ రెడ్డితో రాధకు వివాహమైన తర్వాత హైదరాబాద్​లో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమారులు. అప్పటికే హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న కాశిరెడ్డి వీరికి కుటుంబ స్నేహితుడిగా మారాడు. హైదరాబాద్​లో కాశిరెడ్డి పని చేస్తున్న కంపెనీ నుంచి అతడిని తొలగించారు. దీంతో తనకొక ప్రాజెక్టు ఆలోచన ఉందని.. అందుకు డబ్బు అవసరమని రాధ, మోహన్​రెడ్డి దంపతులను కాశిరెడ్డి నమ్మించాడు. స్నేహితుడికి ఆర్థికంగా సపోర్ట్​గా నిలుద్దామని ఆ దంపతులు భావించారు. సుమారు 80 లక్షల రూపాయల వరకు అతనికి అప్పుగా ఇచ్చి స్నేహ ధర్మం పాటించామనే అనుకున్నారు.

ఉత్సవానికి వచ్చి.. విగతజీవిగా మారి...: అప్పుగా ఇచ్చిన నగదును తిరిగి తీసుకోవడం కోసం రాధ, ఆమె భర్త కలిసి కాశిరెడ్డిని పలుమార్లు సంప్రదించారు. అయినా పెద్దగా ఫలితం లేకపోయింది. ఈ నెల 11న తమ గ్రామంలో నిర్వహించే చౌడేశ్వరీ దేవి ఉత్సవంలో పాల్గొనడానికి ఇద్దరు పిల్లలతో రాధ తన స్వగ్రామమైన జిల్లెళ్లపాడు వచ్చారు. ఆ సమయంలో ఆమెకు కాశిరెడ్డి నుంచి ఓ మెసేజ్​ వచ్చింది. తాను చెప్పిన చోటికి వస్తే కొంత డబ్బు ఇస్తాననేది ఆ మెసేజ్​ సారాంశం. దీంతో బుధవారం సాయంత్రం సుమారు ఐదు గంటల సమయంలో చిన్న కుమారుడితో కలిసి ఆమె కనిగిరి చేరుకుంది. అక్కడ చిన్నాన్న ఇంటిలో కుమారుడిని విడిచి పెట్టింది. ఆ తర్వాత చిన్నాన్న బండిపై పామూరు బస్టాండులో దిగారు. అనంతరం కొద్ది గంటలకే ఆమె విగతజీవిగా మారింది. పోలీసులు రాధ చరవాణిని స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు.

క్రూరంగా హింసించి.. కారుతో తొక్కించి: ఈ మొత్తం వ్యవహారంలో అసలు ఏం జరిగింది.? రాధను ఎవరు హత్య చేశారనేది మిస్టరీగా మారింది. కేతిరెడ్డి కాశిరెడ్డి పాత్రపై ఇప్పటికే పోలీసులు ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. రాధను అత్యంత క్రూరంగా, పాశవికంగా హత్య చేశారనేది పోలీసుల ప్రైమరీ ఇన్వెస్టిగేషన్​లో వెల్లడైంది. ఆమె కాళ్లు, ఛాతీ పైనా కారుతో తొక్కించి అత్యంత ఘోరంగా హింసించిన ఆనవాళ్లను సైతం గుర్తించారు. శరీరంపై రాళ్లతో తీవ్రంగా దాడి చేశారు. బండరాళ్లతో మోది, సిగరెట్లతో కాల్చి హత్య చేసినట్టు నిర్ధారించుకున్నారు. ఈ దారుణం ఒక్కరితో సాధ్యం కాదని.. ముగ్గురు లేదా నలుగురు ఉండొచ్చని భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదికలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే అటువంటిదేమీ లేదని పోలీసు అధికారులు కొట్టిపడేస్తున్నారు. ఈ హత్యపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామని, నిందితుల్ని గుర్తించి త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ మలికా గార్గ్‌ చెప్పారు.

కాశిరెడ్డి కోసం విస్తృత గాలింపు..: జిల్లెళ్లపాడు గ్రామ సమీపంలో చోటు చేసుకున్న హత్యోదంతంపై పోలీసు అధికారులు ఆరా తీశారు. సంఘటనా స్థలాన్ని అదనపున శిక్షణ ఎస్పీ శ్రీధర్‌, డీఎస్పీ రామరాజు, సీఐ కె.శ్రీనివాసరావు పరిశీలించారు. హత్యకు గల కారణాలపై ఎస్సై మహేష్‌ కుమార్‌తో మాట్లాడారు. ఒంగోలు నుంచి డాగ్‌ స్వ్కాడ్‌ను రప్పించారు. పోలీసు జాగిలం రాధ మృతదేహం పడి ఉన్న చోటు నుంచి కనిగిరి వైపు వెళ్లడాన్ని గుర్తించారు. నిందితుడు కాశిరెడ్డి కోసం బెంగళూరు తదితర ప్రాంతాలకు బృందాలను పంపారు. కనిగిరి నుంచి బెంగళూరు వరకు ఉన్న చెక్‌పోస్ట్‌ల వద్ద తనిఖీలు చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.