'ఆస్తులు టాటాలకు.. అప్పులు ప్రజలకా?'

author img

By

Published : Oct 12, 2021, 6:55 AM IST

yechury air india

ఎయిర్ ఇండియాను టాటాలకు మోదీ ప్రభుత్వం బహుమానంగా ఇచ్చిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury news) విమర్శించారు. రూ.60 వేల కోట్ల అప్పుల్లో టాటాలు రూ.15 వేల కోట్లకే బాధ్యత తీసుకుంటారని, ఇది ప్రభుత్వం చేసిన దారిదోపిడీ అని మండిపడ్డారు. (Air India sold to Tata)

ఎయిర్‌ ఇండియా అమ్మకం పేరుతో మోదీ ప్రభుత్వం జాతీయ ఆస్తిని టాటాలకు (Air India sold to Tata) దోచిపెట్టిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury news) విమర్శించారు. ఇది ప్రభుత్వం చేసిన పట్టపగలు దారిదోపిడీయేనని అభివర్ణించారు. పార్టీ పొలిట్‌బ్యూరో (CPM Politburo) సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ఆయన సోమవారం దిల్లీలో విలేకరులతో మాట్లాడారు.

"ఎయిర్‌ ఇండియా అమ్మకం కాదు. టాటాలకు బహుమానంగా ఇచ్చారు. ఈ లావాదేవీ వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.2,700 కోట్లే అందుతాయి. రూ.60 వేల కోట్ల అప్పుల్లో టాటాలు రూ.15 వేల కోట్లకే బాధ్యత తీసుకుంటారు. మిగతా భారాన్ని ప్రభుత్వమే భరించాలి. దీన్ని ప్రజల సొమ్ముతో చెల్లించబోతోంది. ఈ జాతిసంపద దోపిడీని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలతో కలిసి నిరసన వ్యక్తంచేస్తాం."

-సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి

ఎక్సైజ్‌ సుంకాన్ని రద్దు చేయాలి

ధరల పెరుగుదలకు కారణమవుతున్న పెట్రోలియం (Rising petrol prices) ఉత్పత్తులపై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని (Excise duty on petrol) పూర్తిగా రద్దు చేయాలని సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. చమురు ధరలపై ప్రభుత్వం 70% పన్నులు వసూలు చేస్తోందని, ఒక్క ఎక్సైజ్‌ డ్యూటీ ద్వారానే గత ఏడాది రూ.3.60 లక్షల కోట్లు దోచుకుందని ఆయన మండిపడ్డారు. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.వెయ్యి దాటినందున పేదలు వంటగ్యాస్‌ మానేసే పరిస్థితి వచ్చిందన్నారు. (Rising prices in India)

వామపక్షాలకు అధికార కాంక్ష తప్ప ప్రజా సమస్యలపై ధ్యాసలేదన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలపై ఏచూరి మండిపడ్డారు. 'కేంద్రంలోని భాజపా మంత్రులు అబద్ధాలుచెప్పే పనిలో నిమగ్నమయ్యారు. బెంగాల్‌లో 34 ఏళ్లపాటు వామపక్ష ప్రభుత్వం కొనసాగిన సమయంలో.. మిగతా రాష్ట్రాలకంటే అత్యంత వేగంగా పేదరిక నిర్మూలన జరిగినట్టు ప్రపంచబ్యాంకే వెల్లడించింది. గుజరాత్‌కు ఉన్న భౌగోళిక పరిస్థితుల కారణంగా అది ఎప్పుడూ సంపన్న రాష్ట్రంగానే ఉంది. శతాబ్దాల తరబడి అక్కడి నుంచి మంచి ఎగుమతులు కొనసాగుతున్నాయి. అదంతా భాజపా ద్వారానే జరిగినట్టు చెప్పుకోవడం హాస్యాస్పదం' అని ఏచూరి ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.