బస్సులో సీక్రెట్​ క్యాబిన్​.. డౌట్​ వచ్చి చూస్తే 2500 కిలోల వెండి..

author img

By

Published : May 9, 2022, 7:22 AM IST

Updated : May 9, 2022, 11:55 AM IST

SILVER-SEIZED

Silver ornaments seized: రెండు రోజుల వ్యవధిలో అక్రమంగా తరలిస్తున్న 2500 కిలోల వెండిని సీజ్​ చేశారు రాజస్థాన్ పోలీసులు. ఆగ్రా నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు గుజరాత్​కు తరలిస్తున్నట్లు గుర్తించారు. వెండిని సీజ్​ చేసి దర్యాప్తు చేపట్టారు.

Silver ornaments seized: ఓ ప్రైవేటు బస్సులో అక్రమంగా తరలిస్తున్న 1200 కిలోల వెండి ఇటుకలు, ఆభరణాలను పట్టుకున్నారు పోలీసులు. వాటి విలువ సుమారు రూ.8 కోట్లకుపైగా ఉంటుందని తెలిపారు. ఈ సంఘటన రాజస్థాన్​లోని ఉదయ్​పుర్​ జిల్లాలో జరిగింది. పక్కా సమాచారంతో అహ్మదాబాద్​ నుంచి ఆగ్రా వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సును శుక్రవారం రాత్రి అడ్డుకున్న పోలీసులు.. తనిఖీలు చేయగా వెండి ఇటుకలు, ఆభరణాలు దొరికినట్లు అధికారులు తెలిపారు.

" పోలీసులు బస్సులో తనిఖీ చేయగా భారీగా వెండి కనిపించింది. దాని గురించి అడగగా బస్సు డ్రైవర్​ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. సరైన పత్రాలు చూపలేదు. అందుకే 1,222 కిలోల వెండిని సీజ్​ చేశాం. అందులో 450 కిలోల వెండి ఇటుకలు, 772 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. వెండిని అహ్మదాబాద్​ నుంచి రాష్ట్రంలోని ఉదయ్​పుర్​, జైపుర్​, యూపీలోని ఆగ్రా వంటి నగరాల్లో డెలివరీ చేసేందుకు తరలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం. "

- గోర్ధాన్​ విలాస్​, పోలీసు అధికారి.

మరో బస్సులో 1300 కిలోలు: ఉదయ్​పుర్​ సంఘటన జరిగిన మరుసటి రోజునే మరో బస్సులో 1321 కిలోల వెండిని పట్టుకున్నారు రాజస్థాన్​, డూంగర్​పుర్​లోని బిచీవాఢా పోలీసులు. ఆగ్రా నుంచి గుజరాత్​కు ఓ ప్రైవేటు ట్రావెల్స్​ బస్సులో తరలిస్తుండగా దొరికినట్లు చెప్పారు. ఆ వెండి ఎవరిది అనే విషయం ఇంకా తెలియరాలేదన్నారు.

రాజస్థాన్​-గుజరాత్​ సరిహద్దు రతన్​పుర్​లో ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీనాథ్​ ట్రావెల్స్​ బస్సును అడ్డుకుని తనిఖీలు చేశామని డీఎస్​పీ రాకేశ్​ కుమార్​ శర్మ తెలిపారు. బస్సు వెనకాల టైర్​ వద్ద ఓ క్యాబిన్​ను గుర్తించామని, దానిని తెరిచి చూడగా 70 పెట్టెల్లో భారీగా వెండి, ఆభరణాలు లభించాయన్నారు. 'ప్యాకెట్లను తెరిచి చూడగా భారీగా బంగారం, వెండి ఆభరణాలు, వెండి విగ్రహాలు సహా ఇతర వస్తువులు కనిపించాయి. మొత్తంగా.. 1321 కిలోల వెండి, 173 కిలోల 923 గ్రాముల ముత్యాలు, 210 గ్రాముల బంగారం, రూ.56వేల నగదు స్వాధీనం చేసుకున్నాం.' అని తెలిపారు. డ్రైవర్​ను ప్రశ్నించగా సరైన సమాధానం రాలేదని, ట్రావెల్స్​ ఏజెంట్​ ద్వారా వెండి ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. వెండి విలువ సుమారు రూ.10 కోట్ల వరకు ఉండొచ్చని తెలిపారు.

SILVER-SEIZED
గుజరాత్​కు తరలిస్తుండగా పట్టుకున్న వెండి

ఇదీ చూడండి: వెండి గాజులు దొంగలించిందని బాలిక హత్య.. ఇంట్లోనే పాతిపెట్టి..

Last Updated :May 9, 2022, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.