శ్రద్ధ హత్య కేసులో మరో ట్విస్ట్.. త్వరలోనే గుడ్​ న్యూస్​ అని.. అంతలోనే హత్య!

author img

By

Published : Nov 25, 2022, 5:14 PM IST

Updated : Nov 25, 2022, 6:39 PM IST

shraddha murder case

శ్రద్ధ హత్య కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా ముంబయిలో శ్రద్ధ డెంటల్ చికిత్సకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు.. శ్రద్ధ తన స్నేహితులతో త్వరలో గుడ్​ న్యూస్​ చెబుతా అనేదని విచారణలో వెల్లడైంది. హరియాణాలోని ఫరీదాబాద్​ సమీపంలో ఉన్న సురజ్​కుండ్​ అడవుల్లో ఓ సూట్​ కేస్​లో శరీర భాగాలు దొరకగా.. అవి శ్రద్ధవే అని పోలీసులు అనుమానిస్తున్నారు.

శ్రద్ధ హత్య కేసులో తవ్విన కొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. నవంబర్ 2021లో ​శ్రద్ధ 8 సార్లు టూత్​ సెట్టింగ్​ చికిత్స చేయించుకుందని పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా గురువారం ఫరీదాబాద్​ సూరజ్​కుండ్ అడవుల్లో సూట్​కేస్​లో శరీర భాగాలు లభ్యమయ్యాయి.

శ్రద్ధ హత్య కేసులో ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు.. శ్రద్ధ చికిత్స తీసుకున్న ముంబయి వసయిలోని డెంటల్​ డాక్టర్​ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. డెంటల్​ చికిత్సకు సంబంధించి ఎక్స్​రే, క్రెడిట్​ కార్డు లావాదేవీల రికార్డులను దిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్స్​రే ఇతర డాక్యుమెంట్లు ఇదివరకే దొరికిన దవడ భాగంతో సరిపోతాయే లేదో తెలుసుకోవచ్చని చెప్పారు. నవంబర్ 2021లో పలు తేదీల్లో శ్రద్ధ తన క్లినిక్​కు వచ్చినట్లు.. 8 సార్లు పళ్ల సెట్టింగ్​ చికిత్స చేయించుకున్నట్లు డాక్టర్​ ఇషాన్​ చెప్పారని పోలీసులు తెలిపారు. ఇది కీలక ఆధారంగా ఉండనుందని పేర్కొన్నారు.

మరోవైపు.. శ్రద్ధ తన స్నేహితులతో టచ్​లో ఉండేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. త్వరలోనే ఓ గుడ్​ న్యూస్​ చెబుతాను అని తన స్నేహితులతో అంటుండేదని.. అనంతరం శ్రద్ధ హత్యకు గురైందని చెప్పారు. అయితే అది ఎలాంటి గుడ్​ న్యూస్​ అనే విషయంలో ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది.
శ్రద్ధ ఫోన్​ కోసం దిల్లీ పోలీసులతో పాటు ముంబయి మణిక్​పుర్​ పోలీసులు వసయి ప్రాంతంలో ముమ్మరంగా గాలిస్తున్నారు. అందులో భాగంగా తీర ప్రాంతం భయందర్​లో పడవల సాయంతో వెతుకుతున్నారు.

సూట్​కేసులో శరీర భాగాలు.. శ్రద్ధవేనా?
హరియాణాలోని ఫరీదాబాద్​ సూరజ్​ కుండ్​ అటవీ ప్రాతంలో ఓ సూట్​కేస్​లో కొన్ని శరీర భాగాలు గురువారం లభ్యమయ్యాయి. ఎక్కడో చంపి ముక్కలు చేసి ఇక్కడ పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇవి శ్రద్ధ శరీర భాగాలనే అనుమానంతో ఫరీదాబాద్​ పోలీసులు.. దిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. ఆ శరీర భాగాలు ఓ ప్లాస్టిక్​ కవర్​లో చుట్టి ఉన్నాయని.. అక్కడే దుస్తులు, ఓ బెల్ట్​ కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

సమాచారం అందుకున్న దిల్లీ పోలీసుల బృందం.. ఫరీదాబాద్​ వెళ్లి దర్యాప్తు చేపట్టింది. అక్కడ లభించిన శరీర భాగాలకు.. శ్రద్ధ కేసుతో సంబంధం ఉందని దిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అక్కడ దొరికిన శరీర భాగాలు మహిళవో, పురుషుడివో అనేది తెలియడం లేదని పేర్కొన్నారు. దీంతో వాటికి పరీక్షలు చేయించాలని.. ఆ నివేదిక వస్తే అన్ని విషయాలపై క్లారిటీ వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఫరీదాబాద్​ పోలీసులు ఆ శరీర భాగాలను భద్రపరుస్తామని చెప్పారని.. దీంతో డీఎన్ఏ పరీక్షలు కూడా నిర్వహించవచ్చని దిల్లీ పోలీసులు వెల్లడించారు.

పక్కా ప్లానింగ్​..
అఫ్తాబ్​ పక్కా ప్రణాళికతోనే హత్య చేశాడని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో పోలీసులకు ఎలాంటి ఆధారాలు .. ​ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఆధారాలు దొరకకుండా జాగ్రత్తపడ్డాడని చెప్పారు. అందుకే హత్య చేసే క్రమంలో.. శ్రద్ధ శరీర భాగాలను పడేసే క్రమంలో ఫోన్​ వాడలేదని పేర్కొన్నారు.

35 ముక్కలు కోసి..
దేశ రాజధాని దిల్లీలో ముంబయికి చెందిన శ్రద్ధ వాకర్​ అనే 27 ఏళ్ల యువతిని.. తనతో లివ్ ఇన్ రిలేషన్​ షిప్​లో ఉన్న అఫ్తాబ్​ అమిన్​ పూనావాలా అనే యువకుడు కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి.. అటవీ ప్రాంతంలో పడేశాడు.

ఇవీ చదవండి: 'నేను వీడియోకాల్​ లైవ్​లో చూస్తా.. నీ భార్యను కొట్టు​'.. ప్రియురాలి పైశాచికత్వం!

బిట్‌కాయిన్​ వల్ల భారీగా అప్పులు.. కూతుర్ని చంపి సూసైడ్​ యత్నం.. కిడ్నాప్​ డ్రామాతో జైలుపాలు

Last Updated :Nov 25, 2022, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.