రాష్ట్రపతి రేసుకు 'పవార్'​ దూరం.. పట్టుబడుతున్న విపక్షాలు.. అయినా!

author img

By

Published : Jun 14, 2022, 1:55 PM IST

Updated : Jun 14, 2022, 3:00 PM IST

Sharad Pawar not in Presidential race: NCP

Sharad Pawar Presidential Polls: రాష్ట్రపతి రేసుకు దూరంగా ఉండాలని ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండబోనని స్వయంగా పవారే చెప్పినట్లు పేర్కొన్నాయి. మరోవైపు.. పవార్​తో భేటీ అయ్యారు వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి. రాజా.

Sharad Pawar Presidential Polls: రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి కోసం ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతోన్న వేళ.. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి రేసుకు దూరంగా ఉండాలని పవార్‌ నిర్ణయించుకున్నట్లు ఎన్సీపీ వర్గాలు వెల్లడించాయి.
సోమవారం రాత్రి ముంబయిలో ఎన్సీపీ పార్టీ సమావేశం జరిగింది. ఈ భేటీలో పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడిన పవార్‌.. ''నేను రాష్ట్రపతి రేసులో లేను. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండబోను'' అని చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలు తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టుకోవడంలో సఫలమవుతాయన్న దానిపై శరద్‌ పవార్‌ నమ్మకంగా లేరట. అందుకే ఓడిపోయే పోరులో బరిలోకి దిగేందుకు ఆయన సుముఖంగా లేరని సదరు వర్గాలు పేర్కొన్నాయి. అయితే తన అభిప్రాయాన్ని పవార్‌ ఇంకా విపక్ష పార్టీలకు చెప్పలేదని తెలుస్తోంది.

పవార్​ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నట్లు కనిపించట్లేదని అన్నారు ఎన్సీపీ సీనియర్​ నేతలు. పవార్​ ప్రజల మనిషి అని.. వారిని వదిలి రాష్ట్రపతి భవన్​కు మాత్రమే పరిమితమవడం ఆయనకు ఇష్టం ఉండదని పేర్కొన్నారు. పవార్​ రాష్ట్రపతి రేసుకు దూరంగా ఉంటారన్న వార్తల నేపథ్యంలో వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి. రాజా.. దిల్లీ జన్​పథ్​లోని శరద్​ పవార్​ నివాసానికి వెళ్లారు. రాష్ట్రపతి అభ్యర్థిగా పవార్​ పేరు చర్చ జరుగుతుండటం, దానిపై ఆయనే స్వయంగా స్పందించిన నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

రాష్ట్రపతి ఎన్నికకు సమయం దగ్గరపడుతోన్న వేళ.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని ఎంచుకునేందుకు కాంగ్రెస్‌ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్‌ పవార్‌ను సూచిస్తూ ఇప్పటికే ఇతర పార్టీలకు ప్రతిపాదనలు కూడా చేసింది. గత గురువారం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే.. ఈ విషయమై పవార్‌తో భేటీ అయి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అటు ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్‌ కూడా ఎన్సీపీ చీఫ్‌ను కలిశారు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నిక కోసం విపక్షాలను ఏకం చేసేందుకు తృణమూల్ కాంగ్రెస్‌ అధినేత్రి, బంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా రంగంలోకి దిగారు. జూన్‌ 15న దిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో పాల్గొనాలంటూ సోనియా గాంధీ సహా ప్రతిపక్ష పార్టీల సీఎంలు, ఇతర నేతలకు లేఖలు రాసి ఆహ్వానించారు. ఈ సమావేశం నిమిత్తం దీదీ నేడు దిల్లీకి రానున్నారు. శరద్‌ పవార్‌ కూడా ఈ భేటీలో పాల్గొనున్నారు.

ఎన్నిక ఇలా: జులై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులు ప్రథమ పౌరుడిని ఎన్నుకుంటారు. ఇందులో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభ్యులు, దిల్లీ, పుదుచ్చేరి ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. ప్రస్తతమున్న ఎలక్టోరల్‌ కాలేజీ మొత్తం ఓట్ల విలువ 10,86,431. ఇందులో సగానికి పైగా సాధించిన అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నికవుతారు. అయితే ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి మెజార్టీ మార్క్‌ కంటే 13వేల ఓట్ల విలువ తక్కువగా ఉంది. అయితే బిజు జనతా దళ్‌ సహా మరికొన్ని పార్టీలు భాజపాకు మద్దతిచ్చే అవకాశాలున్నాయి. దీంతో అధికార పార్టీ అభ్యర్థియే తదుపరి రాష్ట్రపతిగా ఎన్నికవడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. కాగా.. రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనేది ఎన్డీఏ ఇంకా ప్రకటించలేదు. ఈ రేసులో ద్రౌపది ముర్ము, తమిళిసై సౌందరరాజన్‌ వంటి పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.

ఇవీ చూడండి: రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం? రంగంలోకి రాజ్​నాథ్​, నడ్డా!

రాష్ట్రపతి ఎన్నికల బరిలో లాలూ ప్రసాద్ యాదవ్.. పక్కా ప్లాన్​తో..

Last Updated :Jun 14, 2022, 3:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.