వాయుసేనలో కొత్త శకం.. పోరాట విభాగానికి మహిళ నాయకత్వం.. ధామీ ఘనత

author img

By

Published : Mar 8, 2023, 6:58 AM IST

Shaliza Dhami

వాయుసేన పోరాట విభాగానికి తొలిసారి ఓ మహిళ నాయకత్వం వహించబోతున్నారు. క్షిపణుల స్క్వాడ్రన్​కు ఆ మహిళ నేతృత్వం వహించనున్నారు. గ్రూపు కెప్టెన్ శాలిజా ధామీ ఈ ఘనత దక్కించుకోనున్నారు.

భారత వాయు సేన (ఐఏఎఫ్​)లో సరికొత్త శకం మొదలుకాబోతోంది. ఐఏఎఫ్​కు చెందిన పోరాట విభాగానికి చరిత్రలో తొలిసారి ఓ మహిళ నాయకత్వం వహించే అవకాశం దక్కించుకోనున్నారు. గ్రూపు కెప్టెన్‌ శాలిజా ధామీకి ఈ ఘనత లభించనుంది. ఏకంగా క్షిపణుల స్క్వాడ్రన్​కు ఆమె నేతృత్వం వహించనున్నారు. పశ్చిమ ప్రాంతంలోని ఆ స్క్వాడ్రన్​ను ఆమె నడిపించనున్నారు.

ఎయిర్​ఫోర్స్​లో ఇప్పటి వరకు ఓ మహిళ ఈ తరహా బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి అని వాయుసేన వెల్లడించింది. 2003లో హెలికాప్టర్‌ పైలట్‌గా ఐఏఎఫ్‌లోకి ధామీ అడుగుపెట్టారు. 2,800 గంటలు హెలికాప్టర్లు నడిపిన అనుభవం ఆమెకు ఉంది. పశ్చిమ సెక్టార్లోని హెలికాప్టర్‌ విభాగానికి ఫ్లైట్‌ కమాండర్‌గా ధామీ సేవలందించారు. కమాండ్ హెడ్ క్వాటర్స్​ విభాగమైన ఆపరేషన్స్ బ్రాంచ్​లో ప్రస్తుతం ధామీ సేవలు అందిస్తున్నారు.

శాలిజా ధామీ

సియాచిన్​లో తొలి మహిళ..
ఇటీవలే తొలిసారి ఓ మహిళను సియాచిన్​లో నియమించారు. ఎముకలు కొరికే చలిలో సేవలు అందించేందుకు ఫైర్ అండ్ ఫ్యూరీ కోర్​కు చెందిన కెప్టెన్ శివ చౌహాన్​ను భారత సైన్యం జనవరిలో నియమించింది. తద్వారా సియాచిన్​లో నియమితురాలైన తొలి మహిళగా శివ చౌహాన్ రికార్డుకెక్కారు. ఈ నియామకం జరిగిన రెండు నెలల తర్వాత మరో మహిళ.. త్రివిధ దళాల్లో కీలక హోదా దక్కించుకోవడం విశేషం. ఇది వాయుసేన చరిత్రలో మైలురాయి వంటిదని నిపుణులు చెబుతున్నారు.

ఆలివ్‌ గ్రీన్‌ మా రక్తంలోనే ఉంది: మేజర్‌ భావన
సైనిక దుస్తులు, వాహనాలను సూచించే ఆలివ్ రంగు.. తమ రక్తంలోనే ఉందని సైన్యంలో పనిచేస్తున్న మేజర్ భావనా శ్యాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తూర్పు లద్దాఖ్​లో సిగ్నల్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 'మా ఇంట్లో మొత్తం సైన్యంలోని వాతావరణం ఉంటుంది. ఇంట్లో మూడు తరాలు సైన్యం సేవల్లో ఉన్నాయి. నేను కూడా సైన్యంలోనే ఉండాలని చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని.' అని తన ఓ వార్తా సంస్థ ముఖాముఖిలో చెప్పారు.

కోర్‌ ఆఫ్‌ సిగ్నల్స్‌ విభాగంలో 2012లో చేరారు భావనా శ్యాల్. 2021 నుంచి తూర్పు లద్దాఖ్‌లో సేవలు అందిస్తున్నారు. అక్కడ కీలకమైన కమ్యూనికేషన్‌ విధుల్లో ఉన్నారు. మంచుదుప్పటి కప్పుకొని ఉండే సియాచిన్‌లోని అతి శీతల వాతావరణం విధి నిర్వహణకు పెద్ద సవాల్ అని చెబుతున్నారు. అయినప్పటికీ.. అలాంటి కఠిన పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొని నిలబడాలో సైన్యం నేర్పిస్తుందని భావనా శ్యాల్ వెల్లడించారు. భావన పంజాబ్‌కు చెందినవారు. ఆమె తండ్రి, తాత కూడా సైన్యంలో పనిచేశారు.

1,848 కి.మీ. ర్యాలీ చేయనున్న సీఆర్పీఎఫ్‌ మహిళా బైకర్లు
మరోవైపు, కేంద్ర రిజర్వ్ పోలీసు దళానికి చెందిన మహిళా బైకర్లు 1,848 కిలోమీటర్ల బైక్ ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. దిల్లీ నుంచి ఛత్తీస్​గఢ్​కు వీరు ద్విచక్రవాహనాలపై ప్రయాణించనున్నారు. మొత్తం 75 మంది మహిళలు ఈ బైక్ ర్యాలీలో పాల్గొననున్నారు. మహిళా సాధికారతను చాటి చెప్పేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 9న దిల్లీలోని ఇండియాగేట్ వద్ద నుంచి ఈ బైక్ ర్యాలీ ప్రారంభం కానుంది. ఇదే నెలలో 25వ తేదీన ఛత్తీస్​గఢ్​లోని జగదల్​పుర్​లో ముగియనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.