కొడుకు పెళ్లిలో తండ్రి దారుణం.. భార్య సహా నలుగురిపై కత్తితో దాడి.. ఇద్దరు మృతి

author img

By

Published : May 16, 2023, 10:49 AM IST

Updated : May 16, 2023, 12:18 PM IST

man murdered three members in chhattisgarh

భార్యను కొడుతుండగా అడ్డొచ్చారని ఇద్దరు సోదరులను హతమార్చాడు ఓ వ్యక్తి. కొడుకు పెళ్లి మండపంలోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఘటనలో నిందితుడితో పాటు మరో సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. ఛత్తీస్​గఢ్​లో ఈ దారుణం జరిగింది.

ఓ పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. భార్యను కొడుతుండగా అడ్డొచ్చినందుకు తన ఇద్దరు సోదరులను హతమార్చాడు ఓ వ్యక్తి. వివాహ మండపంలోనే వారిని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఘటనలో నిందితుడి భార్య, ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం నిందితుడు ఘటన స్థలంలోనే మంచంపై పడుకున్నాడు. ఈ దారుణ ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కబీర్​ధామ్ జిల్లాలోని కవర్ధ పరిధిలోని బంగౌరా గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడి పేరు తిన్హా బైగా. అతడి కొడుకు వివాహం రెండు రోజుల క్రితం జరిగింది. సోమవారం కుటుంబసభ్యులు, బంధువులు పెళ్లి మండపంలో ఆనందంగా నృత్యాలు చేస్తున్నారు. అదే సమయంలో భార్యపై అనుమానంతో.. తిన్హా బైగా ఆమెపై దాడి చేశాడు. ఇది గమనించిన నిందితుడి సోదరులు, బావమరుదులు ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో వారిపై తిన్హా బైగా కత్తితో దాడి చేశాడు. ఘటనలో నిందితుడి ఇద్దరు సోదరులు అక్కడికక్కడే మృతి చెందగా.. నిందితుడి భార్య, ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు.

ఘటన అనంతరం నిందితుడు అదే ప్రాంతంలోనే మంచంపై హాయిగా నిద్రపోయాడని స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించనట్లు వారు వెల్లడించారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి దాడికి పాల్పడ్డ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని.. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని వారు వెల్లడించారు.

స్నేహితున్ని దారుణంగా హత్య చేసిన ముగ్గురు మైనర్లు..
12 ఏళ్ల మిత్రుడిని మరో ముగ్గురు బాలురు అతి దారుణంగా హత్య చేశారు. ముందుగా సైకిల్​ చైన్​తో అతడి గొంతు నులిమి.. ఓ రాయితో తలపై బలంగా బాదారు. ఆ తరువాత.. పదునైన కత్తితో అతని గొంతు కోశారు. ఆ వెంటనే మృతదేహాన్ని పాలిథిన్​ కవర్​లో చుట్టి పడేసి పారిపోయారు. ఈ దారుణం మధ్యప్రదేశ్​లో జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు సోమవారం వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సివాని జిల్లాలోని బర్ఘాట్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఘటన జరిగింది. మగర్కథ గ్రామంలో ఇంటి సమీపంలో..​ రక్త మరకలున్న బ్యాగ్​ను ఓ మహిళ గుర్తించింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

నిందితులను 16, 14, 11 ఏళ్ల వయస్సున్న వారిగా పోలీసులు గుర్తించారు. వారిలో ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉన్నారని తెలిపారు. నిందితులు చాలా పక్కాగా హత్యకు ప్రణాళిక రచించినట్లు వారు వెల్లడించారు. ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకుని స్థానిక కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం వారిని 14 రోజుల పాటు జువైనల్​ జైలులో ఉంచనున్నట్లు వెల్లడించారు.

"పథకం ప్రకారం బాధితుడ్ని వారు అనుకున్న ప్రాంతానికి నిందితులు రప్పించారు. అనంతరం అతడ్ని పట్టుకుని సైకిల్ చైన్​తో గొంతు నులిమారు. అనంతరం అతని తలను ఓ పెద్ద రాయితో బలంగా బాదారు నిందితులు. ఆ తరువాత ఓ కత్తితో.. బాలుడు గొంతుకోసి చంపేశారు." అని పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని వారు పేర్కొన్నారు.

Last Updated :May 16, 2023, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.