మళ్లీ రైతుల పోరుబాట.. డిమాండ్ల సాధనకు దేశవ్యాప్తంగా ర్యాలీలు

author img

By

Published : Nov 17, 2022, 3:07 PM IST

Updated : Nov 17, 2022, 4:00 PM IST

samyukta-kisan-morcha

రైతులకు ఇచ్చిన హామీల విషయంలో కేంద్రం మాట తప్పిందని రైతు సంఘం ఆరోపించింది. పెండింగ్​లో ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్​తో సంయుక్త కిసాన్​ మోర్చా దేశవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టేందుకు సిద్ధమైంది.

రైతులకు ఇచ్చిన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని సంయుక్త కిసాన్​ మోర్చా(ఎస్​కేఎం) ఆరోపించింది. ఇందుకు నిరసనగా దేశవ్యాప్తంగా ర్యాలీలు చేపడతున్నట్లు గురువారం ప్రకటించింది. నవంబర్​ 26న దేశంలో ఉన్న అన్ని రాజ్‌భవన్‌లకు ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఎస్​కేఎం గురువారం వెల్లడించింది. రైతుల డిమాండ్​లను నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని రైతు సంఘం ఆరోపించింది.

డిసెంబర్​ 1 నుంచి 11 వరకు దేశంలోని అన్ని పార్టీల లోక్​సభ, రాజ్యసభ సభ్యుల కార్యాలయాలకు ర్యాలీగా వెళ్లనున్నట్లు ఎస్​కేఎం నేత దర్శన్​ పాల్​ తెలిపారు. వ్యవసాయ చట్టాల రద్దుకై పోరాడిన రైతు సంఘాలన్నీ కలిసి డిసెంబర్​ 8న కర్నాల్​లో.. తరవాత దశ ఉద్యమం కొరకు సమావేశం కానున్నట్లు తెలిపారు. గత సంవత్సరం దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన రోజైన నవంబర్​ 19వ తేదీన 'ఫతే దివస్' లేదా 'విజయ్​ దివస్​'​గా రైతులు జరుపుకుంటారని సంయుక్త కిసాన్​ మోర్చా వెల్లడించింది.

వ్యవసాయ చట్టాల రద్దు తరువాత డిసెంబర్​ 9న నిరసనలు ముగించినప్పుడు రైతులకు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను కేంద్రం పూర్తిగా విస్మరించిందని ఎస్​కేఎం ఆరోపించింది. కనీస మద్దతు ధరపై కమిటీ వేయలేదని, ఆందోళన సందర్భంగా రైతులపై పెట్టిన 'తప్పుడు కేసుల'ను ఉపసంహరించుకోలేదని రైతు సంఘం పేర్కొంది. కనీస మద్దతు ధర అనేది చట్టపరమైన హామీ అని రైతు సంఘం తెలిపింది. రైతుల డిమాండ్‌లను పరిగణనలోకి తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆరోపించింది.

Last Updated :Nov 17, 2022, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.