రాజీవ్​ హత్య కేసు దోషులు విడుదల.. వారంతా హ్యాపీ.. కాంగ్రెస్​ ఫైర్

author img

By

Published : Nov 11, 2022, 1:43 PM IST

Updated : Nov 11, 2022, 6:18 PM IST

rajiv gandhi assassination victims

Rajiv Gandhi Assassination : మాజీ ప్రధానమంత్రి రాజీవ్​ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషులను విడుదల చేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసేందుకు సుముఖత చూపడం, సోనియాగాంధీ కుటుంబం కూడా సానుకూలత చూపడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.

Rajiv Gandhi Assassination : మాజీ ప్రధానమంత్రి రాజీవ్​ గాంధీ హత్య కేసు విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలవరించింది. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషులను విడుదల చేయాలని ఆదేశించింది. తమిళనాడు ప్రభుత్వం దోషులను విడుదల చేసేందుకు సుముఖత చూపడం, సోనియాగాంధీ కుటుంబం కూడా సానుకూలత చూపడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్​ బీఆర్​ గవాయ్​, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. తమిళనాడులోని జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులను విడుదల చేయాలని ఆదేశించింది.

తమను విడుదల చేయాలంటూ పలుమార్లు దోషులు నళిని శ్రీహరన్​, రాబర్ట్ పయాస్, రవిచంద్రన్, రాజా, శ్రీహరన్, జయకుమార్ న్యాయస్థానాలను ఆశ్రయించారు. మద్రాస్ హైకోర్టు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం సహా అందరి అభిప్రాయాల తర్వాత దోషులను విడుదల చేయాలని కీలక తీర్పు ఇచ్చింది. ఇదే కేసులో దోషిగా ఉన్న పెరారివాలన్​ను విడుదల చేస్తూ జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలనే మిగిలిన ఆరుగురికి వర్తించేలా తీర్పు ఇచ్చింది.

తీర్పును స్వాగతిస్తున్నా..
రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషులను విడుదల చేయాలన్న సుప్రీం తీర్పును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వాగతించారు. ప్రజాతీర్పుతో ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలను.. నియమిత స్థానాల్లో ఉన్న గవర్నర్లు రద్దు చేయకూడదనడానికి ఈ తీర్పు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.

రాజకీయ కారణాలతోనే ఆలస్యం..
మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ హత్య కేసులో దోషులుగా ఉన్న ఆరుగురిని విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై.. దోషుల్లో ఒకరైన నళిని శ్రీహరన్​ తరఫు న్యాయవాది పి పుగళేంది స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు.. సంతోషించదగ్గ విషయమని అన్నారు. 2018లోనే తమిళనాడు కేబినెట్ ఏడుగురు దోషులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ.. రాజకీయ కారణాలతో వారి విడుదలను కేంద్రం అడ్డుకుందని వ్యాఖ్యానించారు.

సత్యం గెలిచింది..
రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రీంకోర్టు తీర్పుపై.. దోషుల్లో ఒకరైన నళిని శ్రీహరన్ తల్లి పద్మ హర్షం వ్యక్తంచేశారు. 'సంతోషాన్ని మాటల్లో వర్ణించలేం. మా కుటుంబం మూడు దశాబ్దాలుగా పడుతున్న బాధ ఈ రోజుతో తీరింది. సత్యం గెలిచింది. న్యాయవ్యవస్థపై మా కుటుంబానికి ఉన్న విశ్వాసం ఈ తీర్పుతో అనేక రెట్లు పెరిగింది.' అని ఆమె అన్నారు.

కాంగ్రెస్ అభ్యంతరం.. సోనియాతో ఏకీభవించం!
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై కాంగ్రెస్ స్పందించింది. ఈ నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఈ తీర్పును కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత జైరాం రమేశ్ తప్పుబట్టారు. సుప్రీంకోర్టు.. దేశ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించకపోవడం దురదృష్టకరం అని ఆయన పేర్కొన్నారు.

"ఈ కేసులో కేంద్రం అభిప్రాయంతోనే మేం ఏకీభవిస్తాం. సోనియా గాంధీ ఉన్నతస్థాయి వ్యక్తి. ఆమె అభిప్రాయాలు ఆమెకు ఉంటాయి. ఆమెపై మాకు గొప్ప గౌరవం ఉంది. కానీ పార్టీ ఈ విషయంలో ఆమెతో ఏకీభవించదు. ఈ విషయంలో స్థిరంగా ఉన్నాం. ఇది సంస్థాగతపరమైంది. ఈ కేసు ఒక మాజీ ప్రధాని హత్య కేసుతో ముడిపడి ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం(ప్రస్తుత, గత ప్రభుత్వాలు) దోషుల విడుదలకు ఎన్నడూ అంగీకరించలేదు" అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మనూ సింఘ్వీ తెలిపారు.

1991 మే 21 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో రాజీవ్‌గాంధీని హత్య చేశారు. ఈ కేసులో 1999 మేలో పెరారివాలన్‌, మురుగన్, శాంతమ్, నళినికి మరణశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. కేంద్రం క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో 11 ఏళ్ల జాప్యం కారణంగా సంతన్, మురుగన్, పెరారివాలన్‌ మరణశిక్షను సర్వోన్నత న్యాయస్థానం జీవిత ఖైదుగా మార్చింది.

ఇవీ చదవండి: మధురానుభూతి మిగిల్చే ఎయిర్​పోర్ట్​ గార్డెన్​ను మీరూ ఓసారి చూడండి

మంచు కొండల్లో మోదీనే బ్రహ్మాస్త్రం.. భారమంతా ఆయనపైనే..!

Last Updated :Nov 11, 2022, 6:18 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.