పెళ్లిలకు బ్యాండ్​ వాయించనున్న పోలీసులు.. గంటకు రూ.5000.. సామాన్యులకు అవకాశం

author img

By

Published : Mar 14, 2023, 1:52 PM IST

punjab police band now showing for wedding

ఇప్పటివరకు కేవలం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లోనే వినిపించే పోలీస్​ బ్యాండ్​ను.. ఇక నుంచి సామాన్యుల జరుపుకొనే శుభకార్యాల్లో కూడా వినే అవకాశాన్ని కల్పించింది పంజాబ్​ పోలీసు శాఖ. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శ్రీ ముక్త్సార్ సాహిబ్ జిల్లా పోలీస్ అధికారి విడుదల చేశారు.

సాధారణంగా పెళ్లిళ్లలో అనేక రకాల బ్యాండ్​లను విని ఉంటాము. వాటిల్లో తీన్మార్​, మర్ఫా, బజంత్రీలు, పియానో, మహారాష్ట్ర బ్యాండ్​, కేరళ బ్యాండ్​ అని ఇలా వివిధ రకాల వాయిద్యాలు పెళ్లి క్రతువుకు మరింత జోష్​ను తెస్తాయి. అంతేగాక ఒక్కోసారి మిలటరీ బ్యాండ్​ మేళాన్ని కూడా వింటూ ఉంటాము. కానీ పంజాబ్​ పోలీస్ అధికారులు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. తమ శాఖకు మాత్రమే పరిమితమైన బ్యాండ్​ను ఇకపై అందరి వివాహ వేడుకలతో పాటు ఇతర శుభకార్యాల్లో కూడా వాయించుకునే అవకాశాన్ని కల్పించింది శ్రీ ముక్త్సార్​ సాహిబ్​ జిల్లా పోలీస్​ శాఖ. దీంతో పంజాబ్​ ప్రజలు ఇక నుంచి తమ వ్యక్తిగత కార్యక్రమాల్లో కూడా పంజాబ్​ పోలీస్​ బ్యాండ్​ను చేర్చుకొని తమ వేడుకలను ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్వహించుకోవచ్చు. ఇందుకోసం ముందుగానే బుకింగ్స్​ చేసుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా ప్రజల శుభకార్యాల్లో స్వయంగా పోలీసులే బ్యాండ్​ వాయిద్యాలను వాయిస్తారని చెప్పింది.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలను శ్రీ ముక్త్సార్​ సాహిబ్​ జిల్లా ఎస్​ఎస్​పీ హర్మన్‌దీప్ సింగ్ గిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సర్క్యులర్​లో ప్రజలు తమ వివాహాలతో పాటు ఇతర శుభకార్యాలకి కూడా పంజాబ్​ పోలీస్​ శాఖ బ్యాండ్​ను బుక్​ చేసుకోవచ్చని వివరించింది. ఈ బ్యాండ్​ను ముందుగా ఎలా బుక్​ చేసుకోవాలి..? ఎంత రుసుమును చెల్లించాలనే వివరాలను కూడా ఇందులో క్లుప్తంగా వివరించారు ఎస్​ఎస్​పీ. కాగా, ఈ పంజాబ్​ పోలీసుల అధికారిక​ బ్యాండ్​లో సినిమా పాటల ట్యూన్​లను కూడా వాయిస్తారు పోలీసులు.

Punjab Police Band
పంజాబ్​ పోలీస్​ బ్యాండ్​

సాధారణంగా రాష్ట్ర పోలీస్​ శాఖల బ్యాండ్​ చప్పుడును కేవలం గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవాన లేదంటే ఇతర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాల్లో మాత్రమే వింటూంటాము. వీటి చప్పుడు ఏ ఇతర ప్రైవేటు ప్రోగ్రామ్​లలోనూ వినే అవకాశమే ఉండదు. కానీ, పంజాబ్​ పోలీస్​ శాఖ మాత్రం అందరికి ఉపయోగపడేలా ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నిర్ణయంతో సామాన్య ప్రజల దగ్గర్నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరూ పంజాబ్​ పోలీస్​ బగల్(బ్యాండ్​)ను వ్యక్తిగత కార్యక్రమాల్లో కూడా వాయించుకోవ్చచు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవచ్చని సూచించింది పోలీస్​ శాఖ. అయితే ఈ నిర్ణయం ఆ రాష్ట్ర పోలీస్​ శాఖ ఖజానాకు ఆదాయ వనరుగా మారనుంది.

గంటకు రూ.5000..
ఇక పంజాబ్​ పోలీస్​ బ్యాండ్​ను ఒక గంట సమయం కోసం బుకింగ్ చేసుకుంటే రూ.5000 రుసుము చెల్లించాలి. అయితే బ్యాండ్​ను బుకింగ్​ చేసుకున్న నిర్ణీత వ్యవధి దాటితే మాత్రం.. గంటకు ప్రభుత్వ ఉద్యోగులకు రూ.2,500, సామాన్యులకు రూ.3,500 చొప్పున అదనంగా సొమ్ము చెల్లించాల్సి వస్తుంది. దీంతోపాటు ఫ్యామిలీ ఫంక్షన్స్​ కోసం సైనిక బ్యాండ్​ను​ బుక్​ చేసుకోవాలంటే రూ.7,000 ఫీజును చెల్లించాలి.ఇకపోతే వీటికి అదనంగా రాకపోకల ఖర్చులు కూడా వసూలు చేయనున్నారు జిల్లా అధికారులు. ఇందుకోసం ఒక్క కిలోమీటర్​కు రూ.80 చొప్పున ప్రయాణ ఛార్జీల చెల్లించాల్సి ఉంటుంది. ఈ బ్యాండ్​ బుకింగ్​ కోసం పోలీస్​ కంట్రోల్​ రూమ్​తో పాటు ప్రత్యేకంగా హెల్ప్​లైన్​ నంబరు (8054942100)ను కూడా ఏర్పాటు చేశారు పోలీసులు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.