ఫ్లైట్​లో మంటలు.. గాల్లో 185 ప్రాణాలు.. 'సూపర్​ ఉమన్' మోనిక చాకచక్యంగా...

author img

By

Published : Jun 20, 2022, 2:34 PM IST

pilot Monica Khanna

గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే విమానాన్ని పక్షి ఢీకొని ఓ ఇంజిన్​లో మంటలు చెలరేగాయి. 185 మంది ప్రణాలు గాల్లో కలిసిపోతాయనే భయం మొదలైంది. కానీ.. పైలట్​ ఎంతో ప్రశాంతంగా, చాకచక్యంతో ఒకే ఇంజిన్​తో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్​ చేశారు. ప్రయాణికుల ప్రాణాలు కాపాడి సూపర్​ఉమన్​గా ప్రశంసలు అందుకుంటున్నారు. ఆమెనే స్పైస్​జెట్​ పైలట్​ మోనికా ఖన్నా.

గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే విమానంలో మంటలు చెలరేగాయి. 185 మంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేవుడిని తలుచుకున్నారు. క్షేమంగా దిగితే చాలని అంతా అనుకుంటున్నారు. అలాంటి సమయంలో చాకచక్యంగా వ్యవహరించి.. ఒకే ఇంజిన్​తో విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్​ చేశారు పైలట్​ మోనికా ఖన్నా. 185 మంది ప్రాణాలను కాపాడిన ఆమెపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

SpiceJet
ప్రమాదం అనంతరం స్పైస్​జెట్​ విమానం

బిహార్​లోని పట్నా నుంచి దిల్లీకి ఆదివారం మధ్యాహ్నం బయలుదేరిన స్పైస్​ జెట్​ విమానం బోయింగ్​ 737 గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఓ పక్షి ఢీకొట్టటం వల్ల ఒక ఇంజిన్​లో మంటలు చెలరేగాయి. దీంతో తిరిగి పట్నాలోనే అత్యవసరంగా ల్యాండింగ్​ చేశారు పైలట్లు. త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించారు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు తమ పైలట్లపై ప్రశంసలు కురిపించారు స్పైస్​జెట్​ చీఫ్​ ఆఫ్​ ఫ్లైట్​ ఆపరేషన్స్​, హెడ్​ ఆఫ్​ పైలట్స్​ గురుచరణ్​ అరోడా. తమ పైలట్లు చేసిన పనికి గర్వంగా ఉందని, వారు నిపుణులైనందున వారిపై ప్రయాణికులు నమ్మకంగా ఉండాలని కోరారు.

"స్పైస్​జెట్​ పైలట్లు అందరిపైనా నమ్మకం ఉంచాలని ప్రయాణికులను కోరుతున్నా. విమానం నడపటంలో వారికి ఎంతో నైపుణ్యం ఉంది. పట్నాలో జరిగిన సంఘటనలో స్పైస్​జెట్​ పైలట్లు వ్యవహరించిన తీరు మాకు ఎంతో గర్వకారణం. ఎలాంటి పరిస్థితులనైనా ఎంతో ఓపికగా ఎందుర్కోగల సామర్థ్యం మా పైలట్లకు ఉంది. వారిపట్ల ప్రయాణికులంతా గర్వపడాలి. "

- కెప్టెన్​ గురుచరణ్​ అరోడా

మోనికా ఖన్నాపై స్పైస్​జెట్​ ప్రశంసలు.. విమానంలో మంటలు చెలరేగి.. క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఒకే ఇంజిన్​తో సురక్షితంగా ల్యాండ్​ చేసిన పైలట్​ మోనికా ఖన్నా, ఫస్ట్​ ఆఫీసర్​ బల్​ప్రీత్​ సింగ్​ భాటియాపై స్పైస్​ జెట్​ ప్రశంసలు కురిపించింది. 'ప్రమాదం జరిగిన సమయంలో కెప్టెన్​ మోనికా ఖన్నా, ఫస్ట్​ ఆఫీసర్​ బల్​ప్రీస్​ సింగ్​ భాటియా ఆందోళన చెందకుండా.. చాకచక్యంగా వ్యవహరించి పరిస్థితి చక్కదిద్దారు. వారు ఎంతో ప్రశాంతంగా ఉండి విమానాన్ని నియంత్రించారు. వారి నైపుణ్యంతో ఒకే ఇంజిన్​ పని చేస్తున్నప్పటికీ విమానం సురక్షితంగా దిగింది. ప్రమాదం తర్వాత ఇంజినీర్లు విమానాన్ని పరిశీలించారు. పక్షి ఢీకొట్టటం వల్ల ఫ్యాన్​ బ్లేడ్​ విరిగిపోవటం, ఇంజిన్​ పాడైపోయినట్లు ధ్రువీకరించారు. దీనిపై డీజీసీఏ విచారణ చేపట్టింది. వారు ఎంతో అనుభవం ఉన్న పైలట్లు. వారి పట్ల మాకు ఎంతో గర్వంగా ఉంది.' అని పేర్కొన్నారు కెప్టెన్​ అరోడా.

pilot Monica Khanna
కెప్టెన్​ మోనికా ఖన్నా

డీజీసీఏ సహా స్పైస్​జెట్​ అంతర్గతంగా చేపట్టిన విచారణలో పాల్గొన్నారు ఇద్దరు పైలట్లు. మరోవైపు.. కంపెనీ నిబంధనల ప్రకారం కొన్ని రోజుల పాటు వారిని విధుల్లోకి పంపించరు. స్పైస్​జెట్​కు సంబంధించి ఇలాంటి ఘటనే ఆదివారం మరొకటి జరగటం గమనార్హం. దిల్లీ నుంచి బయలుదేరిన స్పైస్​జెట్​ విమానం బంబార్డియర్​ క్యూ400 డాష్​ 8లో ప్రయాణికులు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. క్యాబిన్​లో ఒత్తిడి పెరిగినట్లు గుర్తించిన పైలట్లు.. తిరిగి విమానాన్ని సురక్షితంగా దిల్లీలో ల్యాండ్​ చేశారు.

ఇదీ చూడండి: పక్షి దెబ్బకు విమానంలో మంటలు​.. టేకాఫ్​ అయిన వెంటనే ప్రమాదం.. లక్కీగా...

భర్త విలేజ్ సెక్రటరీ.. 'సర్పంచ్'గిరీ కోసం ముగ్గురు భార్యల రాజకీయం.. చివరకు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.