కశ్మీర్​ పండిట్​ హత్యపై నిరసనలు- 'మూకుమ్మడి రాజీనామా' వార్నింగ్!

author img

By

Published : May 13, 2022, 12:02 PM IST

Updated : May 13, 2022, 1:39 PM IST

Protest in Budgam against killing of kshmiri Pandit

Kashmir pandit killed: కశ్మీర్​ పండిట్​ అయిన ఓ ప్రభుత్వ ఉద్యోగి హత్యపై జమ్ముకశ్మీర్​లో నిరసనలు వెల్లువెత్తాయి. రాహుల్ భట్​ హత్యపై ఆందోళనకు దిగారు కశ్మీర్​ పండిట్ వర్గం​ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు.

కశ్మీర్​ పండిట్​ మృతిపై జమ్ముకశ్మీర్​లో ఆందోళనలు

Kashmir pandit killed: జమ్ముకశ్మీర్​, బుద్గాం జిల్లా చదూరా తహసీల్​ కార్యాలయం ఉద్యోగి రాహుల్​ భట్​ను.. గురువారం ఆఫీస్​లోనే కాల్చి చంపారు ఉగ్రవాదులు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పండిట్లపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కశ్మీర్​ పండిట్ వర్గం​ ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు బుద్గాం నగరంలో శుక్రవారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

" ప్రతి ఒక్కరు తనతో చక్కగా ప్రవర్తిస్తారని, తనకు ఎవరూ హాని చేయరని ఆయన చెప్పేవారు. అయినప్పటికీ ఆయన్ని ఎవరూ రక్షించలేదు. ఉగ్రవాదులు రాహుల్​ గురించి ఎవరినైనా అడిగే ఉంటారు. లేకపోతే ఎలా తెలుస్తుంది."

- రాహుల్​ భట్​ భార్య

బుద్గాంలోని విమానాశ్రయం వైపు వెళ్తున్న ఆందోళనకారులను అడ్డుకునేందుకు లాఠీఛార్జ్​ చేశారు పోలీసులు. బాష్పవాయువు ప్రయోగించారు. పోలీసుల తీరుపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రజలపై లాఠీఛార్జ్​, బాష్పవాయువు ప్రయోగించగలిగినప్పుడు.. నిన్న ఉగ్రవాదిని ఎందుకు పట్టుకోలేకపోయారు?' అని అపర్ణ పండిట్​ అనే ఓ నిరనసకారురాలు పోలీసులను ప్రశ్నించారు.

భద్రత కల్పించకపోతే రాజీనామాలు: రాహుల్​ భట్​ను ఉగ్రవాదులు హత్య చేసిన క్రమంలో వందల సంఖ్యలో కశ్మీర్​ పండిట్లు నిరసనలు చేపట్టారు. శ్రీనగర్​ విమానాశ్రయానికి వెళ్లే రోడ్డును బ్లాక్​ చేశారు. భాజపా ప్రభుత్వం, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు సరైన భద్రత కల్పించకపోతే ఉద్యోగాలకు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు.

'లెఫ్టినెంట్​ గవర్నర్​ మా ప్రాంతాన్ని సందర్శించి సరైన భద్రత కల్పిస్తామనే భరోసా ఇవ్వాలని అధికారులకు తెలిపాం. కానీ, ఆయన రాలేదు. రాహుల్​ భట్​ కుటుంబానికి రూ.1 కోటి పరిహారం ఇవ్వాలి. పిల్లలకు విద్య, భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. మాకు ఈ ఉద్యోగం వద్ద. మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని జమ్మూకు బదిలీ చేయాలి.' అని డిమాండ్​ చేశారు ఓ మహిళ.

అనంతనాగ్​లోనూ..: కశ్మీర్​ పండిట్​ వర్గం ప్రభుత్వ ఉద్యోగి రాహుల్​ భట్​ను ఉగ్రవాదులు కాల్పి చంపటంపై అనంతనాగ్​లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్​ చేసింది కశ్మీర్​ పండిట్​ ఉద్యోగుల సంఘం. తాము ప్రశాంతంగా ఉండగలమని అనిపించే ప్రాంతాలకు తమను పంపించాలని ప్రభుత్వాన్ని కోరింది.

నిరసనల మధ్యే అంత్యక్రియలు: నిరసనల మధ్యే కశ్మీర్​ పండిట్​ రాహుల్​ భట్​ అంత్యక్రియలు పూర్తయ్యాయి. గురువారం హాత్య జరగగా.. శుక్రవారం ఉదయం జమ్మూలోని దుర్గానగర్​ ప్రాంతంలో ఉన్న నివాసానికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. బంటాలాబ్​ శ్మశానవాటికలో రాహుల్​కు ఆయన సోదరుడు సన్నీ దహన సంస్కారాలు పూర్తి చేశారు. రాహుల్​ భట్​ అంత్యక్రియల్లో వందల మంది కశ్మీర్​ పండిట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కుటుంబ సభ్యులు, కశ్మీర్​ పండిట్లు. పునరావాసం పేరుతో కశ్మీర్​ హిందూలను తుపాకులకు మేతగా వేస్తున్నారని ఆరోపించారు. కశ్మీర్​లోయలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్న తమ కలలను రాహుల్​ ఘటన చెరిపేసిందన్నారు. అంత్యక్రియలకు హాజరైన జమ్ముకశ్మీర్​ భాజపా అధ్యక్షుడు రవీంద్ర రైనాకు నిరసనల సెగ తగిలింది. ప్రధాని నరేంద్ర మోదీ, జమ్ముకశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా, కాషాయ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పండిట్లు.

పుల్వామాలో పోలీసు అధికారి హత్య: జమ్ముకశ్మీర్​, పుల్వామా జిల్లాలోని గుడూరా గ్రామానికి చెందిన పోలీసు కానిస్టేబుల్​ రియాజ్​ అహ్మద్​ థోకర్​పై ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. వెంటనే ఆర్మీ 92వ బేస్​ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. 24 గంటల్లో ఉగ్రవాదులు దాడి చేయటం ఇది రెండోసారిగా అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. డబ్బు కోసం సొంత తాతయ్యనే..

'నేను చనిపోలే.. సమాధిలోకి వెళ్లా అంతే! 27 మంది డాక్టర్లతో..'

Last Updated :May 13, 2022, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.