'యూపీలో కాంగ్రెస్ తన స్థానాలు నిలబెట్టుకుంటే అదే గొప్ప'

author img

By

Published : Oct 24, 2021, 6:12 PM IST

PRIYANKA MOURYA INTERVIEW

ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress in UP) పెద్దగా ప్రభావం చూపదని భాజపా నేత, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. కాంగ్రెస్ తన ఏడు స్థానాలు (UP Election 2022) నిలబెట్టుకుంటే.. అది గొప్ప ఘనత అవుతుందని వ్యాఖ్యానించారు. సమాజ్​వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు కూడా భాజపా విజయానికి అడ్డుకాదని అన్నారు.

ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (UP Election 2022) ప్రియాంకా గాంధీ నుంచి తమకు ఎలాంటి ప్రమాదం లేదని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, భాజపా నేత కేశవ్ ప్రసాద్ మౌర్య (Keshav Prasad Maurya news) అన్నారు. ప్రియాంకను 'ట్విట్టర్ వాద్రా'గా (Priyanka Twitter Vadra) అభివర్ణిస్తూ ఎద్దేవా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఏడు స్థానాలను నిలబెట్టుకుంటే గొప్పే (Congress in UP) అని అన్నారు. ఈ మేరకు పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. కాంగ్రెస్ 40 శాతం టికెట్లను మహిళలకు కేటాయించడంపైనా పెదవి విరిచారు.

"ఉత్తర్​ప్రదేశ్​లో కాంగ్రెస్ ఉనికి అసలే లేదు. 2014 లోక్​సభ ఎన్నికల్లో ఇక్కడ రెండు సీట్లలో గెలిచారు. 2019 లోక్​సభలో అది ఒకటికే పరిమితమైంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏడు సీట్లే సాధించింది. 2022లో ఈ సీట్లు నిలబెట్టుకుంటే.. కాంగ్రెస్​కు అదే గొప్ప ఘనత అవుతుంది. ప్రియాంకను మీరే (మీడియాని ఉద్దేశించి) విపక్ష అభ్యర్థిగా చూస్తున్నారు. నేనైతే ప్రియాంకను ట్విట్టర్ వాద్రా (Priyanka Twitter Vadra) అని భావిస్తా. ఫొటోలు దిగే నేతలు తప్ప.. కాంగ్రెస్​లో ఎవరూ లేరు. ప్రియాంక అయినా, రాహుల్ అయినా అంతే."

-కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ ఉపముఖ్యమంత్రి

సమాజ్​వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు (SP BSP news) కూడా భాజపా విజయానికి అడ్డుకాదని మౌర్య ధీమాగా చెప్పారు. 2017 ఎన్నికల్లో గెలిచిన స్థానాలను మళ్లీ సాధిస్తే.. వారు సంతోషించవచ్చని అన్నారు. ఈ పార్టీలు చేసిన అవినీతి, నేరాలు, మాఫియా రాజకీయాల గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. ఆమ్ ఆద్మీ, ఎంఐఎం పార్టీలకు యూపీ ఎన్నికల్లో ప్రాధాన్యమే లేదని చెప్పుకొచ్చారు. ఈ పార్టీలు ఓట్లను చీల్చేందుకే పోటీ చేస్తున్నాయన్నారు.

వచ్చే ఎన్నికల్లో భాజపాకు ఎలాంటి సవాళ్లు ఎదురుకాబోవని అన్నారు మౌర్య. ఇచ్చిన హామీలను చాలా వరకు పార్టీ నెరవేర్చిందని చెప్పారు. ఈసారి 325 కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

సీఎం ఎవరంటే?

ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికల్లో భాజపా సీఎం అభ్యర్థి ఎవరన్న (UP BJP CM Candidate) ప్రశ్నకు అస్పష్ట సమాధానం ఇచ్చారు. ఈ నిర్ణయం పార్టీ అధిష్ఠానం చేతిలో ఉంటుందంటూ దాటవేత ధోరణితో సమాధానం చెప్పారు. ఎమ్మెల్యేలను సంప్రదించి వారే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 'ప్రస్తుతానికైతే యోగి ఆదిత్యనాథ్ మా ముఖ్యమంత్రి. యోగితో పాటు మేమంతా భాజపా గెలుపునకు కృషి చేస్తున్నాం' అని అన్నారు.

గత ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్థి రేసులో ముందంజలో ఉన్నారు మౌర్య. భాజపాకు యాదవేతర బీసీల మద్దతును సమీకరించడంలో కీలకంగా వ్యవహరించారు. అయితే, చివరకు ముఖ్యమంత్రి పీఠం మాత్రం యోగి ఆదిత్యనాథ్​ను వరించింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.