'సాగు చట్టాల మాదిరిగానే అగ్నిపథ్​నూ వెనక్కి తీసుకోవాలి'

author img

By

Published : Jun 18, 2022, 12:12 PM IST

Agnipath Rahul Gandhi

Agnipath Rahul Gandhi: కేంద్రం తీసుకొచ్చిన 'అగ్నిప‌థ్ ప‌థ‌కం'పై కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శ‌లు కురిపిస్తూనే ఉంది. త్రివిధ ద‌ళాల్లో నియామ‌కాల కోసం తీసుకొచ్చిన ఆ ప‌థ‌కాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశారు రాహుల్​ గాంధీ. మోదీ 'మాఫీవీర్'గా మారి.. యువ‌త డిమాండ్‌కు త‌లొగ్గుతారంటూ రాహుల్​ ట్వీట్​ చేశారు. మరోవైపు.. దిల్లీలోని జంతర్​మంతర్​ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం సత్యాగ్రహ దీక్ష చేయనున్నారు.

Agnipath Scheme Rahul Gandhi Tweet: రైతుల సుదీర్ఘ నిరసనల అనంతరం సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తాజాగా గుర్తుచేశారు. అదే తరహాలో సైనికుల నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని సైతం వెనక్కి తీసుకోక తప్పదని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

"వరుసగా 8 ఏళ్ల నుంచి భాజపా ప్రభుత్వం 'జై జవాన్‌, జై కిసాన్‌' విలువలను అవమానపరిచింది. నల్ల వ్యవసాయ చట్టాలను ప్రధానమంత్రి రద్దు చేసుకోకతప్పదని నేను గతంలో చెప్పాను. అదే తరహాలో తాజాగా ఆయన దేశ యువత నిర్ణయాన్నీ అంగీకరించాల్సిందే. క్షమాపణలు చెప్పి అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాల్సిందే" అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. అగ్నిపథ్‌లో చేరుతున్నవారిని 'అగ్నివీర్‌'లని వ్యవహరిస్తున్నట్లుగా.. యువతకు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసిన రాహుల్‌ ఆయనను వ్యంగ్యంగా 'మాఫీవీర్‌' అని సంబోధించారు. 'మాఫీ' అంటే హిందీలో 'క్షమాపణ' అని అర్థం.

  • 8 सालों से लगातार भाजपा सरकार ने ‘जय जवान, जय किसान' के मूल्यों का अपमान किया है।

    मैंने पहले भी कहा था कि प्रधानमंत्री जी को काले कृषि कानून वापस लेने पड़ेंगे।

    ठीक उसी तरह उन्हें ‘माफ़ीवीर' बनकर देश के युवाओं की बात माननी पड़ेगी और 'अग्निपथ' को वापस लेना ही पड़ेगा।

    — Rahul Gandhi (@RahulGandhi) June 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దేశవ్యాప్తంగా నిరసనలు.. సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా యువత విధ్వంస చర్యలకు పాల్పడింది. రైల్వే స్టేషన్లను కేంద్రంగా చేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్‌ సహా పలు రైల్వే స్టేషన్లలో రైళ్లకు నిప్పంటించారు. మరోవైపు అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు పలుచోట్ల కాల్పులు కూడా జరపడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి.

జంతర్​మంతర్​ వద్ద కాంగ్రెస్​ దీక్ష.. 'అగ్నిపథ్' పై ఆదివారం దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. 'అగ్నిపథ్' పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న యువకులకు సంఘీభావంగా కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు.. ఆదివారం ఉదయం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహం చేయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీలు, కార్యవర్గ సభ్యులు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి: 18 ఏళ్ల తర్వాత భార్యాపిల్లల చెంతకు..ఇన్నిరోజులు పాపం ఒక్కడే!

అగ్నిపథ్​పై ఆందోళనలు.. కేంద్రం మరో కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.