కరోనా పరిస్థితిపై సీఎంలతో మోదీ భేటీ- కఠిన ఆంక్షలు విధిస్తారా?
Updated on: Jan 12, 2022, 12:32 PM IST

కరోనా పరిస్థితిపై సీఎంలతో మోదీ భేటీ- కఠిన ఆంక్షలు విధిస్తారా?
Updated on: Jan 12, 2022, 12:32 PM IST
PM Modi meeting with CMs: కరోనా పరిస్థితిపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం సమావేశం కానున్నారు ప్రధాని మోదీ. దేశంలో కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు పలు సూచనలు చేయనున్నారు.
PM Modi meeting with CMs: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ భేటీ జరగనుంది. కొవిడ్ కట్టడికి రాష్ట్రాలు విధించిన ఆంక్షలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరు, వైద్య సన్నద్ధత వంటి అంశాలపై సమీక్షించనున్నారు. ఒమిక్రాన్ కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కట్టడికి రాష్ట్రాలకు పలు సూచనలు చేయనున్నారు.
Modi CMs meeting
ఆదివారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలోనూ కొవిడ్ పరిస్థితిపై మోదీ చర్చించారు. జిల్లా స్థాయిలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని, వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచించారు. కరోనాను నిలువరించేందుకు టీకానే ఉత్తమ మార్గమని పేర్కొన్నారు.
ఒమిక్రాన్ను కట్టడి చేసేందుకు దేశంలోని ఆరోగ్యకర్తలు, 60ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసు పంపిణీని ఇప్పటికే ప్రారంభించింది కేంద్రం. 15-18 ఏళ్ల పిల్లలకు కూడా టీకాలు అందిస్తోంది.
2020లో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ముఖ్యమంత్రులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు ప్రధాని. వైరస్ కట్టడికి చర్యలపై చర్చిస్తున్నారు.
ఇదీ చదవండి: Corona test guidelines: 'లక్షణాలు లేకుంటే కరోనా పరీక్ష అవసరం లేదు'
