'కర్తవ్యపథ్​'ను ప్రారంభించిన మోదీ.. నేతాజీ విగ్రహావిష్కరణ

author img

By

Published : Sep 8, 2022, 8:00 PM IST

Kartavya Path Inauguration

Kartavya Path Inauguration : దిల్లీలో కొత్తగా నామకరణం చేసిన కర్తవ్యపథ్​ను లాంఛనంగా ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అంతకుముందు ఇండియా గేట్‌ సమీపంలో ఏర్పాటు చేసిన నేతాజీ సుభాశ్‌ చంద్రబోస్‌ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు.

Kartavya Path Inauguration : దేశ రాజధానిలో కొత్తగా నామకరణం చేసిన కర్తవ్యపథ్​ను లాంఛనంగా ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అంతకుముందు ఇండియా గేట్‌ సమీపంలో ఏర్పాటు చేసిన నేతాజీ సుభాశ్‌ చంద్రబోస్‌ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు.
ఏటా గణతంత్ర దినోత్సవాన దేశ సైనికశక్తి ప్రదర్శనకు వేదికగా నిలిచే రాజ్‌పథ్‌ పేరు మారిపోయింది. అంతకుముందు కర్తవ్యపథ్‌గా మార్చాలన్న ప్రతిపాదనకు దిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి.. అధ్యక్షతన జరిగిన దిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇండియా గేట్‌ వద్ద ఉన్న నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న మార్గాన్ని ఇకపై కర్తవ్యపథ్‌గా పిలుస్తారు. వలసవాద విధానాలు, చిహ్నాలు మార్చాలన్న విధానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి మీనాక్షి లేఖి తెలిపారు. బ్రిటిష్‌వారి కాలంలో కింగ్స్‌వే అని పిలవగా స్వాతంత్ర్యం తర్వాత రాజ్‌పథ్‌గా నామకరణం చేశారు. ఇప్పుడు కర్తవ్యపథ్‌గా మారింది.

Kartavya Path Inauguration
ప్రధాని మోదీ ఆవిష్కరించిన నేతాజీ విగ్రహం
Kartavya Path Inauguration
నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మోదీ

వలసవాద పేర్లు, చిహ్నాలను రద్దు చేస్తామని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఉద్ఘాటించగా అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పే‌ర్లు మార్పు చేపట్టింది. ప్రధాని నివాసం ఉండే రేస్‌కోర్స్‌ రోడ్‌ పేరును లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌గా 2015లో మార్చారు. ఔరంగజేబు రోడ్డును ఏపీజే అబ్దుల్‌ కలాం రోడ్డుగా.. డల్హౌసీ రోడ్డును దారా శిఖో రోడ్డుగా నామకరణం చేశారు. 2018లో తీన్‌మూర్తీ చౌక్‌ పేరును తీన్‌ మూర్తీ హైఫాగా మార్చారు. అయితే అక్బర్‌ రోడ్డు పేరును కూడా మార్చాలని ప్రతిపాదనలు వచ్చినా ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు వెల్లడించారు.

Kartavya Path Inauguration
నేతాజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తున్న మోదీ
Kartavya Path Inauguration
విద్యుత్ వెలుగుల్లో ఇండియా గేట్​

నూతన పార్లమెంట్‌, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో కూడిన సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా కర్తవ్యపథ్‌ను అభివృద్ధి చేశారు. 20 నెలలపాటు ఈ మార్గంలో ప్రజలను అనుమతించలేదు. శుక్రవారం నుంచి సందర్శనకు అనుమతించనున్నారు. సెంట్రల్‌ విస్టా అవెన్యూలో దారి పొడవునా ఆయా రాష్ట్రాలకు చెందిన ఆహార స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఎర్రటి గ్రానైట్‌ వాక్‌ వేలు, చుట్టూ హరితవనాలు, విక్రయశాలలు, పార్కింగ్‌ ప్రదేశాలతోపాటు 24 గంటలు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఈ ఉద్యాన వనాల్లోకి ఆహార పదార్థాలను అనుమతించరు. దారి పొడవునా మొత్తం 16 వంతెనలు రెండుచోట్ల బోటింగ్‌ సదుపాయం కూడా ఉంటుంది. 1,125 వాహనాలు పార్కింగ్‌ చేసే సదుపాయం కల్పించారు. ఇండియాగేట్‌ వద్ద 35 బస్సులకు పార్కింగ్‌ వసతి ఉంటుంది. ఇండియా గేట్‌ చుట్టు పచ్చదనం ఉండేలా ప్రత్యేక ఉద్యానవనాలను అభివృద్ధి చేశారు. 1930లో ఆకాశం నుంచి చూస్తే ఎలా ఉండేదో ఆ స్థాయిలో పచ్చదనాన్ని పెంచారు. అక్కడి ప్రతిచెట్టు దాని ఎత్తు, రకం, పరిమాణాన్ని జియో ట్యాగింగ్‌ చేశారు.

శతాబ్దకాల చరిత్ర..: రాజ్‌పథ్‌.. దేశ రాజధానిలో అధికార కేంద్రానికి చిరునామా. శతాబ్దకాల చరిత్ర దీని సొంతం. మూడు కి.మీ. పొడవైన ఈ మార్గం దిల్లీ అస్తిత్వంతో ముడిపడి ఉందని చెప్పవచ్చు. గురువారం నుంచి దీనిని కర్తవ్యపథ్‌గా పిలిచేందుకు అధికారిక ప్రకటన వెలువడింది.

1911: వలసవాద పాలకులు మన దేశ రాజధానిని కలకత్తా నుంచి దిల్లీకి మార్చాలని నిర్ణయించారు. వాహ్యాళికి అనువుగా ఉంటుందని 1920లో ప్రస్తుత రాజ్‌పథ్‌ను నిర్మించారు. నూతన రాజధాని నిర్మాణ శిల్పులు ఎడ్విన్‌ లుట్యెన్స్‌, హెర్బెర్ట్‌ బకెర్‌లు ఇక్కడ సువిశాల పచ్చికబయళ్లు, నీటి కాలువలు ఉండేలా చూశారు. కింగ్‌ జార్జి-5 గౌరవార్థం దీనికి కింగ్స్‌వే అని పేరు పెట్టారు.

రాజ్‌పథ్‌: స్వాతంత్య్రం వచ్చాక కింగ్స్‌వే పేరును రాజ్‌పథ్‌గా మార్చారు. కేంద్ర సర్కారు చేపట్టిన సెంట్రల్‌ విస్టా పునర్నిర్మాణంలో భాగంగా ఈ ప్రాంతంలో కొన్ని మార్పులు చేశారు.

కర్తవ్య పథ్‌: ఇటీవల స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. వలసవాద, సామ్రాజ్యవాద ఆలోచనల్ని ప్రతిబింబించే చిహ్నాలను తొలగించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే రాజ్‌పథ్‌ పేరు మార్పు ప్రతిపాదన వచ్చింది. భారీఎత్తున చేపట్టిన సెంట్రల్‌ విస్టా పనుల్లో మొదటిగా పూర్తయిన పని ఇదే. తాగునీరు, మరుగుదొడ్లు, ఆహారశాలలు, సూచికల బోర్డులు సహా అన్నిరకాల హంగుల్ని 1.10 లక్షల చ.మీ. ఆవరణలో కల్పించారు. 900 విద్యుత్‌ స్తంభాలు, నాలుగు చోట్ల భూగర్భ నడక మార్గాలు, 422 ఎర్ర గ్రానైట్‌ బల్లలు ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి: 'కర్తవ్యపథ్'​గా మారనున్న 'రాజ్​పథ్'​.. మోదీ చేతులమీదుగా నేడు ప్రారంభం

'రాహుల్​ యాత్రతో బాహుబలిలా కాంగ్రెస్​.. ఎవరైనా తక్కువ అంచనా వేస్తే..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.