ఐదు గ్రామాలను వణికించిన కుక్క.. 12మందిపై దాడి.. పాదచారులను లూటీ చేసిన దొంగలు

author img

By

Published : Oct 1, 2022, 6:10 PM IST

Updated : Oct 1, 2022, 7:05 PM IST

pitbull attack on five villagers

ఒకే ఒక్క శునకం ఐదు గ్రామాల ప్రజలను బెంబేలెత్తించింది. విచ్చలవిడిగా తిరుగుతూ కనిపించినవారిపై దాడికి దిగింది. మరోవైపు, రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని లూటీకి పాల్పడ్డారు దొంగలు.

ఐదు గ్రామాలను వణికించిన కుక్క.. 12మందిపై దాడి

పంజాబ్ గురుదాస్​పుర్​లో ఒకే కుక్క.. ఐదు గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేసింది. దినానగర్ సమీపంలోని ఐదు గ్రామాల్లోని 12 మందిపై ఆ పెంపుడు శునకం దాడి చేసింది. గ్రామాల మధ్య కిలోమీటర్ల దూరం ఉన్నా.. శునకం వదిలిపెట్టలేదు. మధ్యలో జాతీయ రహదారి ఉందని, దాన్ని సైతం దాటుకొని వచ్చిందని స్థానికులు వాపోతున్నారు. శునకం మొదట.. తంగోషా గ్రామంలోని ఇద్దరు కూలీలపై దాడి చేసింది. చాకచక్యంగా వ్యవహరించిన కూలీలు.. పెంపుడు శునకం మెడకు ఉన్న చైన్​ను పట్టుకొని దాన్ని అడ్డుకోగలిగారు. ఆ తర్వాత ఎలాగోలా తప్పించుకున్న కుక్క.. రాత్రి వేళ గ్రామంలోకి ప్రవేశించింది. అక్కడ దిలీప్ కుమార్(60) అనే వ్యక్తిపై దాడి చేసింది.

ఈ సమయంలో ఓ వీధి కుక్క.. ఆ శునకంపైకి వచ్చింది. దీంతో దిలీప్ కుమార్ తప్పించుకున్నాడు. ఇంటివైపు పరిగెత్తాడు. అయితే, పెంపుడు శునకం వదల్లేదు. దిలీప్​ను వెంబడించింది. తలపై కాళ్లతో గీరింది. ఇంటివరకు చేరుకున్న అతడిని కుటుంబ సభ్యులు కాపాడారు. అనంతరం గ్రామానికి చెందిన బల్దేవ్ రాజ్​పై దాడి చేసింది. అనంతరం ఘరోటా రోడ్ వైపు వెళ్లిన శునకం.. దారిలో అనేక జంతువులపైనా దాడికి దిగింది.

ఈ క్రమంలోనే నేపాలీ వాచ్​మన్ రామ్​నాథ్, ఛన్నీ గ్రామానికి చెందిన మంగల్ సింగ్​పైనా దాడి చేసింది. ఆ తర్వాత చౌహానా గ్రామానికి చెందిన విశ్రాంత సైనికుడు కెప్టెన్ శక్తి సింగ్​ను కరిచేసింది. ఆయన చెయ్యికి తీవ్ర గాయమైంది. అయితే, ధైర్యం కోల్పోకుండా శునకాన్ని పట్టుకునేందుకు శక్తిసింగ్ ప్రయత్నించారు. దాని రెండు చెవులను పట్టుకొని నిలువరించే ప్రయత్నం చేశారు. శక్తిసింగ్ అరుపులు విని మరికొందరు అక్కడికి చేరుకున్నారు. కర్రలతో శునకాన్ని తీవ్రంగా కొట్టారు. దీంతో అది ప్రాణాలు కోల్పోయింది. శునకం ధాటికి గాయపడ్డవారంతా దినానగర్, గురుదాస్​పుర్ సివిల్ ఆస్పత్రుల్లో అడ్మిట్ అయ్యారు.

పాదచారులపై దొంగల దాడి..
ఉత్తర్​ప్రదేశ్ లఖ్​నవూలో గుర్తుతెలియని వ్యక్తులు ఆరుగురిని లూటీ చేశారు. మోహన్​లాల్ గంజ్​లో ఈ ఘటన జరిగింది. దుండగులు పోలీసులపైనా దాడి చేశారు. ఓ చెట్టు వెనక దాక్కున్న దొంగలు.. దారిలో వెళ్తున్న ఆరుగురిపై లాఠీలతో దాడి చేశారని, అనంతరం వారి వస్తువులను దొంగలించారని పోలీసులు తెలిపారు. బాధితులంతా తమ ఇంటికి వెళ్తుండగా ఈ లూటీ జరిగిందని చెప్పారు. నిందితుల్లో ఓ మహిళ కూడా ఉంది.

అయితే, దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించారు. తమ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించలేదని అన్నారు. బాధితుల కుటుంబ సభ్యులు సైతం పోలీస్ స్టేషన్​కు వెళ్లి ఆందోళన చేసిన తర్వాతే వారు స్పందించారని సమాచారం. అనంతరం రంగంలోకి దిగిన ఇన్​స్పెక్టర్ కుల్దీప్ దుబే, ఆయన బృందం.. ఘటనాస్థలికి చేరుకుంది. పోలీసులను గమనించిన దుండగులు.. వారిపైనా రాళ్లు విసిరి ఘటనాస్థలి నుంచి పారిపోయారు. ఈ క్రమంలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Last Updated :Oct 1, 2022, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.