యశ్వంత్ సిన్హా నామినేషన్​.. 'ఇద్దరు వ్యక్తులు కాదు.. రెండు సిద్ధాంతాల మధ్య పోటీ!'

author img

By

Published : Jun 27, 2022, 12:16 PM IST

Updated : Jun 27, 2022, 1:57 PM IST

1566815315668153

Yashwant Sinha Nomination Filed: విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ వేశారు. ఆ సమయంలో ఆయన వెంట కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు ఉన్నారు.

యశ్వంత్​ సిన్హా నామినేషన్​ దృశ్యాలు

Yashwant Sinha Nomination Filed: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా.. నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీకి నామినేషన్​ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, ఎస్పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​, టీఎంసీ, డీఎంకే ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్‌కు ముందు.. సిన్హాను బలపరుస్తున్న పార్టీల నేతలంతా రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు.

Opposition Presidential polls
నామినేషన్​ దాఖలు చేస్తున్న దృశ్యం

'పోటీ ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు.. రెండు సిద్ధాంతాల మధ్య'.. త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నిక.. ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదని, రెండు సిద్ధాంతాల మధ్య జరిగే పోరు అని పలువురు ప్రతిపక్ష పార్టీ నాయకులు అన్నారు. ఓవైపు ఆర్‌ఎస్‌ఎస్‌పై ద్వేషం, మరోవైపు అన్ని విపక్షాల కరుణ అనే రెండు సిద్ధాంతాల మధ్యే అసలైన పోరాటం జరుగుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. యశ్వంత్​ సిన్హా ఉత్తమ అభ్యర్థిగా తాము భావిస్తున్నామని, అందుకే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మద్దతు పలుకుతున్నారని ఆ పార్టీ ఎంపీ సౌగతా రాయ్​ తెలిపారు. అత్యున్నత విలువలతో ఉన్న కూటమి తమదని ఆయన చెప్పారు. తాము ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు గౌరవిస్తామని, కానీ ఎన్నికల్లో మాత్రం యశ్వంత్​ సిన్హాకు మద్దతిస్తామని సీపీఏం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్​ వేసిన యశ్వంత్​ సిన్హాకు పలు పార్టీలు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్​, తెరాస, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, ఎస్పీ, డీఎంకే, ఆర్జేడీ, ఆర్​ఎల్డీ, నేషనల్ కాన్ఫరెన్స్​ పార్టీలు సిన్హాకు అండగా నిలిచాయి.

Opposition Presidential polls
రాహుల్​ గాంధీ, శరద్​పవార్, యశ్వంత్​ సిన్హా

ఐఏఎస్​ నుంచి రాజకీయాల వైపు...
యశ్వంత్ సిన్హా బిహార్ పట్నాలో 1937 నవంబర్ 6న జన్మించారు. 1958లో యూనివర్సిటీ ఆఫ్​ పట్నాలో పొలిటికల్ సైన్స్​లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అక్కడే 1962 వరకు ప్రొఫెసర్​గా పనిచేశారు. 1960లోనే సిన్హా ఐఏఎస్​కు ఎంపికయ్యారు. 24 ఏళ్ల పాటు సేవలందించారు. పలు కీలక పదవులు చేపట్టారు. అనంతరం 1984లో జనత పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. 1986లో పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీగా నియమితులయ్యారు. 1988లోనే రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1989లో జనతాదళ్ ఏర్పాటయ్యాక ఆ పార్టీకి జనరల్ సెక్రెటరీగా నియమితులయ్యారు. అప్పటి ప్రధాని చంద్రశేఖర్ కేబినెట్​లో 1990 నవంబర్ 1 నుంచి 1991 జూన్ వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు.భాజపా ఏర్పాటయ్యాక 1996లో పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా యశ్వంత్​ సిన్హా నియమితులయ్యారు. 1998, 1999, 2009లో హజారీబాగ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేసి గెలుపొందారు. 1998-2022 మధ్య కాలలో అటల్​బిహారీ వాజ్​పేయీ హయాంలో ఆర్థిక మంత్రిగా సేవలందించారు. 2002-2004 మధ్య విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

అభ్యర్థిగా సిన్హానే ఎందుకు?
భాజపాలో ఉంటూనే సొంతపార్టీపై గళమెత్తిన అతికొద్ది మంది నేతల్లో యశ్వంత్ సిన్హా ఒకరు. పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీపై బహిరంగంగా విమర్శలు గుప్పించారు. అయితే 2018లో పార్టీ ఉపాధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని మోదీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.ఆ తర్వాత బంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2021 మార్చి 13న మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో చేరారు యశ్వంత్ సిన్హా. మార్చి 15న పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇప్పుడు రాష్ట్రపతి రేసులో ఉంటున్నందున పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తున్నట్లు చెప్పారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న యశ్వంత్​ సిన్హాకు అన్ని పార్టీలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఐఏఎస్ అధికారిగా సేవలందించిన అనుభవం ఉంది. అందుకే ఆయనే రాష్ట్రపతి అభ్యర్థికి సరైన వ్యక్తి అని భావించి విపక్షాలు ఏకాభిప్రాయంతో ఆయన పేరును ఖరారు చేశాయి.

ఇవీ చదవండి: 'ఆ​ ఎమ్మెల్యేలు రూ.50 కోట్లకు అమ్ముడుపోయారు.. మొత్తం స్క్రిప్ట్​ భాజపాదే'

తీస్తాకు జులై 2 వరకు పోలీసు కస్టడీ.. కేసు విచారణకు సిట్​

Last Updated :Jun 27, 2022, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.