జాగ్రత్త.. నేను మూడో కన్ను తెరిచానో.. వైసీపీ ఎమ్మెల్యేకి బాలకృష్ణ స్ట్రాంగ్​ వార్నింగ్​

author img

By

Published : Mar 15, 2023, 1:55 PM IST

Updated : Mar 16, 2023, 8:32 AM IST

NTR CENTENARY CELEBRATIONS

NTR CENTENARY CELEBRATIONS: నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. తాజాగా గుంటూరు జిల్లా తెనాలి పెమ్మసాని థియేటర్‌లో నిర్వహించిన ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యేకి బాలయ్య వార్నింగ్​ ఇచ్చారు. ఎందుకంటే..?

ఎన్టీఆర్‌ సినిమాల వల్లే నేటికీ ఇంకా భాష బతికుంది

NTR CENTENARY CELEBRATIONS: నందమూరి తారక రామారావు (NTR) సినిమాల వల్లే.. నేటికీ తెలుగు భాష బతికుందని ఆయన కుమారుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని పెమ్మసాని థియేటర్‌లో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అలనాటి సినీ నటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరికి, సినీ నిర్మాత నాగిరెడ్డి కుమారుడు విశ్వనాథరెడ్డికి ఎన్టీఆర్‌ పురస్కారాలు అందించి సన్మానించారు.

సినీ, రాజకీయరంగాల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారని బాలకృష్ణ అన్నారు. తెనాలి ప్రాంతం ఎందరో కవులకు జన్మనిచ్చిన ప్రాంతం అన్నారు. ఎన్టీఆర్‌తో కలిసి నటించిన వారంతా చిరస్మరణీయులే బాలకృష్ణ పేర్కొన్నారు. కమర్షియల్ సినిమాలకు ఎన్టీఆర్‌ ఆద్యులని.. ఎన్టీఆర్ భక్తిరస సినిమాలు ఎంతో పేరు తెచ్చి పెట్టాయని తెలిపారు. ఇప్పటి పిల్లలు తెలుగు మాట్లాడలేకపోవటం బాధగా ఉందని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

"రామారావు గారి సినిమాలు శాశ్వతం. ఒక రకంగా చెప్పాలంటే ఆయన సినిమాల వల్లే తెలుగు భాష బతికి ఉంది. ఈ కాలంలో చాలా మంది పిల్లలు తెలుగు కూడాపలకలేని పరిస్థితుల్లో ఉన్నారు"-నందమూరి బాలకృష్ణ

పాతాళభైరవి అప్పట్లోనే పాన్ ఇండియా సినిమా అని తెలిపారు. నాన్నతో పాతాళభైరవి తీసిన సంస్థ నాతో భైరవద్వీపం తీశారని గుర్తు చేశారు. సినిమా తన ఊపిరి అని చెప్పిన బాలయ్య.. అలాగే రాజకీయాలు అంటే కూడా ఇష్టం అని వ్యాఖ్యానించారు. సినిమా, రాజకీయం రెండూ రెండు కళ్ల వంటివన్నారు.

ఎన్టీఆర్​ శతజయంతి ఉత్సవాలకు రావడం వెనుక ఎంతో ప్రాశస్త్యం ఉందని బాలకృష్ణ అన్నారు. నటన అంటే సావిత్రిలా ఉండాలన్న బాలయ్య.. ఆమె నటన అజరామరం అని కొనియాడారు. మహానటి సావిత్రి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని వ్యాఖ్యానించారు. ఈరోజు పాతాళభైరవి విడుదలైన రోజు కావడం మరో విశేషం అని బాలకృష్ణ అన్నారు. కష్టపడినందునే నాగిరెడ్డి, సావిత్రి ఇప్పటికీ ప్రజలకు గుర్తున్నారని పేర్కొన్నారు.

రాజకీయంగా నా పైకి రండి నేను రెఢీ: సినిమాలను రాజకీయాలకు అతీతంగా చూడాలని.. నందమూరి బాలకృష్ణ హితవు పలికారు. ఇటీవల.. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని ఓ తిరునాళ్లలో బాలకృష్ణ పాట వేసిన వైసీపీ కార్యకర్తను ఎమ్మెల్యే తిట్టారంటూ వచ్చిన వార్తలపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. హద్దు మీరొద్దని హెచ్చరించారు.

"ఒకటి సినిమా, మరోటి రాజకీయం ఈ రెండు కూడా నాకు రెండు కళ్ల లాంటివి. ఈ మధ్యన నరసరావుపేటలో ఏదో జాతరలో వైసీపీ కార్యకర్త నా పాటకు డ్యాన్స్​ వేశాడు. ఓ ఎమ్మెల్యే.. బాలకృష్ణ పాటకు వేస్తావా అంటూ నోరు జారి తన స్థాయిని దిగజార్చుకున్నాడు. మీ పరిధిలో మీరు ఉండండి. జాగ్రత్త. నా ఫ్యాన్స్​కు చిటిక వేస్తే చాలు. ఇలాంటి ఘటనలు మరోసారి పునారవృతం కావొద్దు"-నందమూరి బాలకృష్ణ

ఈ ఉత్సవాలకు బాలకృష్ణ రావడం సంతోషంగా ఉంది: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను గత 10 నెలలుగా నిర్వహిస్తున్నామని టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్​ అన్నారు. ఎన్టీఆర్‌తో అనుబంధం ఉన్న నటీనటులను సన్మానిస్తున్నామన్నారు. బి.నాగిరెడ్డి, సావిత్రి తరఫున వారి వారసులను సన్మానిస్తున్నట్లు తెలిపారు. తెనాలిలోని పెమ్మసాని థియేటర్‌లో ఎన్టీఆర్ సినిమాలను ఉచితంగా ప్రదర్శిస్తున్నామన్న ఆలపాటి.. ఉత్సవాలకు బాలకృష్ణ రావడం సంతోషంగా ఉందన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Mar 16, 2023, 8:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.