బాలికపై గ్యాంగ్​ రేప్.. నగ్నంగా నడుచుకుంటూ ఇంటికి.. 20 రోజులకు...

author img

By

Published : Sep 22, 2022, 10:18 AM IST

Updated : Sep 22, 2022, 10:48 AM IST

Moradabad Bhojpur gang rape case

15 ఏళ్ల బాలిక పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారు ఐదుగురు కామాంధులు. ఆమెను వివస్త్రను చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​ మొరాదాబాద్​లో సెప్టెంబర్ 1న జరిగిందీ దురాణం. ఆమె నగ్నంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న వీడియోను ఓ మహిళ సోషల్​ మీడియాలో పోస్ట్ చేయగా.. అనేక రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

సామూహిక అత్యాచారానికి గురైన బాలిక.. రోడ్డుపై నగ్నంగా ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఉత్తర్​ప్రదేశ్​లో తీవ్ర దుమారం రేపింది. సెప్టెంబర్​ 1న జరిగిన దారుణం ఈ వీడియోతో వెలుగులోకి రాగా.. పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఒకడ్ని అరెస్టు చేశారు. మొరాదాబాద్​ జిల్లా భోజ్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగిందీ ఘటన.

ఒంటరిగా ఉన్న బాలికను ఎత్తుకెళ్లి..
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలి వయసు 15 ఏళ్లు. సెప్టెంబర్​ 1న పక్క గ్రామంలో జరుగుతున్న సంతకు వెళ్లింది. తిరిగి వస్తుండగా నితిన్, కపిల్, అజయ్, నాజియా అలీ, ఇమ్రాన్​ కలిసి.. బాలికను ఓ నిర్మానుష్య ప్రదేశానికి ఎత్తుకెళ్లారు. ఆమెను వివస్త్రను చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సమీపంలోని పొలాల్లో పని చేసుకుంటున్నవారు.. బాధితురాలి అరుపులు విని, అటు వైపు వచ్చారు. వెంటనే నిందితులంతా అక్కడ నుంచి పారిపోయారు. బాధితురాలు అలానే నగ్నంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్లి.. కుటుంబసభ్యులకు జరిగినదంతా చెప్పింది.

బాలిక నగ్నంగా నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను ఓ మహిళ ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. ఇది వైరల్ కాగా.. పోలీస్​ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. అయితే.. ఫిర్యాదును స్వీకరించి, కేసు నమోదు చేసే విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన వెంటనే బాధితురాలు, కుటుంబం కలిసి పోలీస్ స్టేషన్​కు వెళ్లి, ఫిర్యాదు చేసినా.. పోలీసులు కేసు నమోదు చేయలేదని కొందరు చెబుతున్నారు. వారం తర్వాత ఎస్​ఎస్​పీ హేమంత్​ కుటియాల్​ను కలవగా.. అప్పుడు కేసు పెట్టారని అంటున్నారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో మొరాదాబాద్​ ఎస్​పీ(గ్రామీణ) సందీప్ కుమార్ మీనా మంగళవారం రాత్రి వివరణ ఇచ్చారు. "తన మేనకోడలిపై అత్యాచారం జరిగిందని ఓ వ్యక్తి సెప్టెంబర్ 7న ఫిర్యాదు చేశాడు. మేము దర్యాప్తు ప్రారంభించాం. కానీ.. అలాంటిదేమీ లేదని బాలిక తల్లిదండ్రులు చెప్పారు. అయినా మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఒక నిందితుడ్ని అరెస్టు చేశాం." అని స్పష్టం చేశారు.

భర్తను కొట్టి.. భార్యపై గ్యాంగ్​ రేప్​
భర్తపై దాడి చేసి, భార్యపై సామూహిక అత్యాచారం చేసిన నలుగుర్ని ఒడిశా బాలేశ్వర్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. మయూర్​భంజ్​ జిల్లాకు చెందిన దంపతులు.. సోమవారం వేకువజామున బాలేశ్వర్​ రైల్వే స్టేషన్​ నుంచి బయటకు వెళ్తున్నారు. ఆ సమయంలో ఆరుగురు వారిని అడ్డగించారు. భర్తపై దాడి చేశారు. భార్యాభర్తలు అక్కడ నుంచి తప్పించుకుని, సమీపంలోని ఓ భవనంలో దాక్కున్నారు. అక్కడకూ వచ్చిన నిందితులు.. భర్తను మరోసారి కొట్టారు. 28 ఏళ్ల మహిళను పొలానికి తీసుకెళ్లి.. అత్యాచారం చేశారు. అనంతరం బాధిత దంపతులు సహదేవ్​కుంట పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. నిందితుల్లో నలుగుర్ని 48 గంటల్లోనే అరెస్టు చేశామని, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు బుధవారం చెప్పారు.

చంపి.. శరీరాన్ని 12 ముక్కలు చేసి..
ఓ వ్యక్తిని చంపి, మృతదేహాన్ని 12 ముక్కలు చేసి కోయంబత్తూరులోని వేర్వేరు చోట్ల పడేసిన ముగ్గుర్ని తమిళనాడు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుల్లో ఓ మహిళ కూడా ఉంది. మృతుడికి, ఆ మహిళకు గతంలో వివాహేతర సంబంధం ఉండేదని, తర్వాత అది శత్రుత్వంగా మారడమే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు.

గత గురువారం తుడియాలూర్ సమీపంలోని వెళ్లకినార్​లోని ఓ చెత్త కుండీ వద్ద ఒక చెయ్యి కనిపించింది. పోలీసులు 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అదే సమయంలో.. ప్రభు(39) అనే వ్యక్తి కనిపించడం లేదన్న కేసు నమోదైంది. రెండింటినీ కలిపి చూడగా.. అసలు విషయం బయటపడింది.

ప్రభుకు పెళ్లయింది. అయితే.. బ్యూటీ పార్లర్ నడిపే ఓ మహిళతో ఆయనకు వివాహేతర సంబంధం ఉండేది. తర్వాత వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి. తెలిసిన ఇద్దరు వ్యక్తుల సహాయంతో ఆ మహిళ.. ప్రభును దారుణంగా హత్య చేసింది. శరీరాన్ని ముక్కలు చేసి, నగరంలో అక్కడక్కడ పడేసింది. ఇప్పటివరకు 8 శరీర భాగాలు లభ్యమయ్యాయని, ముగ్గుర్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

Last Updated :Sep 22, 2022, 10:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.