'సూపర్​ పవర్​గా భారత్.. ప్రపంచ మార్కెట్​ను ఆక్రమించేలా దేశీయ వ్యవస్థలు!'

author img

By

Published : Sep 17, 2022, 9:34 PM IST

Modi Speech On National Logistics policy

దేశంలో రవాణా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ లాజిస్టిక్స్‌ పాలసీని ప్రకటించారు. వ్యాపారాల రవాణా ఖర్చులను 14 శాతం నుంచి పది శాతం కంటే తక్కువగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. పీఎం గతిశక్తిలో భాగంగా మౌలిక వసతుల కొరతను తీరుస్తామని చెప్పారు. దేశీయ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్‌ను ఆక్రమించేలా వ్యవస్థలను ఆధునికీకరిస్తామని వివరించారు.

PM Modi Speech National Logistics policy : దేశంలో రవాణా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ లాజిస్టిక్స్‌ పాలసీని ప్రకటించారు. వ్యాపారాల రవాణా ఖర్చులను 14 శాతం నుంచి పది శాతం కంటే తక్కువగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. 'పీఎం గతిశక్తి'లో భాగంగా మౌలిక వసతుల కొరతను తీరుస్తామని చెప్పారు. దేశీయ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్‌ను ఆక్రమించేలా వ్యవస్థలను ఆధునికీకరిస్తామని వివరించారు. దేశంలో ఉన్న పెట్టుబడుల అనుకూల వాతావరణం పట్ల ప్రపంచ నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని గుర్తుచేశారు.

ప్రగతి పథంలో దూసుకెళుతున్న భారత్‌ సూపర్‌పవర్​గా అవతరిస్తోందని మోదీ పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా లాజిస్టిక్‌ రంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు తెలిపిన ప్రధాని.. ఈ-వే బిల్లులు, ఫాస్టాగ్‌ వంటి చర్యలు ఈ రంగం సామర్థాన్ని పెంచాయని వ్యాఖ్యానించారు. డ్రోన్లు కూడా లాజిస్టిక్‌ రంగం మరింత పురోగమించేందుకు దోహదపడతాయన్నారు. సాగర్‌ మాల ప్రాజెక్టులో భాగంగా పోర్టుల సామర్థ్యాన్ని పెంచామన్న ఆయన దేశం ప్రస్తుత తయారీరంగ హబ్‌గా అవతరిస్తోందని పేర్కొన్నారు.

'స్కిల్లింగ్‌, రీ స్కిల్లింగ్‌, అప్‌ స్కిల్లింగ్‌ నినాదంతో ముందుకు సాగాలి'
అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక రంగానికి అనుగుణంగా యువత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. స్కిల్లింగ్‌, రీ స్కిల్లింగ్‌, అప్‌ స్కిల్లింగ్‌ నినాదంతో ముందుకు సాగాలని యువతకు సూచించారు. దేశంలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు కేంద్రం 5 వేలకుపైగా స్కిల్ హబ్‌లను ప్రారంభించబోతోందని ప్రధాని మోదీ తెలిపారు. ఐటీఐ విద్యార్థుల స్నాతకోత్సవం సందర్భంగా మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. సాంకేతికత అభివృద్ధితో దేశంలో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయని ప్రధాని తెలిపారు. గత ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం 5 వేల కొత్త ఐటీఐలను ప్రారంభించిందని వెల్లడించారు. పునరుత్పాదక ఇంధనం, సోలార్ పవర్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో దేశం ముందంజలో ఉందన్న మోదీ ఆయా రంగాల్లో నూతన ఆవిష్కరణలు చేయాలని సూచించారు.

'లక్షలాది మంది తల్లులు నన్ను ఆశీర్వదించారు'
గత శతాబ్దంతో పోలిస్తే ప్రస్తుత నయా భారత్‌లో నారీ శక్తి ఇనుమడించిందని ప్రధాని మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌లో స్వయం సహాయక సంఘాలతో సమావేశమైన మోదీ నవ భారత్‌లో మహిళలు పంచాయతీ భవన్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు తమ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. తల్లులు, సోదరీమణులు తన బలం, స్ఫూర్తి అని మోదీ వివరించారు. తన జన్మదినం సందర్భంగా ఆశీర్వదించిన వేలాది మంది తల్లులను చూస్తే సంతోషంగా ఉందని మోదీ భావోద్వేగానికి గురయ్యారు.

"ఇవాళ నా జన్మదినం అని గుర్తు చేశారు. నాకు మాములుగా గుర్తుండదు. ఈ రోజున నేను సాధారణంగా మా అమ్మ వద్దకు వెళ్లి.. ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటాను. కానీ ఇవాళ నేను మా అమ్మ దగ్గరికి వెళ్లలేకపోయాను. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన గిరిజనులు, బలహీనవర్గాలు, గ్రామగ్రామాన అద్భుతాలు చేస్తున్న లక్షలాది మంది తల్లులు ఈరోజు నన్ను ఆశీర్వదించారు. ఈ దృశ్యాన్ని మా అమ్మ చూస్తే చాలా సంతోషిస్తుంది. ఇంత భారీ సంఖ్యలో తల్లులు, అక్కాచెల్లెల్లు, కుమార్తెలు... నాకు ఆశీర్వాదాలు అందించడం చాలా బలాన్నిస్తుంది. స్ఫూర్తిగా నిలుస్తుంది. తల్లీ కూతుర్లు, అక్కాచెల్లెల్లు నాకు అతి పెద్ద రక్షణ కవచాలు."

-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

ఇదీ చదవండి: సముద్రం మధ్యలో ఉండగా నౌకలోకి నీరు.. 19 మందిని కాపాడిన కోస్ట్​ గార్డ్

హ్యాపీ బర్త్​డే మోదీ.. చాయ్​ కప్పులతో సైకతశిల్పం.. ఆ వీరాభిమాని 8 ఏళ్లుగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.